మైనార్టీ విద్యార్థులకు గురుకులాలు వరంగా మారాయి. ఐదు నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వం ఉచితంగా నాణ్యమైన విద్యనందిస్తున్నది. జిల్లాలో ఆరు గురుకులాలను నెలకొల్పి సకల సౌకర్యాలను కల్పించింది. విశాలమైన భవనం, క్రీడామైదానం, డిజిటల్ తరగతుల నిర్వహణతో విద్యార్థులు ఇంటిని మరిపించేలా చేస్తున్నాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా ఉన్న ఈ గురుకులాల్లో 2,880 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఇటీవల వెలువడిన టెన్త్, ఇంటర్లలో ఉత్తమ ఫలితాలు సాధించారు. చదువుతో పాటు క్రీడలు, సాంస్కృతిక అంశాల్లోనూ విద్యార్థులు రాణిస్తుండడం గమనార్హం.
తాండూరు, జూలై 25: తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నది. వారికోసం ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి బాలబాలికలకు ఐదు నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా నాణ్యమైన విద్యను అందిస్తున్నది. బాలికలు, బాలురకు వేర్వేరుగా జిల్లాలో ఆరు గురుకులాలను నెలకొల్పి అత్యాధునిక సౌకర్యాలను కల్పించింది. విద్యార్థులకు ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్, రాత్రి సమయంలో పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందిస్తూ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా వసతులను సమకూర్చుతున్నది.విశాలమైన భవనం, క్రీడామైదానం, డిజిటల్ తరగతుల నిర్వహణతో విద్యార్థులు ఇంటిని మరిచిపో తున్నారు. అదేవిధంగా క్రీడలు, సాంస్కృతిక అంశాల్లోనూ గురుకులాల విద్యార్థులు ముందంజలో నిలుస్తున్నారు.
ఆరు మైనార్టీ గురుకులాల్లో 2,880 మంది విద్యార్థులు..
వికారాబాద్ జిల్లాలో ఆరు మైనార్టీ గురుకులాలున్నాయి. తాండూరులోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో 640 మంది విద్యార్థులు, బాలుర మైనార్టీ గురుకులంలో 640, వికారాబాద్ బాలికల గురుకుల విద్యాలయంలో 400, బాలుర గురుకులంలో 400, కొడంగల్ గురుకుల విద్యాలయంలో 400, పరిగిలోని గురుకులంలో 400 విద్యార్థులు.. మొత్తం కలిపి 2,880 మంది విద్యార్థులు ఐదు నుం చి 12వ తరగతి వరకు చదువుతున్నారు. మెరుగైన వసతులతోపాటు గుణాత్మక విద్యను అందిస్తున్నారు. ఈ ఆరు గురుకులాల్లో 75 శాతం మైనార్టీలు, 25 శాతం ఇతరులున్నారు.
ఆటాపాటలతో విద్య..
విద్యార్థులకు చదువుపై ఆసక్తిని పెంచేందుకు ఉపాధ్యాయులు మొదట ఆటాపాటలతో పాఠాలను బోధిస్తున్నారు. మొదటి నాలుగు నెలల వరకు వినడం, మాట్లాడటం, చదువడం, రాయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఆ తర్వాత పుస్తకాల్లోకెళ్లి పాఠాలను బోధిస్తున్నారు. ప్రత్యేక తరగతులు, టెస్టు లు నిర్వహించి ఫైనల్ పరీక్షలకు సిద్ధం చేస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా రు. అదేవిధంగా ప్రతిరోజూ క్రీడలు, వ్యాయామం చేయిస్తున్నారు. యోగా, ధ్యానంలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. కబడ్డీ, వాలీబాల్, రన్నింగ్, లాంగ్జంప్, హైజం ప్, ఖోఖో వంటి క్రీడలను నిర్వహిస్తున్నారు. మెరుగ్గా ఉన్నవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో వారు జిల్లా, రాష్ట్ర, జాతీ యస్థాయి పోటీలకు వెళ్లి విజయం సాధిస్తున్నారు. అదేవిధంగా సాంస్కృతిక అంశాలతోపాటు పెయింటింగ్, డ్రాయింగ్ల్లోనూ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు.
గురుకుల పాఠశాల చాలా బాగుంది
రూ.18 కోట్లతో నిర్మించిన తాండూరు మైనార్టీ బాలికల గురుకుల పాఠశాల చాలా బాగుంది. ప్రైవేటు పాఠశాలల కంటే మా టీచర్లు చాలా బాగా బోధిస్తున్నారు. చదువుతోపాటు శారీరక, మానసిక వికాసం కోసం ఆటాపాటలు, క్రీడల్లోనూ శిక్షణ ఇస్తున్నారు. మాలాంటి వారికోసం ప్రభుత్వం గురుకులాలను ఏర్పా టు చేయడం సంతోషకరం.. సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు.
– అమ్రీన్, ఎనిమిదోతరగతి తాండూరు
పాఠాలు అర్థమయ్యేలా చెబుతున్నారు
మైనార్టీ గురుకులంలో మా ఇంట్లో కంటే ఎక్కువ సౌకర్యాలను కల్పిస్తున్నారు. పుస్తకాలు, నోటుబుక్కులు, బ్యాగులతోపాటు నిత్యావసర వస్తువులను కూడా సమకూర్చుతున్నారు. ఇక్కడి టీచర్లు చాలా బాగా పాఠాలు చెబుతున్నారు.
