షాద్నగర్టౌన్, జూన్ 18: సిజేరియన్ ప్రసవాలను తగ్గించి సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని షాద్నగర్ డిప్యూటీ డీఎంహెచ్వో దామోదర్ వైద్యారోగ్య సిబ్బంది సూచించారు. ఫరూఖ్నగర్ మండలం చించోడ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏఎన్ఎం, ఆశవర్కర్లకు శనివారం పట్టణంలో గర్భవతులకు సంబంధించి సులభతరమైన ప్రసవాల వ్యాయామాలపై జిల్లా పబ్లిక్ హెల్త్నర్స్ విజయలక్ష్మితో కలిసి శిక్షణ ఇచ్చారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిజేరియన్ ప్రసవాలను పూర్తిస్థాయిలో తగ్గించే విధంగా కృషి చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా గర్భవతులు ఎలాంటి వ్యాయామాలు చేయడం ద్వారా సాధారణ ప్రసవాలు అవుతాయనే విషయాన్ని వారికి క్లుప్తంగా వివరించాలని సూచించారు. గర్భిణులకు పోషహాకారంతో కలిగే లాభాలను వివరించాలని, వారికి ఐరన్, క్యాల్షియం మాత్రలను ఎప్పటికప్పుడు అందించాలన్నారు. అదే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో 30సంవత్సరాలు దాటిన వారందరికీ అంటు వ్యాధులు, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించి మాత్రలను అందించాలన్నారు. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం ఉన్నవారికి టీ.బీ పరీక్ష చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ శ్రీనివాస్, సూపర్వైజర్ చంద్రకళ, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు.