రంగారెడ్డి, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): సామాన్యులకు సన్న బియ్యం ధరలు దడ పుట్టిస్తున్నాయి. రోజురోజుకూ వాటి ప్రైస్ పెరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాలు బియ్యం ధర రూ.5,500 నుంచి రూ.6,200 వరకు పలుకుతున్నది. యాసంగిలో వరి సాగు తగ్గడంతో రానున్న రోజుల్లో దీని ప్రభావం మరింతగా ఉండనున్నది. దీంతో ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ప్రజల్లో గుబులు మొదలైంది. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకుని బియ్యాన్ని బ్లాక్ చేస్తూ వ్యాపారులు పెద్ద ఎత్తున దండుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. బియ్యం ధరలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.
ఇక్కడ పండించిన సన్నాలను ఇతర రాష్ర్టాలకు తరలిస్తుండడం, మిల్లర్లు, దళారులు నేరుగా రైతుల నుంచే వడ్లను కొని బియ్యంగా మార్చి స్టాక్ చేస్తున్నారు. మార్కెట్లో డిమాండ్ను ఆసరాగా చేసుకుని బియ్యం వ్యాపారులు ఇష్టారీతిన ధరలు పెంచుతున్నారన్న విమర్శలున్నాయి. గతేడాది జనవరిలో కొత్త రకం బియ్యం క్వింటాలు ధర రూ. 3,200 నుంచి రూ.3,400 చొప్పున లభించగా.. 2023 అక్టోబర్ నుంచి క్వింటాలు ధర రూ.4,500 నుంచి రూ.5వేల చొప్పున విక్రయించారు. ఆ తర్వాత ధరలు ఒకేసారి అమాంతం రూ.1,300 నుంచి రూ.1,800 వరకు పెరిగాయి. పాత బియ్యం ధర రూ. 4,200 నుంచి రూ.4,500 వరకు పెరిగింది. ప్రస్తుతం బియ్యం ధరలు మరింతగా పెరిగి నాణ్యతను బట్టి రూ.5,500 నుంచి రూ.6,200 వరకు వ్యాపారులు విక్రయిస్తున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా ధరలు పెరుగుతుండడంతో సామాన్యులు బియ్యం కొనలేని పరిస్థితి నెలకొంది.
బియ్యం ధరల పెరుగుదలను కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఒకే రకమైన బియ్యాన్ని వివిధ బ్రాండ్లుగా మార్చి విక్రయిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లాలో పలుచోట్ల టాస్క్ఫోర్స్, విజిలెన్స్, సివిల్ సప్లయ్ శాఖల అధికారులు జరిపిన తనిఖీల్లో ఈ వ్యవహారం వెలుగుజూసింది. కొన్ని చోట్ల రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి పలు రకాల బియ్యాన్ని అందులో కలిపి సంచుల్లో నింపి పలు రకాల బ్రాండ్ల పేరిట ప్యాక్ చేసి మార్కెట్కు తరలిస్తున్నారు. హోటళ్లు, రిటైల్ వ్యాపారులకు ఈ తరహా బియ్యాన్ని ఎక్కువగా అంటగడుతున్నట్లు తెలిసింది.
రానున్న రోజుల్లో సన్న బియ్యం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. రైతులు విక్రయించిన సన్నరకాల ధాన్యాన్ని మిల్లర్లు నిల్వ చేస్తున్నారు. సన్న బియ్యం స్టాక్ అంతా వ్యాపారుల గుప్పిట్లోనే ఉండడంతో ధరలపై నియంత్రణ లేకుండా పోయింది. మరోపక్క ఈసారి యాసంగి సాగులో పంటల సాగు విస్తీర్ణం తగ్గడం కూడా ధాన్యం ధరల పెరుగుదలపై ప్రభావం చూపనున్నది. యాసంగిలో గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితులు ఏర్పడ్డాయి. గతేడాది 1,23,240 ఎకరాల్లో రైతాంగం పంటలను సాగు చేయగా.. ప్రస్తుత యాసంగిలో గతంలో కంటే 20వేల ఎకరాల్లో తక్కువగా పంటల సాగు నమోదైంది.
వరి విషయానికొస్తే.. గత యాసంగిలో వరి సాగు 90,447 ఎకరాలుంటే.. ప్రస్తుత యాసంగిలో 83,110 ఎకరాల్లో మాత్రమే సాగు అయింది. ఈ పరిస్థితుల కారణంగా వచ్చే రోజుల్లో బియ్యం ధరలు మరింతగా పెరుగనున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు. ఈ విషయం సామాన్యులను మరింతగా కలవరపాటుకు గురిచేస్తున్నది. నిత్యావసరాలను రోజూ పర్యవేక్షిస్తూ ధరలు పెరిగినప్పుడు నియంత్రణకు సలహాలు ఇవ్వాల్సిన ఆహార సలహాల సంఘాలు సైతం పత్తాలేకుండా పోయాయి. దీనికితోడు అధికారులు ఎప్పటికప్పుడు మిల్లులు, గోదాముల్లో తనిఖీలు చేపట్టకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా మార్కెట్ను శాసిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బియ్యం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.