కడ్తాల్ : తపాల సేవలకు ప్రజలకు మరింత చేరువ చేస్తామని, ప్రజలు తపాల సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ స్టేట్ చీఫ్ పోస్టు మాస్టర్ జనరల్ రాజేంద్రకుమార్ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని తపాలా కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోస్టాఫీస్ ద్వారా అందజేస్తున్న సేవలతో పాటు రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా రాజేంద్రకుమార్ మాట్లాడుతూ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకానికి సంబంధించిన నగదును పోస్టాఫీసుల్లో జమ చేసిందని తెలిపారు. రైతులు తమ ఆధార్కార్డును ఉపయోగించి నగదును డ్రా చేసుకోవచ్చని సూచించారు.
తపాల కార్యాలయంలో వివిధ రకాల సేవలు అందుబాటులో ఉన్నాయని, చిన్నారుల ఆధార్ నమోదు, ఆధార్ కార్డుకి మొబైల్ నంబర్లింక్ ఆప్డేట్, ఆధార్ కార్డులలో చిరునామా మార్పులతో పాటు మరిన్ని సేవలు అందజేయడం జరుగుతుందన్నారు. గ్రామీణ తపాలా బీమా సౌకర్యం ద్వారా ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ సదుపాయం అందుబాటులో ఉన్నదని, ఖాతాదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. పింఛన్లు పొందే లబ్ధిదారులు నెల నెల కొంత మొత్తాన్ని సేవింగ్, ఆర్డీ ఖాతాల్లో జమ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
తపాలా కార్యాయలయాల్లో ఐపీపీబీ, సీనియన్ నెటిజన్, నెలసరి వడ్డీ, పబ్లిక్ ప్రావిడెంట్ ఖాతాలు తెరిచే వెసులుబాటు ఉన్నదని వివరించారు. తపాల ద్వారా అందజేస్తున్న సేవలను గ్రామీణ ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో కడ్తాల్ పోస్టు మాస్టర్ రాజేశ్కుమార్రెడ్డి, తపాలా సిబ్బంది రవీందర్, యాదిలాల్ పాల్గొన్నారు.