షాద్నగర్రూరల్, మార్చి 7 : తెలంగాణ కాశీ శైవక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మండలంలోని రామేశ్వరాలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. మహాశివరాత్రి పర్వదినం రోజున సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ అధికారి శివకుమార్ తెలిపారు. అన్ని మౌలిక వసతులను సమకూర్చినట్లు తెలిపారు.
అలయ పరిసర ప్రాంతంలో సువిశాలమైన ప్రదేశాల్లో ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్ వాహనాలకు వేర్వేరుగా పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ఆలయ సమీపంలో తాత్కాలికంగా ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. మహాశివరాత్రి సందర్భంగా శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు స్వచ్ఛంద సేవాసంస్థల ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన, పలు సాంస్కృతిక కార్యక్రమాలను చేపట్టనున్నారు.
ఇబ్రహీంపట్నం : మంచాల మండలం నోముల గ్రామంలోని మల్లికార్జున ఆలయం, ఇబ్రహీంపట్నం త్రిశక్తి ఆలయం, శివాలయం, దండుమైలారం గ్రామంలో పురాతన శివాలయంతోపాటు ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్, తుర్కయాంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్లోని వివిధ ఆలయాలను అలంకరించారు. భక్తులు ఆలయాలను సందర్శించే అవకాశమున్నందున అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.
షాద్నగర్టౌన్ : పట్టణంలోని శివమారుతిగీతా అయ్యప్ప మందిరంలోని గిరిజామృత లింగేశ్వరస్వామికి ఉదయం నుంచి ప్రత్యేక అభిషేకాలు, దర్శన కార్యక్రమాలు ఉంటాయని అర్చకులు తెలిపారు. స్వామివారి దర్శనం కోసం విచ్చేసే భక్తులు క్యూలో వచ్చేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేంకటేశ్వరస్వామి, కన్యకాపరమేశ్వరి, దత్తాత్రేయస్వామి, చౌడమ్మగుట్ట వీరాంజనేయస్వామి, ఆర్టీసీకాలనీ, సాయిబాబా, ఈశ్వర్కాలనీల్లోని శివాలయాలు ముస్తాబయ్యాయి.