పరిగి, జూన్ 29 : 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వికారాబాద్ జిల్లా వార్షిక రుణ ప్రణాళికను అధికారులు విడుదల చేశారు. గత ఏడాది 2021-22 వార్షిక ప్రణాళికతో పోలిస్తే ఈసారి రూ.1,136కోట్లు పెరిగింది. గత సంవత్సరంతో పోలిస్తే వివిధ రంగాలకు భారీగా రుణాల కేటాయింపులు పెరిగాయి. ఈసారి వార్షిక రుణాల్లో ఎప్పటిలాగే వ్యవసాయ ఆధారిత రంగాలకు పెద్దపీట వేశారు. ప్రధానంగా పంట రుణాలకు గత ఏడాదితో పోలిస్తే సుమారు రూ.719కోట్లు పెంచారు. 2022-23 వార్షిక రుణ ప్రణాళిక మొత్తం రూ.6,644కోట్లుగా నిర్ణయించారు. ఇందులో ప్రాధాన్యతా రంగాలకు రూ.5,692కోట్లు కేటాయించగా ప్రాధాన్యేతర రంగాలకు రూ.952 కోట్లు కేటాయించారు. ప్రధానంగా వ్యవసాయ పంట రుణాలు, కాలపరిమితి రుణాలు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలకు రుణాలు, మత్స్య, డెయిరీ, పౌల్ట్రీ రంగాలకు విరివిగా రుణాలు అందజేయనున్నారు. దీంతోపాటు విద్యారంగం, హౌసింగ్ రుణాలు తదితర వాటినీ పెంచారు.
ఈ ఏడాది వార్షిక రుణ ప్రణాళిక రూ.6,644కోట్లు
2022-23 ఆర్థిక సంవత్సరానికి వికారాబాద్ జిల్లా వార్షిక రుణ ప్రణాళిక రూ.6,644కోట్లుగా నిర్ధారించారు. గత ఏడాది వార్షిక రుణ ప్రణాళిక రూ.5,508కోట్లుగా నిర్ధారించగా ఈసారి అదనంగా రూ.1,136కోట్ల రుణాలు పెంచారు. ఇందులో ప్రాధాన్యతా రంగాలకు 85.69 శాతం రుణాలుగా రూ.5,692కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు 14.31 శాతం రూ.952 కోట్లు కేటాయించారు. ప్రధానంగా వ్యవసాయాధారిత రంగాలకు రుణాలు పెంచారు. ఈ సంవత్సరం వ్యవసాయ, అనుబంధ రంగాలకు సంబంధించి మొత్తం రూ.3,440కోట్లుగా రుణ ప్రణాళిక సిద్ధం చేయగా.. ఇందులో ప్రధానంగా పంట రుణాలు, కాలపరిమితి రుణాలకు కలిపి మొత్తం రూ.3,440కోట్ల రుణాలు అందించాలని నిర్ణయించారు. ఇందులో పంటరుణాలుగా ఈసారి వానకాలంలో 1,13,949 మందికి రూ.1,457కోట్లు, యాసంగిలో 75,966 మందికి రూ.977కోట్లు.. రెండు సీజన్లకు కలిపి మొత్తం 1,89,915 మంది రైతులకు పంట రుణాలుగా రూ.2,434కోట్లు అందించనున్నారు. ఇందులో ప్రధానంగా పత్తి పంట రుణాలుగా 67,263 మంది రైతులకు రూ.778కోట్లు, వరి సాగుకు 52,228 మందికి రూ.412కోట్లు, కూరగాయల సాగుకు సంబంధించి 29,209 మంది రైతులకు రూ.284కోట్లు రుణాలుగా అందించాలన్నది లక్ష్యం.
కాలపరిమితి రుణాలు రూ.1,006కోట్లు
వీటితోపాటు రూ.1,006కోట్లు కాలపరిమితి రుణాలుగా అందించనున్నారు. సూక్ష్మతరహా పరిశ్రమలకు 18,315 మందికి రూ.510కోట్లు, చిన్నతరహా పరిశ్రమలకు 5,904 మందికి రూ.295 కోట్లు, మధ్యతరహా పరిశ్రమలకు 341 మందికి రూ.209కోట్లు రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్దేశించారు. విద్యారంగానికి సంబంధించి ఈసారి 2,534 మందికి రూ.150కోట్లు ఎడ్యుకేషనల్ లోన్లు అందించాలని నిర్ణయించారు. వివిధ రకాల హౌసింగ్ రుణాలు 6,585 మందికి రూ.936కోట్లు అందించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. రెన్యువబుల్ ఎనర్జీ రంగానికి కూడా రూ.73కోట్లు రుణ లక్ష్యం నిర్దేశించారు. మొత్తం ప్రాధాన్యతా రంగాల కింద 2,63,362 మందికి రూ.5,692కోట్లు రుణాలు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా ప్రాధాన్యేతర రంగాల్లో 13,855 మందికి రూ.1,236కోట్లు రుణ లక్ష్యంగా ప్రణాళిక రూపొ ందించారు. ఉద్యానవన పంటలకు సంబంధించి 1,755 మందికి రూ.70కోట్లు, పాడి పరిశ్రమ అభివృద్ధికి 6,996 మందికి రూ.154కోట్లు, పౌల్ట్రీ ఫారాలకు 596 మందికి రూ.67కోట్లు, మేకలు, గొర్రెల పెంపకానికి సంబంధించి 4,702 మందికి రూ.77కోట్లు రుణాలుగా అందించాలని లక్ష్యంగా నిర్దేశించి ప్రణాళికలో పొందుపరిచారు. వీటితోపాటు ప్రాధాన్యేతర రంగాల్లో వ్యవసాయ రంగానికి సంబంధించి 2,209 మందికి రూ.142కోట్లు, విద్యా రుణాలు 549 మందికి రూ.85కోట్లు, హౌసింగ్ రుణాలు 621 మందికి రూ.161 కోట్లు, పర్సనల్ లోన్లు 1,953 మందికి రూ.105కోట్లు, పెద్ద పరిశ్రమలకు 145 మందికి రూ.181కోట్లు రుణాలందించాలని లక్ష్యంగా నిర్దేశించారు.
