తలకొండపల్లి, డిసెంబర్ 7 : రసాయన ఎరువులు వాడకంతో సాగుకు అలవాటు పడ్డ రైతులు సేంద్రియ ఎరువులతో సేద్యం చేయడమంటే ఆలోచనలో పడుతున్నారు. అలాంటిది ఏడేండ్లుగా రసాయన ఎరువులంటే వాడకుండా పూర్తిస్థాయిలో సేంద్రియ ఎరువులు తయారుచేస్తూ పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బదునాపూర్ పల్లె వాసులు. 2014లో వ్యవసాయ శాఖ అధికారులు సేంద్రియ వ్యవసాయంపై ఉన్నత అధికారులతో పల్లెలోని రైతులకు అవగాహన కల్పించారు. స్వయంగా ఎరువులు తయారుచేసుకొని వినియోగించుకునే విధానంపై రైతులకు అధికారులు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించడంతో సేంద్రియ వ్యవసాయంపై రైతులు మొగ్గు చూపుతున్నారు. పల్లెలో ఉన్న 21మంది రైతులు తొలిసారి సేంద్రియ ఎరువులు తయారుచేసుకొని పంటలు సాగుచేస్తున్నారు. గ్రామంలో బృందాలుగా ఏర్పడి పంటలు సాగుచేస్తున్నారు. దీనికి తోడు ఎన్జీవో స్వచ్ఛంద సంస్థ వారు సైతం డ్రిప్ అందజేసి ఎరువుల తయారీపై స్థానిక రైతులకు వ్యవసాయంపై అవగాహన కల్పిస్తున్నారు.
సేంద్రియ ఎరువులు తయారు చేసే విధానం
ఆవు పేడ, వేప ఆకులు, ఆవుమూత్రం, శనగపిండి, నల్లబెల్లం కలిపి అమృతపాణి తయారు చేస్తారు. అమృతపాణి, పాత పేడను కలిపి అమృత కాద్ను తయారు చేస్తారు. ఈ విధంగా అమృతపాణి, అమృతకాద్, దశపర్ని, కశాయం, జీవామృతం వంటి సేంద్రియ ఎరువులను రూపాయి ఖర్చు లేకుండా తయారు చేసుకొని వీటిని వినియోగిస్తున్నారు. దీంతో ఎలాంటి రసాయనాలు లేకుండా రైతులు భూసారాన్ని కాపాడుతున్నారు.
అన్ని రకాల పంటలకు వినియోగం..
సేంద్రియ ఎరువులతో ఇక్కడి రైతులు వరి, మొక్కజొన్న, పత్తితో పాటు చిక్కుడు, మిరప, టమాట, వంకాయతో పాటు అన్ని రకాల కూరగాయ పంటలను సాగు చేస్తున్నారు.
అలవాటుగా మారింది..
ఎన్నో ఏండ్లుగా రసాయన ఎరువులతో పంటలు పండించి అనేక ఇబ్బందులు పడ్డాం. మా గ్రామంలో అధికారులు సూచనలు, సలహాలు ఇచ్చిన నాటినాటి నుంచి సేంద్రియ ఎరువులు తయారుచేసుకోవడం అలవాటుగా మార్చుకున్నాం. మూడు ఏండ్లుగా అన్నిరకాల పంటలు పండిస్తున్నాం.
-గణేశ్, రైతు బదునాపూర్
అధికారుల అవగాహనతోనే..
ప్రస్తుతం సేంద్రియ ఎరువుల వాడకంతో పంటలు సాగు చేస్తున్నాం. వివిధ రకాల పంటలు సాగు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నాం. దీంతో భూసారం మెరుగు పడుతున్నది. ప్రభుత్వం రైతులందరికీ సేంద్రియ వ్యవసాయంపై అన్ని గ్రామాల్లో అవగాహన కల్పించి తోడ్పాటునందించాలి.
శిక్షణ ఇస్తున్నాం..
కొత్తరకం పంటలు పండించడం అధికారుల సూచనలు, సలహాలు పాటించడంలో బదునాపూర్ రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇదే గుర్తించి 2014లో సేంద్రియ వ్యవసాయంపై ఉన్నతాధికారులతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చాం. ఏడేండ్లుగా రైతులు స్వయంగా ఎరువులను తయారుచేసుకుంటూ పంటలు సాగు చేస్తున్నారు. వచ్చే పంటకాలం నాటికి సేంద్రియ వ్యవసాయం పెంచేందుకు కృషి చేస్తున్నాం.
– రాజు, మండల వ్యవసాయ అధికారి