కొడంగల్, జూన్ 18 : అధిక సాంద్రత పద్ధతిలో పత్తి పంటను సాగు చేయడం వల్ల రైతులకు లాభాలు వస్తాయని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. శనివారం మండలంలోని పర్సాపూర్ రైతు వేదికలో కొడంగల్ డివిజన్లోని రైతులకు అధిక సాంద్రత పద్ధతితో పత్తి పంట సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గోపాల్ మాట్లాడుతూ చెల్క భూముల్లో అధిక దిగుబడిని సాధించడానికి పైలట్ ప్రాజెక్టుగా కొంతమందిని ఎంపిక చేసి అధిక సాంద్రత పద్ధతితో పత్తి పంట సాగును ప్రోత్సహిస్తున్నామన్నారు.
మామూలు పద్ధతిలో పత్తి పంటను సాగుచేస్తే రెండు ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయని, కొత్త పద్ధతిలో సాగు చేస్తే 5 ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయని అన్నారు. త్వరగా కాపుకు వచ్చి ఒకేసారి పగిలే పత్తి రకాలను ఎంచుకోవాలని, విత్తే దూరం తగ్గించి ఎకరాకు 25000 మొక్కలు ఉండేలా చూసుకుంటూ మేపిక్వాట్ క్లోరైడ్, 5శాతం పెరుగుదల హార్మోన్ 200 ఎంఎల్ మందును 45, 65 రోజులకు ఒకసారి పిచికారీ చేసుకోవాలని గోపాల్ రైతులకు సూచించారు. కార్యక్రమంలో కొడంగల్, బొంరాస్పేట ఏవోలు బాలాజీ ప్రసాద్, పద్మావతి, రైతుబంధు మండల అధ్యక్షుడు బస్వరాజ్, ఏఈవోలు పాల్గొన్నారు.
అధిక సాంద్రత నేలలో పత్తిని పండించాలి
కులకచర్ల, జూన్ 16 : తేలిక పాటి నేలలో తక్కువ కాల వ్యవధిలో అధిక సాంద్రతతో విత్తుకోవడం వలన అధిక దిగుబడులు సాధించవచ్చునని జిల్లా వ్యవసాయాధికారి గోపాల్ అన్నారు. శనివారం కులకచర్ల మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతులకు పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు అధిక సాంద్రత పత్తి పంటలను పండించడం ద్వారా అధిక దిగుబడి వస్తుందన్నారు. అధిక సాంద్రత పద్ధతిలో సాలుకు సాలుకు 90 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మధ్య 20 సెంటీ మీటర్లు ఉండేలా పత్తివిత్తనాలు విత్తుకోవాలన్నారు. దీని ద్వారా ఎకరాకు 25వేల మొక్కలు వస్తాయి తెలిపారు.
పంటకాలం నవంబర్, డిసెంబర్లో కోతకు వస్తుందన్నారు. ఎకరాకు విత్తన నమోదు 25కేజీలు వాడాలని, అధిక సాంద్రత విత్తనాలు నూజివీడు కంపెనీకి చెందినవి దొరుకుతాయని తెలిపారు. ఏరువాక కేంద్రం తాండూరు శాస్త్రవేత్త యమున పత్తిలో చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి వివరించారు. కులకచర్ల మండల రైతు బంధు సమితి అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో రైతులు అధిక దిగుబడులు పొందాలని అన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, కులకచర్ల మండల వ్యవసాయాధికారి వీరస్వామి, పరిగి డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మీకుమారి, నూజివీడు అధికారి నర్సింహ్మారెడ్డి, నర్సింలు, శ్రీకాంత్, రాశీ సీడ్స్ ప్రతినిధి నాగేశ్వర్రావు, దోమ మండల వ్యవసాయాధికారి ప్రభాకర్, దోమ, కులకచర్ల, చౌడాపూర్ మండలాల వ్యవసాయ విస్తరణాధికారులు పాల్గొన్నారు.