వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిస్తున్న రాష్ట్ర సర్కార్ అన్నదాతలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నది. వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నది. అప్పుల తిప్పలు తప్పించేందుకు ‘రైతుబంధు’తో పెట్టుబడి సాయమందిస్తుండగా.. చనిపోయిన రైతు కుటుంబం రోడ్డున పడకుండా ‘రైతుబీమా’తో ఆర్థిక భరోసా ఇస్తున్నది. బీమా సంస్థలకు రైతులు చెల్లించాల్సిన ప్రీమియం డబ్బులను ప్రభుత్వమే చెల్లిస్తూ అన్నదాతకు పైసా ఖర్చులేకుండా బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నది. రైతు ఏ కారణంతో మృతిచెందినా సదరు బాధిత కుటుంబానికి రూ.5లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నది. వికారాబాద్ జిల్లాలో గత నాలుగేండ్లలో 3,635 మంది రైతు కుటుంబాలకు రూ.181.75 కోట్లు అందజేసి అండగా నిలిచింది. గతేడాది ఒక్కో రైతుకు రూ.4,110 చొప్పున ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది. మరోవైపు కొత్తగా పాస్బుక్లు పొందినవారు రైతు బీమాకు దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 31వ తేదీవరకు అధికారులు అవకాశం కల్పించారు.
పరిగి, జూలై 21 : కొత్త రాష్ట్రమైన తెలంగాణలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే దిక్సూచిలా నిలుస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత ముందుగా వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకువచ్చి రైతాంగానికి తోడుగా నిలుస్తున్నారు. వ్యవసాయానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా, పంటల సాగుకు ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేలు అందజేసే రైతు బంధు లాంటి చక్కటి పథకం అమలు చేస్తున్నారు. రైతులు బతికున్నన్ని రోజులు ఆరుగాలం కష్టపడుతూ ఏదైనా కారణంగా రైతు చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడరాదనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బీమా పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రూపకల్పన చేసి అమలు చేస్తున్నారు. రైతు ఏ కారణంగా చనిపోయినా రూ.5లక్షల బీమా సదుపాయం కల్పించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఈ పథకానికి ఐక్యరాజ్య సమితి నుంచి సైతం అభినందనలు అందాయంటే రైతులకు ఎంత ఉపయోగకరంగా ఉందనేది తెలుస్తున్నది. 2018 ఆగస్టు 15న ఎల్ఐసీ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని రైతు బీమాను అమలు చేస్తున్నది. ఇందుకు సంబంధించి ప్రతి సంవత్సరం రైతుల తరఫున ప్రీమియం డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీకి చెల్లిస్తున్నది. గత సంవత్సరం ఒక్కో రైతుకు ప్రీమియం డబ్బులు రూ.4,110 చొప్పున ఎల్ఐసీకి ప్రభుత్వం చెల్లించగా ఈసారి ప్రీమియం సైతం పెరుగనున్నట్లు తెలిసింది. రైతు బీమా పథకం కింద వికారాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటివరకు 3635 మందికి రూ.181.75 కోట్లు అందించారు.
నాలుగేండ్లలో 3635 మందికి రూ.181.75 కోట్లు
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం కింద నాలుగు సంవత్సరాలుగా వికారాబాద్ జిల్లా పరిధిలో 3635 రైతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున రూ.181.75 కోట్లు అందాయి. 2018లో 1,04,822 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో వివిధ కారణాల వల్ల 786 మంది చనిపోగా, వారి కుటుంబాలకు రూ.39.30కోట్లు బీమా డబ్బులు అందించారు. 2019లో 1,22,485 మంది దరఖాస్తు చేసుకోగా.. 815 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోగా 812 మంది రూ.40.60 కోట్లు బీమా డబ్బులు అందాయి. 2020లో 1,24,847 మంది దరఖాస్తులు అందజేయగా.. 1202 మంది రైతులు చనిపోగా 1197 మందికి రూ.59.85 కోట్లు బీమా డబ్బులు అందించారు. 2021లో 1,38,253 మంది దరఖాస్తులు అందజేయగా.. వివిధ కారణాలతో 967 మంది చనిపోగా 840 మందికి రూ.42 కోట్లు రైతు బీమా కింద అందజేశారు. 2022 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే దరఖాస్తున్న చేసుకున్నవారిలో 1,33,825 మంది ఉండగా.. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చినవారు 24,815 మంది.. గత నాలుగేండ్లలో పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారు 50 వేల మంది ఉన్నారు.
అర్హులైన రైతుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం
రైతు బీమా కోసం అర్హులైన రైతుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించారు. జూలై 31 వరకు దరఖాస్తులు నేరుగా వ్యవసాయ విస్తరణాధికారికి అందజేయాలి. 18 నుంచి 59 ఏండ్ల లోపు వయస్సు గలవారు రైతు బీమాకు అర్హులు. రైతులు తమ ఆధార్కార్డు, నామినీ ఆధార్కార్డు జిరాక్స్ కాపీలు, పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీని దరఖాస్తులకు జత చేసి స్వయంగా రైతులు వ్యవసాయ విస్తరణాధికారులకు సమర్పించాలి. రైతులు ఏ కారణంగా చనిపోయినా నామినీకి సంబంధించిన బ్యాంకు ఖాతాలో 10 రోజుల వ్యవధిలో రూ.5 లక్షలు జమ చేయబడుతున్నాయి. ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా, ఎలాంటి పైరవీకి తావు లేకుండానే రైతు బీమా కింద రూ.5 లక్షలు అందిస్తున్నారు. గత పాలకుల హయాంలో ఏ పథకం ద్వారా లబ్ధి చేకూరాలన్నా పైరవీకారులను ఆశ్రయించక తప్పని పరిస్థితి. టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నేరుగా డబ్బులు అందిస్తుండడంతో అత్యంత పారదర్శకంగా సాయం అందుతున్నది. రైతు బీమా కింద రూ.5లక్షలు అందిన అనేక రైతు కుటుంబాలకు ఈ పథకం చేదోడుగా నిలిచిందని చెప్పవచ్చు. ఏవైనా చిన్న చిన్న అప్పులుంటే వాటిని తీర్చడంతోపాటు ఇతర పనుల కోసం ఈ డబ్బులు వినియోగించుకుంటున్నారు.
ఈ నెల 31లోగా దరఖాస్తు చేసుకోవాలి
– గోపాల్, వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి
రైతు బీమా కింద ఈ నెల 31 వరకు అర్హులైనవారు దరఖాస్తులను నేరుగా వ్యవసాయ విస్తరణాధికారులకు అందజేయాలి. 18 నుంచి 59 ఏండ్ల లోపు వయస్సు గల రైతులు దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న రైతు బీమాను సద్వినియోగం చేసుకోవాలి. రైతుల తరఫున ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుంది.