షాబాద్, జూలై 13: చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లో ఉదయం నుండి రాత్రి వరకు ముసురు వర్షం కురిసింది. వర్షాలతో ప్రజలు ఇండ్ల నుండి బయటకు రావడం లేదు. వ్యవసాయ పనులు సాగడం లేదు. భారీ వర్షాల నేపథ్యంతో ప్రభుత్వం మరో మూడు రోజులు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది
మంచాల : ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి జనాలు ఇంటికే పరిమితమయ్యారు. మండలంలో ఇప్పడి వరకు వర్షాలకు 3 ఇండ్లు కూలిపోయినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రజలు శిథిలావస్థలో ఉన్న ఇండ్లల్లో ఉండకుండా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉండేవిధంగా చర్యలు తీసుకుంటున్నామని తహసీల్దార్ అనిత తెలిపారు. వర్షాలకు రాచకొండ ప్రాంతంలోని ఎత్తైన గుట్టల నుంచి జాలువారుతున్న జలపాతాలు ఆకట్టుకుంటున్నాయి.
చెరువులకు జలకళ
పెద్దఅంబర్పేట : మూడ్రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న ముసురు వానలతో చెరువుల్లోకి వరద నీరు చేరుతున్నది. మున్సిపాలిటీలోని పలు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకుంటున్నాయి. గత ఏడాది వర్షాకాలంలో ముగింపులో వచ్చినదానికంటే ఎక్కువ నీరు ఇప్పుడే వచ్చేసినట్టు కనిపిస్తున్నాయి. ఎండాకాలంలో పూర్తిగా ఎండిపోయిన తట్టిఅన్నారం ఊర చెరువులోకి వరద నీరు క్రమంగా పెరుగుతున్నది. తట్టిఖాన చెరువుతోపాటు మర్రిపల్లి, కుంట్లూరు చెరువుల్లోనూ వరద నీరు చేరుతున్నది.
మాసబ్ చెరువుకు..
తుర్కయంజాల్ : తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్ చెరువు పూర్తిస్థాయిలో నిండి జలకళను సంతరించుకుంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు చెరువులో భారీగా నీరు చేరింది. పెద్ద ఎత్తున నీరు చెరువులోకి చేరి చెరువు నిండు కుండలా కనిసిస్తుండటంతో స్థానిక ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కేశంపేట : వర్షాలతో మండలంలోని మంగళిగూడెం, అల్వాల, పాటిగడ్డ, కేశంపేట, లేమామిడి, తొమ్మిదిరేకుల, లింగంధన తదితర గ్రామాల మీదుగా ఉన్న వాగు పెద్ద ఎత్తున ప్రవహిస్తున్నది. భైర్ఖాన్పల్లి, ఎక్లాస్ఖాన్పేట గ్రామాల్లోని చెరువుల్లోకి నీరు చేరింది. మండలంలో 122.4 ఎంఎం వర్షపాతం నమోదైనటు అధికారి కల్యాణి తెలిపారు.