రంగారెడ్డి, ఏప్రిల్ 6, (నమస్తే తెలంగాణ) : జిల్లాలో భూగర్భజలాలను పెంచేలా ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ అమయ్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని కోర్టు హాల్లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన భూగర్భ జలాల పెంపుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి వర్షపు బొట్టునూ ఒడిసిపట్టేలా కార్యాచరణ రూపొందించాలన్నారు. 2019-20 నివేదిక ప్రకారం రాష్ట్ర సగటు భూగర్భజల వినియోగం 51 శాతం ఉండగా.. రంగారెడ్డి జిల్లాలో 74 శాతంగా ఉందన్నారు. జిల్లాలోని 27 మండలాలకుగాను 9 మండలాల్లో 69 శాతంలోపు నీటి వినియోగం, 14 మండలాల్లో 70-90 శాతం నీటి వినియోగం, మరో 4 మండలాల్లో 90-100 శాతం నీటి వినియోగం జరుగుతున్నట్లు తెలిపారు.
జిల్లాలోని 128 గ్రామాల్లో అతి నీటి వినియోగం చేస్తున్నట్లు గుర్తించినట్లు కలెక్టర్ చెప్పారు. అయితే సంబంధిత 128 గ్రామాల్లో వర్షపు నీటిని ఒడిసిపట్టే కార్యక్రమాలను చేపట్టి, భూగర్భజలాలను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. నీటిఊట గుంతలు, వ్యక్తిగత ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతలు, చెక్డ్యాంల నిర్మాణం, నీటి పారుదల కాలువల పూడికతీత పనులు చేపట్టాలని గ్రామీణాభివృద్ధి, జిల్లా భూగర్భజల శాఖ అధికారులను కలెక్టర్ అమయ్కుమార్ ఆదేశించారు. ఈ సందర్భంగా భూగర్భ జల నివేదికను ఆవిష్కరించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, డీఆర్వో హరిప్రియ, భూగర్భ జల శాఖ డీడీ రఘుపతిరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి గీతారెడ్డి, డీఆర్డీవో ప్రభాకర్, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి రాజేశ్వర్రెడ్డి, నీటిపారుదల శాఖ ఈఈ బన్సీలాల్ పాల్గొన్నారు.