‘ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.. ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు తీసుకోండి.. శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసముండే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించండి.. చెరువులు, కుంటలు, కాజ్వేలను పర్యవేక్షించడంతో పాటు నదులు, వాగుల వద్ద పోలీసు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించండి..’ అని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. బుధవారం వికారాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, పోలీసు కానిస్టేబుల్తో కమిటీ ఏర్పాటు చేశామని, వారు ఎప్పటికప్పుడు పరిస్థితులను ఉన్నతాధికారులకు తెలియజేస్తారన్నారు. కలెక్టర్, ఎస్పీ జిల్లా స్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేయగా, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారన్నారు. వర్షం వల్ల పూర్తిగా కూలిన ఇండ్లస్థానంలో కొత్త ఇండ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్లకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. వర్షాల వల్ల ధ్వంసమైన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. అంతకుముందు ధారూరు మండలం బాచారం వాగు వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులను మంత్రి పరిశీలించారు.
పరిగి, జూలై 13 : ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలతో నెలకొన్న పరిస్థితులు, తీసుకోవాల్సిన చర్యలపై బుధవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలతో ఏర్పడిన పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం సమీక్షిస్తూ ఆదేశాలు ఇస్తున్నారని చెప్పారు. కలెక్టర్, ఎస్పీ జిల్లాస్థాయిలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటివరకు నష్టం జరుగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు మంత్రి చెప్పారు.
ప్రతి గ్రామంలో కమిటీల ఏర్పాటు
ప్రతి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి, పోలీసు కానిస్టేబుల్తో కమిటీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చెరువులు, కుంటలు, కాజ్వేల వద్ద ఎలాంటి ప్రమాదాలు జదుగకుండా అవసరమైన చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. భారీ వర్షాలకు రోడ్లు దెబ్బతింటుంటాయని.. ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖ అధికారులు నిత్యం అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. దీంతో రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో శిథిలావస్థకు చేరిన ఇండ్లను గతంలోనే తొలగించామని, ఇంకా ఎక్కడైనా ఉంటే వాటిలో నివాసముండేవారిని అదే గ్రామంలో సురక్షిత ప్రాంతానికి తరలించామని.. ఈ విషయంలో ఆయా గ్రామాల సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. పాఠశాల భవనాలు పాతవి ఎక్కడైనా ఉంటే పరిశీలించాలని.. శానిటేషన్ పనులు చేపట్టాలని మంత్రి చెప్పారు.
వైద్య, ఆరోగ్య శాఖలు అప్రమత్తం
మరో మూడు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో చెరువులు, కుంటల వద్ద జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు మంత్రి సూచించారు. వానలు తగ్గిన తర్వాత సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదముందని.. అందువల్ల వైద్య, ఆరోగ్య శాఖను అప్రమత్తం చేసినట్లు మంత్రి చెప్పారు. వర్షాలతో కొన్ని ఇండ్లు పాక్షికంగా కూలిపోయాయని, అలాంటివారికి కొంత ఆర్థిక సాయం అందజేసే ఆలోచన చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. పూర్తిగా ఇండ్లు కూలిపోతే ఇళ్లు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. అంతకుముందు ధారూరు మండలం బాచారం వాగు వద్ద నిర్మిస్తున్న కల్వర్టు పనులను మంత్రి సబితారెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా వర్షాలతో పాడైన రోడ్లకు మరమ్మతులు వెంటనే చేపట్టాలని ఆర్అండ్బీ అధికారులను మంత్రి ఆదేశించారు. నదులు, వాగుల వద్ద పోలీసు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించాలని, ప్రవాహ వేగాలు గమనించకుండా వాగులు దాటే ప్రయత్నం చేయవద్దని మంత్రి సబితారెడ్డి ప్రజలకు సూచించారు.
రూ.18కోట్లు డీఎంఎఫ్టీ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు
డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్ట్ నిధులు రూ.18కోట్లతో వివిధ అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఆమోదించినట్లు మంత్రి సబితారెడ్డి తెలిపారు. బుధవారం మంత్రి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ప్రజాప్రతినిధులు, అధికారులతో డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గంలో డీఎంఎఫ్టీ నిధులు రూ.10.37కోట్లతో అభివృద్ధి పనులను చేపట్టేందుకు ఆమోదించినట్లు చెప్పారు. తాండూరు పట్టణంలోని ఇందిరాచౌక్ నుంచి రైల్వేస్టేషన్ వరకు సెంట్రల్ లైటింగ్, భూ సేకరణ బిల్లు చెల్లింపు కోసం రూ.2.85కోట్లు, క్రీడా సామగ్రి కొనుగోలుకు రూ.1.85కోట్లు, తాండూరు నియోజకవర్గంలో అంగన్వాడీ భవనాలు, బస్సు షెల్టర్లు, మరుగుదొడ్లు, అదనపు తరగతి గదులు, మురుకు కాలువలు, స్కిల్ డెవలప్మెట్ సెంటర్లకు రూ.5.67కోట్లు ఆమోదించినట్లు మంత్రి పేర్కొన్నారు. వికారాబాద్ నియోజకవర్గంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మురికికాలువలు, సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.1.73కోట్లు ఆమోదించగా పరిగి నియోజకవర్గంలో మహిళా, శిశు సంక్షేమం, ఇతర సివిల్ పనులకు రూ.3.05కోట్లు ఆమోదించినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటివరకు మంజూరై పెండింగ్లో ఉన్న పనులకు సైతం రూ.3.47కోట్ల డీఎంఎఫ్టీ నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
కార్యక్రమాల్లో చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డాక్టర్ జి.రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, సురభి వాణీదేవి, వికారాబాద్, పరిగి, కొడంగల్, తాండూరు ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కొప్పుల మహేశ్రెడ్డి, పట్నం నరేందర్రెడ్డి, పైలెట్ రోహిత్రెడ్డి, కలెక్టర్ నిఖిల, ఎస్పీ కోటిరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ బి.మనోహర్రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ కృష్ణారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ, జడ్పీ సీఈవో జానకీరెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, అధికారులు, ప్రజాప్రతినిధులున్నారు.