పెద్దేముల్ : తెలంగాణ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకానికి రూ. 50వేల కోట్లు కేటాయించి రైతుల పంటలకు పెట్టుబడి సాయం రూపంలో డబ్బులను అందించి రైతుల ఇబ్బందులు దూరం చేస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ అని తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని గొట్లపల్లి మోడల్ స్కూల్లో నిర్వహించిన రైతుబంధు వారోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొని పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణలో రైతులకు పెద్దపీట వేస్తున్నారని, ప్రస్తుతం రైతుల వలసలు ఆగిపోయి రాష్ట్ర మంతటా పచ్చదనంతో సస్యశామలం అయిందని అన్నారు. అదే విధంగా కళాశాలలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకొచ్చారని, ఆ సమస్యలను త్వరలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తానన్నారు.
విద్యార్థులు కష్టపడి ఉన్నతంగా చదువుకొని పాఠశాలకు, గురువులకు మంచిపేరు ప్రతిష్టలను తీసుకురావాలని సూచించారు. రైతుబంధు వారోత్సవాల్లో గెలుపొందిన, పాల్గొన్న విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించి, బహుమతులతో ప్రోత్సహించారు. ముఖ్యంగా పాఠశాల ఆవరణలో రైతుబంధు సంబురాల పేరుతో వేసిన చిత్రపటాలను, రైతుబంధు ఆకారంలో విద్యార్థులు చేసిన ప్రదర్శనను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వివిధ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను ప్రధానం చేశారు. అనంతం ఎమ్మెల్యేను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనురాధ, ఎంపీటీసీ లొంక నీలు, కళాశాల ప్రిన్సిపాల్ రాఘవేందర్, గాజీపూర్ సర్పంచ్ వీరప్ప, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.