మొయినాబాద్ : డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని అనుసరించి దేశంలో పరిపాలన కొనసాగుతుందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మండల పరిధిలోని హిమాయత్నగర్ చౌరస్తాలో ఉన్న అంబేద్కర్, బాబు జగ్జీవన్రామ్ విగ్రహాలకు చత్రీలను ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జడ్పీటీసీ కాలె శ్రీకాంత్లతో కలిసి ప్రారంభించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ దేశంలోని ఏ ఒక్క వర్గానికి కాకుండ అన్ని వర్గాల ప్రజల ఆర్థిక, రాజకీయ, సామాజిక స్థితిగతులపై అధ్యాయనం చేసి భారత రాజ్యాంగాన్ని రచించాడన్నారు.
అట్టడుగు వర్గంలో పుట్టిన అంబేద్కర్ ఉన్నత చదువులను చదివి భారత దేశానికి గొప్ప రాజ్యాంగ గ్రంథాన్ని అందించిన మానీయుడని ఆయన కొనియాడాడు. రాజ్యాంగ స్ఫూర్తితోనే నేడు దేశంలో పరిపాలన కొనసాగుతుందని చెప్పారు. రాజ్యాంగ ఫలాలను అణగారిన వర్గాల ప్రజలకు చేరవేయడానికి బాబు జగ్జీవన్రామ్ కృషి చేశారని పేర్కొన్నారు. రాజకీయంగా ఎదిగి ఉన్నత పదవులు అధిరోహించి బడుగుబలహీన వర్గాల ప్రజలకు సేవలు అందించిన మహానీయులు జగ్జీవన్రామ్ అని అన్నారు. మహానీయుల విగ్రహాల నీడ కోసం చత్రీలను ఏర్పాటు చేసిన దాత ముదిగొండ మహేందర్యాదవ్ను ఆయన అభినందించారు.
కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ డప్పు రాజు, సర్పంచ్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఎం మంజూల, మండల అధ్యక్షుడు కోట్ల నరోత్తంరెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు మోర శ్రీనివాస్, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయంత్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త నర్సింహారెడ్డి, జిల్లా నాయకులు రవియాదవ్, మండల నాయకులు రాఘవేందర్యాదవ్, మండల కార్యదర్శి పూసల పరమేశ్, అంబేద్కర్ సంఘం యువజన సంఘం అధ్యక్షుడు సుమన్, టీఆర్ఎస్ మండల నాయకులు దర్గ రాజు పాల్గొన్నారు.