ఇబ్రహీంపట్నం, జూలై 9 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని పలు చిన్నపాటి కాలువలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావటం లేదు. తెలంగాణాలో రానున్న మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ సమాచారం మేరకు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించటంతో పాటు ఇళ్లులేక ఇబ్బందులు పడుతున్న వారికి ప్రత్యేక ఆవాసాలను కల్పిస్తున్నారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షం
షాబాద్ : చేవెళ్ల నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా ముసురు వర్షం కురుస్తుంది. దీంతో జనాలు ఇండ్లకే పరిమితమయ్యారు. నియోజకవర్గంలోని చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల పరిధిలో శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం, అధికారులు సూచిస్తున్నారు.
చేవెళ్లలో..
చేవెళ్లటౌన్ : చేవెళ్లలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. బావులు, బోర్లు, చెరువులు, కుంటలల్లో నీరు నిండే అవకాశం ఉందిని రైతులు అనందం వ్యక్తం చేస్తున్నారు.
షాద్నగర్లో ముసురు వర్షం
షాద్నగర్టౌన్ : షాద్నగర్లో ముసురుతో కూడిన వర్షం కురింది. మూడు రోజుల నుంచి కురుస్తున్న ముసురు వర్షంతో పలు కాలనీలు బురదమయంగా మారాయి. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. వివిధ అవసరాల నిమిత్తం గ్రామీణ ప్రాంతాల నుంచి షాద్నగర్ వచ్చే ప్రజలు రాకపోవడంతో పట్టణ ప్రధాన దారులు నిర్మానుష్యంగా మారాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సూచించారు.
నిండు కుండాల చెరువులు
షాద్నగర్ రూరల్ : ఫరూఖ్నగర్ మండలంలో రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న ముసురు వర్షంతో వివిధ గ్రామాల్లోని చెరువులు నిండు కుండను తలపిస్తున్నాయి. గ్రామాల్లో చెరువుల నిండటంతో రైతులు,గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బూర్గుల గ్రామంలో గల కొత్తకుంట చెరువు పూర్తిగా నిండింది.