జిల్లాలో వానకాలం పంటల సాగు ముమ్మరంగా సాగుతున్నది. ఇప్పటివరకు లక్ష ఎకరాల్లో రైతులు ఆయా పంటలు సాగు చేశారు. కొన్నిరోజులుగా వర్షాలు జోరుగా కురుస్తుండడంతో పంటల సాగు ఊపందుకున్నది. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1,01,570 ఎకరాల్లో పంటలు సాగుకాగా, అన్నదాతలు ప్రభుత్వ సూచనల మేరకు పత్తి పంటనే అధికంగా సాగు చేశారు. ఇప్పటికీ సాగైన పంటల్లో 73,506 ఎకరాల్లో పత్తిని సాగు చేశారు. ఈ నెల మూడో వారం వరకు పత్తి పంట సాగుకు అనుకూలమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. దీంతో పత్తి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశమున్నది. మిగతా పంటలు ఆగస్టు రెండో వారం వరకు సాగు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు 18,293 ఎకరాల్లో మొక్కజొన్న, 6,425 ఎకరాల్లో కంది పంట సాగైంది. వచ్చేవారం నుంచి పంటల నమోదును చేపట్టేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు.
-రంగారెడ్డి, జూలై 9, (నమస్తే తెలంగాణ)
రంగారెడ్డి, జూలై 9 (నమస్తే తెలంగాణ): జిల్లాలో వానకాలం పంటల సాగు లక్ష ఎకరాలు దాటింది. వానకాలం ప్రారంభం నుంచి వర్షాలు కురుస్తుండటంతో ఆయా పంటల సాగు జోరందుకున్నది. అయితే రంగారెడ్డి జిల్లాలో ఇప్పటివరకు 1,01, 570 ఎకరాల్లో ఆయా పంటలు సాగయ్యాయి. ప్రభుత్వ సూచనల మేరకు జిల్లాలోని రైతులు పత్తి పంట సాగువైపే మొగ్గు చూపుతుండటం గమనార్హం. ఇప్పటివరకు సాగైన ఆయా పంటల్లో 75 శాతం మేర పత్తి పంటను సాగు చేశారు. ఈనెల మూడో వారం వరకు పత్తి పంట సాగుకు అనుకూలమని వ్యవసాయాధికారులు చెబుతున్నారు. తర్వాత సాగు చేస్తే దిగుబడిపై ప్రభావం చూపే అవకాశముందని సూచిస్తున్నారు. మరోవైపు మిగతా పంటలను ఆగస్టు రెండో వారం వరకు సాగు చేసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.
విత్తనాలు, ఎరువులను రైతులకు ఇబ్బందు ల్లేకుండా అందించేందుకు జిల్లా వ్యవసాయ శాఖ అవసరమైన చర్యలు చేపట్టింది. అదేవిధం గా వచ్చే వారం నుంచి రైతులు సాగు చేస్తున్న ఆయా పంటల వివరాలను ఆన్లైన్లో అధికారులు నమోదు చేయనున్నారు.
రంగారెడ్డి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో విత్తనాలను నాటడంలో జిల్లా రైతులు నిమగ్నమయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో 1,01,570 ఎకరాల్లో ఆయా పంటలు సాగు కాగా, అధికంగా పత్తి పంటను సాగు చేశారు. ఈ వానకాలంలో పత్తి పంట సాగును అధిక మొత్తంలో పెంచాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులు గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయగా సత్ఫలితాలను ఇస్తున్నది. వానకాలంలో ఆయా పంటలు మొత్తం 4,88,597 ఎకరాల్లో సాగు అవుతాయని అధికారులు అంచనా వేయగా అందులో పత్తి-2,75,050 ఎకరా ల్లో, కంది-70,520 ఎకరాల్లో, వరి-75,000 ఎకరాల్లో, మొక్కజొన్న 48,000 ఎకరాలు, జొన్న 15,000 ఎకరాల్లో, పెసర్లు 352 ఎకరాలు, వేరుశనగ-240 ఎకరాలు, మినుములు 170 ఎకరాలు, ఆముదం 120 ఎకరాలు, సోయాబీన్ 20 ఎకరాలు, ఇతర పంటలు 4,125 ఎకరాల్లో సాగవుతాయని అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు 1,01,570 ఎకరాల్లో ఆయా పంటలు సాగుకాగా, పత్తి-73,506 ఎకరాలు, వరి-11,126 ఎకరాలు, మొక్కజొన్న 18,293 ఎకరాలు, కందులు-6,425 ఎకరాలు, జొన్న 1,652 ఎకరాలు, రాగి 12 ఎకరాలు, పెసర్లు, 66 ఎకరాలు, చెరుకు 10 ఎకరాలు, ఆముదం ఆరు ఎకరాలు, చిరుధాన్యాలు-8 ఎకరాలు, ఇతర పంటలు 938 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అదేవిధంగా జిల్లా లో వానకాలానికి సంబంధించి సరిపడా ఎరువులు, విత్తనాలను అధికారులు అందుబాటులో ఉంచారు. విత్తనాల్లో .. పత్తి-5,50,100 ప్యాకెట్లు, వరి-18,750 క్వింటాళ్లు, జొన్న-600, మొక్కజొన్న-3,840, పెసర్లు -28, కందులు-2,820, మినుములు-13.6, వేరుశనగ-144, ఆముదం-3, సోయాబీన్-7 క్వింటాళ్లు, ఇతర పంటలకు సం బంధించి 495 క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటివరకు పత్తి 3.54 లక్షల ప్యాకెట్లు, వరి 1549 క్వింటాళ్లు, జొన్న 55, పెసర్లు 34, కందులు-55, మినుములు-23 క్వింటాళ్ల విత్తనాలను రైతులు కొనుగోలు చేశారు. అదేవిధంగా ఎరువులకు సంబంధించి జిల్లాకు యూరియా, డీఏపీ, ఎస్ఎస్పీ, ఎంవోపీ, కాంప్లెక్స్ ఎరువులు కలిపి 1,01,841 టన్నులు అవసరమని అధికారులు అంచనా వేయగా, జిల్లాలో ఇప్పటివరకు యూరియా-7,748 టన్నులు, డీఏపీ-3,476 టన్నులు, ఎస్ఎస్పీ-367 టన్నులు, ఎంవోపీ-115 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు-9175 టన్నుల ఎరువులను రైతులు కొనుగోలు చేశారు.
వానకాలానికి సంబంధించి ఆయా పంటల సాగు విస్తృతంగా సాగుతున్నది. ఇప్పటివరకు సాగైన పంటల్లో అధికంగా పత్తి పంటనే రైతులు సాగు చేశారు. ఈనెల మూడో వారం వర కు పత్తి పంటను సాగు చేసేందుకు అనుకూలం. మిగతా పంటలను ఆగస్టు రెండో వారం వరకూ సాగు చేయొచ్చు. జిల్లావ్యాప్తంగా సరిపడా విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచి రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుం టున్నాం.
-గీతారెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి