సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ): దేశంలో సరుకు రవాణా రంగం గణనీయమైన వృద్ధి రేటును నమోదు చేస్తున్నది. ఐటీ కార్యాలయాలతో పాటు ఈ కామర్స్, రిటైల్ సంస్థలకు పెద్ద మొత్తంలో స్థలం కావలసి వస్తున్నది. ఇందుకోసం నగరం లోపల కాకుండా శివారు ప్రాంతాలే అనుకూలంగా మారాయి. దీంతో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) లాజిస్టిక్ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నది. ఉత్తర, దక్షిణ భారత మెట్రో నగరాలకు మధ్యలో ఉన్న హైదరాబాద్కు సరుకు రవాణాపరంగా కీలకంగా కానుంది. హైదరాబాద్లో పారిశ్రామిక కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడానికి హెచ్ఎండీఏ పరిధిలోని పలు ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే విజయవాడ జాతీయ రహదారిపై బాటసింగారం వద్ద, నాగార్జునసాగర్ హైవేపై మంగల్పల్లి వద్ద హెచ్ఎండీఏ లాజిస్టిక్ పార్కులు నిర్వహణలో ఉండగా, ఇటీవల ముంబయి జాతీయ రహదారిపై పటాన్చెరు, లక్డారం ప్రాంతాల్లోనూ కొత్తగా లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి పనులు చేపట్టింది. తాజాగా శంషాబాద్లోనూ సుమారు 100 ఎకరాల స్థలాన్ని ట్రక్ పార్కుగా అందుబాటులోకి తీసుకువచ్చేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది.
రూ.82.14 లక్షలతో అభివృద్ధి పనులు
సరుకు రవాణాపరంగా శంషాబాద్లో ట్రక్ పార్కింగ్ ఎంతో అనుకూలమైన ప్రాంతం. ఔటర్ రింగు రోడ్డు లోపల హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారి ఒకవైపు, మరోవైపు ఓఆర్ఆర్ ఉండడంతో ఈ స్థలాన్ని పూర్తిస్థా యిలో లాజిస్టిక్ కార్యకలాపాలకు అనుకూలంగా తీర్చిదిద్దనున్నాయి. సుమారు రూ. 82.14 లక్షల వ్యయంతో ప్రాథమికంగా స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసేందుకు ఇటీవల హెచ్ఎండీఏ టెండర్లు పిలిచింది. టెండరు గడువును ఈ నెల 14 వరకు నిర్ణయించారు. బిడ్లు దాఖలు చేసిన సంస్థలకు చెందిన టెక్నికల్, ప్రైస్ బిడ్లను పరిశీలించి అభివృద్ధి పనులను చేపట్టనున్నారు.
లాజిస్టిక్ పార్కుగా అభివృద్ధి
రాష్ట్ర ప్రభుత్వ ప్రగతిశీల చర్యల వల్ల తెలంగాణలో ఏవియేషన్, ఏరోస్పేస్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ట్రాఫిక్ గణనీయంగా పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో శంషాబాద్లోని 100 ఎకరాల స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేయనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ట్రక్ల పార్కింగ్లతోపాటు ఇతర కార్యకలాపాలు సమర్థవంతంగా నిర్వహించేందుకు వీలుగా ప్రైవేటు సంస్థలతో అధ్యయనం చేసిన తర్వాత మంగల్పల్లి, బాటసింగారం తరహాలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ విధానంలో లాజిస్టిక్ పార్కుగా అభివృద్ధి చేసే ఆలోచన ఉందని అధికారులు తెలిపారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా..
2028 నాటికి 40 మిలియన్ల మార్కును చేరుకుంటుందని అంచనా ఉండగా, 2020-21లో ఎయిర్ కార్గో ట్రాఫిక్ సైతం 35 శాతం పెరిగిందని ఇటీవల నివేదికలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలో నగరం నుంచి బెంగళూరు జాతీయ రహదారి వైపు భారీ విస్తీర్ణంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు చేసేందుకు హెచ్ఎండీఏ స్థలాలను అన్వేషిస్తున్నది. సుమారు 250 నుంచి 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయడం ద్వారా భవిష్యత్ అవసరాలకు సరిపోతుందని భావిస్తున్నారు. దానికనుగుణంగా అనువైన చోట స్థలాన్ని గుర్తించే పనిలో హెచ్ఎండీఏ ఉంది. ప్రభుత్వపరంగా ప్రత్యేక చొరవ తీసుకొని స్థలంతో పాటు మౌలిక వసతులను కల్పించడం ద్వారా ఈ రంగాన్ని మరింతగా ప్రోత్సహించాలని భావిస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేటు పార్ట్నర్షిప్ విధానంలో లాజిస్టిక్ పార్కులను నిర్వహిస్తున్న హెచ్ఎండీఏ అదే తరహాలో ఔటర్ రింగు రోడ్డు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ భారీ మొత్తంలో స్థలాలను గుర్తించి, అక్కడి నుంచి రోడ్డు మార్గంతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పిస్తూ ప్రైవేటు సంస్థల భాగస్వామ్యాన్ని పెంచేందుకు హెచ్ఎండీఏ అధికారులు చర్యలు చేపట్టారు.