రంగారెడ్డి జిల్లాలో పంటల వివరాల నమోదు ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. వానకాలానికి సంబంధించి రైతులవారీగా పంటల వివరాలను అధికారులు సేకరించి ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు(ఏఈవో) క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సర్వే నంబర్, సాగు విస్తీర్ణం, పంట, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంట, నీటి వసతి తదితర వివరాలను రైతుల సంతకాలతో సహా సేకరిస్తున్నారు. ఈ ప్రక్రియ వారం రోజులుగా సాగుతుండగా.. ఇప్పటివరకు 2,11,806 ఎకరాల వివరాలను నమోదు చేశారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 3లక్షలకుపైగా ఎకరాల్లో పంటలు సాగవ్వగా.. ఇందులో అధికంగా 1.33లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. పంటల నమోదుతో బోరు, బావులు, చెరువుల ద్వారా సాగయ్యే భూ విస్తీర్ణం, రానున్న దిగుబడిని అంచనా వేసి అందుకనుగుణంగా కొనుగోలు ఏర్పాట్లు చేపట్టనున్నారు.
రంగారెడ్డి, జులై 21, (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులుగా పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియ గత రెండేండ్ల నుంచి కొనసాగుతున్నది. జిల్లాలోని అన్ని గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు పర్యటిస్తూ రైతుల వారీగా సాగు విస్తీర్ణం వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తున్నారు. రైతులవారీగా సర్వే నంబర్, సాగు విస్తీర్ణంతోపాటు చేసిన పంట, విత్తన రకం, ప్రధాన పంట, అంతర పంట, నీటి వసతి వివరాలతోపాటు రైతుల సంతకాలను సేకరిస్తున్నారు. అదేవిధంగా భూమి యజమాని ఫోన్ నంబర్ తదితర వివరాలను మరో యూనిట్గా తీసుకొని ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. రైతులు పండించే పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయడం వల్ల కొనుగోలు విషయంలో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాను ముందస్తు చర్యల్లో భాగంగా పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియకు ప్రభుత్వం నిర్ణయించింది. పంటల వివరాల సేకరణలో భాగంగా నీటి ఆధారాలైన బోరు, బావులు, చెరువుల ద్వారా పారే వివరాలను, రైతులు సాగు చేస్తున్న పంటల ద్వారా రానున్న దిగుబడి వివరాలను కూడా అంచనా వేస్తున్నారు.
ఇప్పటివరకు 2,11,806 ఎకరాలు ఆన్లైన్లో నమోదు
ఆన్లైన్లో పంటల వివరాల నమోదు ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 2,11,806 ఎకరాలకు సంబంధించిన ఆయా పంటల సాగు వివరాలను ఆన్లైన్లో ఏఈవోలు నమోదు చేశారు. జిల్లా రైతాంగం ఇప్పటివరకు 3 లక్షల ఎకరాలకుపైగా ఆయా పంటలను సాగు చేశారు. ఈ ఏడాది జిల్లాలో ప్రభుత్వ సూచనల మేరకు జిల్లా రైతాంగం పత్తి, కంది పంటల సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు సాగైన ఆయా పంటల్లో 60 శాతం మేర పత్తి పంటనే రైతులు చేయడం గమనార్హం. పత్తి పంట తర్వాత అధికంగా మొక్కజొన్న, వరి పంటలను రైతులు సాగు చేశారు. జిల్లావ్యాప్తంగా 2,11,806 ఎకరాలను ఆన్లైన్లో నమోదు చేయగా, పత్తి-1,33,718 ఎకరాలు, మొక్కజొన్న-50,715., వరి-38, 046., కందులు-14,186., జొన్న-2,552., చిరుధాన్యాలు-8, రాగులు-12, పెసలు-79, చెరుకు-11, ఆముదం-6, సోయాబీన్-25, వేరుశనగ-2, ఇతర పంటలు-2,190 ఎకరాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు.
3 లక్షలకుపైగా ఆయా పంటలు సాగు
– గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి
వానకాలం సీజన్కుగాను జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షల ఎకరాలకుపైగా ఆయా పంటల సాగు అయినట్లు జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు సాగైన పంటల్లో పత్తి పంటనే అధిక మొత్తంలో సాగయిందన్నారు. జిల్లాలో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురిసిన దృష్ట్యా పత్తి రైతులు ఎకరానికి 25 కిలోల యూరియా, 15 కిలోల ఎంవోపీని బూస్టర్ డోస్గా వేయాలని, భూమిలో కలియదున్నడం వీలుకాకపోతే ఫోలియార్ స్ప్రే పాలిపీడ లేదా మల్టీ కె లేదా యూరియాను పది గ్రాముల లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలన్నారు. మొక్కజొన్న పంటకుగాను ఎకరానికి 20 కిలోల యూరియా, 10 కిలోల ఎంవోపీని వేయాలని, ఎరువులు వేయడం వీలు కాకపోతే పిచికారీ రూపంలో వేయాలని ఆమె సూచించారు.