తాండూరు, మార్చి 30 : బీఆర్ఎస్ పాలన తెలంగాణలో స్వర్ణ యుగమని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. శనివారం తాండూరులో ఏర్పాటు చేసిన చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆమె మాట్లాడుతూ మానవత్వం లేనివారే ఎన్నికల సమయంలో పార్టీ మారుతున్నారని నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ పార్టీలో పదవులు అనుభవించి పార్టీలు మారినవారికి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సూచించారు. ఈ ప్రాంత ప్రజలకు తెలియని రంజిత్రెడ్డిని కేసీఆర్ ఎంపీగా గెలిపించి పరిచయం చేశారని, రెండు సార్లు బీఆర్ఎస్ ‘కారు’ గుర్తుపై గెలిచి ఇప్పుడు మనకు ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారన్నారు. వారికి ఈ ప్రాంత ప్రజలు ఓటుతో సరైన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అసత్యపు వాగ్దానాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఇరు పార్టీలు గ్యారెంటీలతో సాధ్యం కాని హామీలు ఇస్తున్నాయని, ప్రజలు గుణపాఠం చెప్పాలని తెలిపారు. సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు ఇచ్చిన రూ.వేల కోట్ల అభివృద్ధి పనులు జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. వికారాబాద్ జిల్లా అభివృద్ధి సాధించాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పర్యాద కృష్ణమూర్తి, నర్సింహులు, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నయీం, నర్సిరెడ్డి, కోహిర్ శ్రీనివాస్, రవీందర్రెడ్డి, తాండూరు జడ్పీటీసీ మంజుల గౌడ్, వైస్ ఎంపీపీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వాళ్లకు ధనముంటే.. మాకు ప్రజాబలముంది..కాసాని జ్ఞానేశ్వర్
పదేండ్ల పాటు కేసీఆర్ చేసిన అభివృద్ధి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా నేను చేసిన పనులు చూసి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ధనికులైతే నాకు ప్రజాబలం ఉన్నది. 96 కులాల బీసీ ఐక్య వేదికను ఏర్పాటు చేసి ఒక్కతాటికి తీసుకొచ్చా. కులమతాలకు అతీతంగా ఓటు వేసి ఆశీర్వదించాలి. చేవెళ్ల పార్లమెంట్ ప్రజలందరి ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తా.
మోసగాళ్లకు రిటర్న్గిఫ్ట్ ఖాయం.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్
లోక్సభ ఎన్నికలు జరుగుతున్న కీలక సమయంలో పార్టీ వీడుతున్న నేతలకు సిగ్గు లేదు. రాజకీయాల్లో అధికారం ఎప్పటికీ శాశ్వతం కాదు. కానీ అధికారం పోగానే.. సొంత ప్రయోజనాల కోసం పార్టీ వదిలి ఇతర పార్టీల్లో చేరడం విడ్డూరం. బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటూ వికారాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యేలను ఓడించేందుకు కుట్రలు చేసిన ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సునీతారెడ్డికి సరైన గుణపాఠం చెబుతాం. ప్రజలతో మమేకమైన మంచి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
ఇకనుంచి గెలుపు బీఆర్ఎస్దే..తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత, అన్ని వర్గాలకు ఆప్తుడు, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి కృషి చేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ను భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. తాండూరు నియోజకవర్గం నుంచి లక్షకు పైగా మెజార్టీ రావాలి. పార్టీలో ఉండి వెన్నుపోటు పొడిచిన వారిని పొలిమేర దాటనివ్వద్దు.