షాద్నగర్, ఫిబ్రవరి 9: ప్రభుత్వం మారిన అప్పటి అభివృద్ధి పనులు నేటికీ కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల వేళ కేసీఆర్ ప్రగతి కాంతులపై విస్తృతంగా చర్చజరుగుతంది. రెండేళ్లు గడిచినా నేటికీ నాటి బీఆర్ఎస్ అభివృద్ధిని పనులపై స్థానికులు చర్చిచుకుంటున్న తీరును పరిశీలిస్తుంటే మరోమారు కేసీఆర్ నాయకత్వాన్ని బలంగా నమ్ముతున్నారనే భావన కలుగుతుంది. గడిచిన రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఇచ్చిన హామీలు, ఆరు గ్యారంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడంతో స్థానిక ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును విమర్శిస్తున్నారు. షాద్నగర్ మున్సిపాలిటీలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వందల కోట్ల నిధులను వెచ్చించి చేపట్టిన అభివృద్ధి నేటికీ దర్శనమిస్తున్నది. గడిచిన రెండళ్ల కాలంలో గతంలో విడుదలైన నిధులతో సీసీ రోడ్లు, అంతర్గత మురుగు కాలువల నిర్మాణాలు తప్ప, ఇతర వసతులు సమకూర్చలేదని పట్టణ వాసులు వాపోతున్నారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నాటి ప్రగతి పనులపై స్థానికులు చర్చించుకోవడం కాంగ్రెస్ నేతలను కలవరపెడుతుంది.
జాతీయ రహదారి విస్తరణ
షాద్నగర్ మున్సిపాలిటీ అభివృద్ధిలో ప్రధాన రహదారి అయిన హైదరాబాద్ రోడ్డు విస్తరణ పనులు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టి ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది. పట్టణ వాసులకు అనువుగా రూ. 112.75 కోట్ల నిధులతో నాలుగు వరుసల రోడ్డు పనులను పూర్తిచేసింది. దీంతో పాటు రోడ్డు మధ్యలో వీధి దీపాలను ఏర్పాటు చేయడంతో రాత్రి వేళల్లో పట్టణవాసులకు ప్రయాణం సాఫీగా కొనసాగుతుందని పేర్కొంటున్నారు.
ఇంటింటికీ తాగునీరు..
గుక్కెడు తాగునీటి కోసం తండ్లాడిన షాద్నగర్ పట్టణ వాసులు మిషన్ భగీరథ పథకం రావడంతో యేండ్లనాటి సమస్యకు పరిష్కారం దొరికింది. వేసవి కాలం వచ్చిందంటే తాగునీటి కోసం గోసపడుతూ ట్యాంకర్ల ద్వారా నీళ్లను తెచ్చుకొని ఆర్థికంగా నష్టపోతుండేవారు. కేసీఆర్ ప్రవేశపెట్టి అత్యంత ప్రతిష్టాత్మకమైన మిషన్ భగీరథ పథకం ద్వారా రూ. 54కోట్ల నిధులను వెచ్చించి 11,500లకు పైగా నివాసాలకు ఉచితంగా నల్లాలను ఏర్పాటు చేశారు. నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు.
1700 డబుల్ బెడ్రూం నిర్మాణాలు
మున్సిపాలిటీ పరిధిలోని 28 వార్డుల్లో పేద ప్రజల సొంత ఇంటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో కేసీఆర్ ప్రభుత్వం రూ.90.10కోట్ల నిధులను వెచ్చించి 1700లకు పైగా నివాసాలను నిర్మించింది. గతంలో నిర్మించిన నివాసాలను పేద ప్రజలకు ఇవ్వాలని భావించినా.. కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కేసీఆర్ నిర్మించిన ఇండ్లను త్వరగా అందజేస్తే బీఆర్ఎస్ పార్టీకి పేరోస్తుందనే భావనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్యావరణానికి ప్రాముఖ్యత
పట్టణ వాసులకు స్వచ్ఛమైన వాతావరణాన్ని అందించాలనే భావనతో పట్టణంలోని పార్కులను అభివృద్ధి చేశారు. రూ.50లక్షలను వెచ్చించి నర్సరీలను ఏర్పాటు చేశారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో వేలాది చెట్లను పెంచారు. ఎక్కడలేని విధంగా స్మృతి వనాలను ఏర్పాటు చేశారు. రోడ్లకు ఇరువైపులా, బహిరంగ ప్రదేశాల్లో విస్తారంగా చెట్లను పెంచి పర్యావరణానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. సుమారు 57.80కిలో మీటర్ల మేర మొక్కలను నాటి ఆదర్శంగా నిలిచారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ దిశగా అడుగులు వేయడం లేదనే భావన ప్రజల్లో ఉంది.
