రంగారెడ్డి, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) :రాష్ట్రం సిద్ధించాక గ్రంథాలయాలకు మహర్దశ వచ్చింది. ప్రత్యేక నిధులను కేటాయిస్తూ పోటీ పరీక్షల మెటీరియల్, జనరల్ నాలెడ్జికి సంబంధించిన అనేక పుస్తకాలను రాష్ట్ర సర్కార్ అందుబాటులో ఉంచి విజ్ఞాన సోపానాలుగా మార్చుతున్నది. బల్లలు, కుర్చీలు, ఫ్యాన్లు, తాగునీరు, టాయిలెట్స్ తదితర సౌకర్యాలను సమకూర్చుతుండడంతో ఉద్యోగార్థులకు స్టడీ సెంటర్లుగా రూపాంతరం చెందుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని పలు గ్రంథాలయాలకు మరమ్మతులు చేయడంతో పాటు శిథిలావస్థలో ఉన్న గ్రంథాలయాల స్థానంలో పక్కా భవనాలనూ నిర్మిస్తున్నది. జిల్లా గ్రంథాలయంతోపాటు 12 శాఖా గ్రంథాలయాలకు రూ.22.30కోట్లను కేటాయించి, అధునాతన భవనాలను నిర్మిస్తున్నది. పైలట్ ప్రాజెక్టు కింద జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పౌర పఠన మందిరాలను ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యింది. పల్లెల్లో 30 పబ్లిక్ లైబ్రరీలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. మరో 60 లైబ్రరీలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నది. ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల కన్నా లైబ్రరీలే మేలని గ్రామీణ యువత భావిస్తుండడం విశేషం.
‘ఒకప్పుడు గ్రంథాలయ భవనాలు వానొస్తే కురిసేవి. అవసరమైన ఒక్క పుస్తకం కూడా అందుబాటులో ఉండేది కాదు. కూర్చునేందుకు కుర్చీలు లేకపోయేవి. ఇదీ.. గతంలో రంగారెడ్డి జిల్లాలోని గ్రంథాలయాల పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లాలో గ్రంథాలయాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. అందుబాటులో పోటీ పరీక్షల మెటీరియల్, జనరల్ నాలెడ్జికి సంబంధించి అనేక పుస్తకాలు అందుబాటులోకి వచ్చి స్టడీ సెంటర్లుగా రూపాంతరం చెందాయి. జిల్లా గ్రంథాలయంతోపాటు 12 శాఖా గ్రంథాలయాలకు రూ.22.30కోట్లతో అధునాతన భవనాలు చేకూరుతున్నాయి. పల్లెల్లో 30 పబ్లిక్ లైబ్రరీలు కొత్తగా అందుబాటులోకి వచ్చాయి. ఒక్కొక్క లైబ్రరీకి రూ.1.50లక్షలను వెచ్చిస్తున్న ప్రభుత్వం మరో 60 లైబ్రరీలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. అమెజాన్ సంస్థ ఆధ్వర్యంలో రూ.1.50కోట్లతో 10 గ్రంథాలయాలు ఏర్పాటవుతున్నాయి. ఫలితంగా గ్రంథాలయాలు అన్నివర్గాల ప్రజానీకానికి.. ముఖ్యంగా ఉద్యోగార్థులకు విజ్ఞాన సోపానాలుగా మారాయి.’
మారిన రూపురేఖలు..
జిల్లాలో రెండేళ్ల క్రితం వరకు ఒక జిల్లా గ్రంథాలయంతోపాటు, ఒక గ్రేడ్-1 గ్రంథాలయం, 23 శాఖా గ్రంథాలయాలు ఉన్నాయి. దయనీయ స్థితిలో ఉన్న ఈ గ్రంథాలయాలకు పక్కా భవనాలను కల్పించి ప్రభుత్వం స్టడీ సెంటర్లుగా తీర్చిదిద్దింది. బడంగ్పేటలోని జిల్లా గ్రంథాలయాన్ని రూ.4.30కోట్లతో అన్ని హంగులతో నిర్మించారు. పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే అభ్యర్థుల కోసం అన్నిరకాల మౌలిక వసతులను కల్పించారు. షాద్నగర్లోని గ్రేడ్-1 గ్రంథాలయంతోపాటు 12 శాఖా గ్రంథాలయాలకు రూ.18కోట్లతో అధునాతన భవనాలను సమకూర్చుతున్నారు. ఇప్పటికే శంషాబాద్, షాద్నగర్లోని భవనాలు ప్రారంభోత్సవం చేసుకోగా.. ఆమనగల్లు, మంచాలలోని భవనాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. చేవెళ్లలో ఇటీవల భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కొత్తూరు, షాబాద్, వనస్థలిపురం, శేరిలింగంపల్లి, కడ్తాల, ఇబ్రహీంపట్నం, మాడ్గులలో త్వరలోనే భవన నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు.