– మహ్మద్ యునూస్, పదోతరగతి పరిగి
నిత్యావసర వస్తువులు, పౌష్టికాహారం
ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏటా రూ.1.20 -1.50 లక్షల వరకు ఖర్చు పెడుతున్నది. దీంతోపాటు మూడు నెలలకొకసారి కేసీఆర్ కిట్ పేరుతో విద్యార్థులకు నిత్యావసర వస్తువులు, దుప్పట్లు, ప్లేట్లు, గ్లాసులు తదితర వసతులను ప్రభుత్వం సమకూర్చుతున్నది. అన్నిరకాల నాణ్యమైన వంటలతోపాటు పౌష్టికాహారాన్ని అందిస్తున్నది. ఉదయం టిఫిన్, బూస్ట్, ఇడ్లీ, చపాతి వంటి పదార్థాలను అందజేస్తుండగా.. మధ్యాహ్నం సమయంలో సన్న బియ్యంతో కూడిన అన్నం, పప్పు, కూరగాయలు, మజ్జిగ, సాయంత్రం స్నాక్స్లో భాగంగా ఉడకబెట్టిన పెసర్లు తదితర వాటితోపాటు రాత్రి సమయంలో పౌష్టికాహారాన్ని వడ్డిస్తున్నారు. వారంలో నాలుగు సార్లు ఉడకబెట్టిన గుడ్లు, పండ్లు, వారంలో ఒకసారి చికెన్, మటన్ అందజేస్తున్నారు. కార్పొరేట్కు దీటుగా మెరుగైన బోధన అందుతున్నది.
వికారాబాద్లోని బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలలో 400 మంది ..
వికారాబాద్, జూలై 25: వికారాబాద్లోని బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలలో 400 మంది విద్యార్థులున్నారు. ఇందులో ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్ని కేటగిరీలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారు. 2016లో ఐదు నుంచి ఏడోతరగతి వరకు ఈ పాఠశాల ప్రారంభం కాగా.. ప్రతి ఏడాది ఒక్కో తరగతి పెరుగుతూ ప్రస్తుతం ఇంటర్ వరకు తరగతులు కొనసాగుతు న్నాయి. ఈ బడిలో విద్యార్థులకు మూడు జతల దుస్తులు, టై, బెల్టులు, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్ తదితర సామగ్రిని ప్రభు త్వం అందిస్తున్నది. విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, ల్యాబ్లు, టీచర్లు ప్రొజెక్టర్ ద్వారా పాఠాలను విద్యార్థులకు అర్థమయ్యేలా బోధిస్తున్నారు. ఈ పాఠశాలలో 26 మంది టీచర్లు, 17 మంది సిబ్బంది ఉన్నారు. ఇటీవల విడుదలైన పదోతరగతి పరీక్షల్లో 40 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారందరూ పాసై 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. విద్యార్థులకు ఆంగ్లమాధ్యమంలోనూ బోధన జరుగుతున్నది. యోగా, ఆటాపాటల్లో టీచర్లు శిక్షణ ఇస్తుండటంతోపాటు విద్యార్థులు చదువులో ముం దుండేందుకు ప్రతిరోజూ స్టడీ అవర్స్ నిర్వహిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థుల కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. అత్యవసర వైద్యం కోసం ఒక నర్సు 24 గంటలపాటు అందుబాటులో ఉంటుంది.
విద్యార్థులు రాణించేలా శిక్షణ, అవగాహన
ఈ ఏడాది ఇంటర్ ఫలితాల్లో వికారాబాద్ బాలుర మైనార్టీ గురుకులానికి చెందిన విద్యార్థి అద్భుత ప్రతిభను చాటాడు. ఎస్. సంతోష్కుమార్ అనే విద్యార్థి మొదటి సంవత్సరం బైపీసీలో 434/440లకు సాధించి రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ను సా ధించాడు. నీట్ పరీక్షలోనూ ఇద్దరు విద్యార్థులు ప్రతిభను చూపారు. విశాల్, గోపి అనే విద్యార్థులు హెచ్సీఎల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీకి ఎంపికయ్యారు. వాలీబాల్ పోటీల్లో ఈ పాఠశాల విద్యార్థులు జిల్లాలో మొదటి స్థానంలో నిలిచారు. ఇక్కడ ఎంపీసీ, బైపీసీ రెండు గ్రూ పులున్నాయి. ఉపాధ్యాయులు, అధ్యాపకులు విద్యార్థులకు అన్ని విషయాల్లోనూ అవగాహన కల్పిస్తూ రాణించేలా కృషి చేస్తున్నారు. ఇస్రో చంద్రయాన్-2కు దేశం లో 45 మంది విద్యార్థులను ఎంపిక చేస్తే, అందులో వికారాబాద్ బాలుర మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థులున్నారు.
ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ..
విద్యార్థులకు నిరంతరం అందుబాటులో ఉంటున్నాం. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాం. ఉదయం ఐదు గంటల నుంచే యోగా, వ్యాయామం చేయిస్తున్నాం. విద్యార్థులకు అవసరమైన అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తున్నాం. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి విద్యార్థుల కదలికలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ప్రతిరోజూ తరగతి గదుల్లోకెళ్లి విద్యార్థులతో మాట్లాడుతున్నాం. మెనూ ప్రకారం పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.
– ఫకీరారాత్లవత్, మైనార్టీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్