ప్రజా సంక్షేమం
బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించి అన్ని వర్గాల ప్రజల మనన్నలను పొంది. షాద్నగర్ మున్సిపాలిటీ ప్రతి నెల 4,175 మందికి పైగా లబ్ధిదారులకు రూ. 2వేల పింఛన్లను ఇచ్చేవారు. అదేవిధంగా 3,600 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు.
ఆరోగ్యం, వైద్యం
షాద్నగర్ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో అప్పటి ప్రభుత్వం 100 పడకల దవాఖాన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. రూ.20.89కోట్ల నిధులతో పనులను ప్రారంభించింది. కిడ్ని రోగుల అవసరాల కోసం స్థానికంగానే డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. రోడ్డు ప్రమాదాల క్షతగాత్రులకు మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో దవాఖాన ప్రాంగణంలోనే కేర్ సెంటర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.
విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం
షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలోని అన్ని కాలనీలో విద్యుత్ సమస్యలకు పరిష్కారం చూపారు. నూతనంగా రెండు 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రాలను ఏర్పాటు చేశారు. లో ఓల్టేజీ సమస్యను అధికమించేందుకు పదుల సంఖ్యలో నూతన ట్రాన్స్ఫార్మర్లను బిగించారు. షాద్నగర్ పట్టణంలో డీఈ కార్యాలయం ఏర్పాటుచేశారు.
మెరుగైన పోలీస్ సేవలు
నేరాలను అదుపు చేసి ప్రజలకు ప్రశాంత వాతావరణాన్ని కల్పించాలనే భావనతో అప్పటి ప్రభుత్వం షాద్నగర్ పట్టణంలో అదనంగా పట్టణ పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఓ సీఐతో పాటు నేరాలను అదుపు చేసేందుకు సీఐ క్యాడర్ అధికారి, నలుగురు ఎస్ఐలు నిత్యం విధులు నిర్వహించే విధంగా పోలీస్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పట్టణంలో ట్రాఫిక్ సమస్యను అధికమించేందుకు ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను ఏర్పాటు చేశారు.
పట్టణ ప్రగతి ఫలాలు ..
చటాన్పల్లి ఆర్ఓబీ వంతెన నిర్మాణానికి రూ.95కోట్లు, టీయూఎఫ్ఐడీఏ నిధులు రూ.61కోట్లతో సీసీ రోడ్ల ఏర్పాటు, రూ.16.49కోట్లతో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు, రూ.5కోట్లతో ఆడిటోరియం, రూ. 4.5కోట్లతో వెజ్, నాన్వెజ్ మార్కెట్, రూ.2.4కోట్లతో బొబ్బిలి చెరువు అభివృద్ధి, రూ 1.88 కోట్లతో గ్రంథాలయ నిర్మాణం, రూ. 16.49 కోట్లతో కమ్యూనిటీ భవనాలు, రూ. 1.68 కోట్లతో వైకుంఠ ధామాలు, రూ.40లక్షలతో రాత్రి సమయ విశ్రాంతి భవనం, రూ. 23.77 కోట్లతో అంతర్గత మురుగు కాల్వాల నిర్మాణం, మరో రూ.2.7కోట్లతో సీసీ రోడ్లు, మున్సిపాలిటీ పరిధిలో సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం, రూ. 13.50 లక్షలతో ఓపెన్ జిమ్లు, ఫైర్స్టేషన్ ఏర్పాటు, ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు, రూ.43లక్షలతో ఈద్గా అభివృద్ధి, రూ.50 లక్షలతో షాదీఖానా నిర్మాణం వంటి ఎన్నో అభివృద్ధి పనులను గత ప్రభుత్వం చేపట్టింది.