పైలట్ ప్రాజెక్టు సక్సెస్..
గ్రంథాలయ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ‘పౌర పఠన మందిరాల’ పేరిట సంస్థల సహకారంతో మున్సిపాలిటీలు, పంచాయతీల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేస్తున్నది. రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టుగా రంగారెడ్డి జిల్లాని తీసుకుని పౌర పఠన మందిరాలను ఏర్పాటు చేశారు. ఎల్బీనగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గాలు మినహా మిగతా ఆరు నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గానికి ఐదు చొప్పున 30 పబ్లిక్ లైబ్రరీలను ప్రారంభించారు. తొలుత కందుకూరు మండలంలోని మాదాపూర్, కడ్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి, తుక్కుగూడ మున్సిపాలిటీలోని మంఖాల్, మీర్పేట పరిధిలోని లలితానగర్లో ప్రారంభించి దశాబ్ది ఉత్సవాల్లో ఏకంగా 26 పబ్లిక్ లైబ్రరీలను ప్రారంభించారు. మొత్తం 30 లైబ్రరీలకు రూ.1.50లక్షల చొప్పున ప్రభుత్వం వెచ్చించింది. జిల్లాలోనూ మరో 60 పబ్లిక్ లైబ్రరీలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నెల రోజుల్లో వీటిని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అమెజాన్ వెబ్ సర్వీస్ సంస్థ సహకారంతోనూ జిల్లాలో 10 గ్రంథాలయాలను నెలకొల్పుతున్నారు. ఒక్కొక్క గ్రంథాలయానికి అమెజాన్ రూ.15లక్షలు ఖర్చు చేస్తున్నది. ఇప్పటికే ఆరు లైబ్రరీలు ప్రారంభం కాగా, మిగతావి త్వరలోనే అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
డిమాండ్ రిజిస్టర్తో సత్వరమే సదుపాయాలు..
గ్రంథాలయాల్లో పుస్తకాలతోపాటు ఇతర సదుపాయాలు లేనిపక్షంలో సత్వరమే సమకూర్చేందుకు ప్రతి లైబ్రరీలోనూ డిమాండ్ రిజిస్టర్ను అందుబాటులో ఉంచారు. ఈ రిజిస్టర్లో ఫిర్యాదు చేస్తే చాలు.. పుస్తకాలు, కుర్చీలు, రీడిండ్ ప్యాడ్స్ ఇలా.. ఏవి కావాలన్నా.. ఠక్కున అరేంజ్ చేస్తారు. ఇన్నాళ్లుగా చాలా మంది పోటీ పరీక్షల కోసం పట్టణాలకు వెళ్లి కోచింగ్ సెంటర్లలో జాయిన్ అయ్యేవారు. ప్రస్తుతం స్థానికంగానే గ్రంథాలయాలు అన్ని రకాల మెటీరియల్స్ను అందిస్తుండడంతో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల కన్నా చదువుకునేందుకు లైబ్రరీలే మేలు అన్న భావనతో ఇటువైపుగా మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువత, ఉద్యోగార్థులకు ప్రస్తుతం విస్తరించిన గ్రంథాలయాలు ఎంతో మేలు చేస్తున్నాయి.
వంద వరకు లైబ్రరీలు
జిల్లాలోని గ్రంథాలయాలను విజ్ఞాన భాండాగారాలుగా అభివృద్ధి చేశాం. రెండేళ్ల క్రితం వరకు 25 లైబ్రరీలు మాత్రమే ఉండేవి. ఈ రెండేళ్లలో వంద వరకు లైబ్రరీలను అందుబాటులోకి తేవడం జరుగుతున్నది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతో గ్రంథాలయాలకు పక్కా భవనాలను కల్పించాం. గ్రంథాలయాల్లో సకల సదుపాయాలు, దినపత్రికలతోపాటు అన్ని రకాల పుస్తకాలను అందుబాటులోకి తెచ్చాం. గ్రంథాలయాల నిర్వహణకు ప్రతి నెలా రూ.2వేలు అందజేస్తున్నాం. ప్రతి గ్రంథాలయానికో లైబ్రేరియన్ను నియమించడంతోపాటు నాలుగైదు లైబ్రరీలకు సీనియర్ లైబ్రేరియన్ను పర్యవేక్షకుడిగా నియమించాం.
– సత్తు వెంకటరమణారెడ్డి, రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్