గత సంవత్సరం లక్ష్యం చేరని రుణాలు
గత ఆర్థిక సంవత్సరం 2021-22లో నిర్దేశించిన లక్ష్యం మేరకు రుణాలు అందించలేదు. గతేడాది పంట రుణాలుగా రూ.1,715కోట్లు ఇవ్వాలని నిర్దేశించగా రూ.1,281కోట్లు (75 శాతం) రుణాలు అందించారు. ఇందులో వానకాలంలో రూ.1,028కోట్లకు రూ.813కోట్లు(79 శాతం), యాసంగిలో రూ.687కోట్లకు రూ.468 కోట్లు(68శాతం) రుణాలిచ్చారు. వ్యవసాయ రంగానికి సంబంధించి కాలపరిమితి రుణాలుగా రూ.969కోట్లకు రూ.609కోట్లు(63శాతం) అందించారు. చిన్నతరహా, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.836కోట్లకు రూ.534కోట్లు (64శాతం) అందించారు. ప్రాధాన్యతా రంగాల్లో మొత్తం రూ.4643కోట్లకు రూ.3208 కోట్లు (69శాతం), ప్రాధాన్యేతర రంగాల్లో రూ.865 కోట్లకు రూ.789కోట్లు(91శాతం) రుణాలను అందించారు. గత సంవత్సరం నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు అందించకపోవడంతో ఈసారి తప్పనిసరిగా రుణాల లక్ష్యం సాధించాలని, అన్ని బ్యాంకులు రుణాలు అందించాలని డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవల్ రివ్యూ కమిటీ సమావేశాల్లో నిర్ణయించారు.
లక్ష్యం మేరకు వంద శాతం రుణాలు అందించాలి వికారాబాద్ కలెక్టర్ నిఖిల
పరిగి, జూన్ 29 : నిర్దేశించిన లక్ష్యం మేరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రాధాన్యతా రంగాలకు వంద శాతం రుణాలందించాలని వికారాబాద్ కలెక్టర్ నిఖిల సూచించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన బ్యాంకర్లు, వివిధ సంక్షేమ శాఖల అధికారులతో డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2022-23 ఆర్థికసంవత్సరానికి వార్షిక రుణ ప్రణాళికను రూ.6,644కోట్లుగా నిర్దేశించినట్లు చెప్పారు. ఇందులో ప్రాధాన్యతా రంగాలకు రూ.5,692కోట్లు, ప్రాధాన్యేతర రంగాలకు రూ.952కోట్ల చొప్పున రుణాలు అందించాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ రుణాలను బ్యాంకర్లు వెంటనే గ్రౌండింగ్ చేయాలని పేర్కొన్నారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యాల మేరకు రుణాలు అందించలేదన్నారు. ఈసారి వంద శాతం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఆర్వోబీ జనరల్ మేనేజర్ యశోదాబాయి మాట్లాడుతూ.. డీసీసీ, డీఎల్ఆర్సీ సమావేశాలు సకాలంలో జరుపాలని సూచించారు. బ్యాంకర్లు సకాలంలో క్వార్టర్లీ రిటర్న్లు అందజేయాలని, మొండి బకాయిల వసూలు కోసం అధికారులు బ్యాంకర్లకు సహకరించాలన్నారు. గ్రామీణ బ్యాంకు శాఖలతో ప్రతి నెలా విధిగా ఆర్థిక అక్షరాస్యతపై సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అనంతరం యశోదాబాయితో కలిసి కలెక్టర్ 2022-23 వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. కార్యక్రమంలో ఎల్డీఎం రాంబాబు, ఆర్బీఐ ఎల్డీవో పూర్ణిమ, నాబార్డ్ డీడీఎం ప్రవీణ్కుమార్, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రామకృష్ణ, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ రీజినల్ మేనేజర్ సయ్యద్ యూసఫ్ అలీ, ఏపీజీవీబీ ఆర్ఎం గోపాల్, డీఆర్డీవో కృష్ణన్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి చక్రపాణి, సంక్షేమ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.