బొంరాస్పేట, అక్టోబర్ 1 : జిల్లాలో యాసంగి పనులకు రైతులు సమాయత్తమవుతున్నారు. వానకాలంలో సాగు చేసిన పంటలు చేతికి వచ్చిన తరువాత రైతులు తమ భూములను దున్నుకుని యాసంగి సీజన్కు సిద్ధమవనున్నారు. ఈ ఏడాది కూడా జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా కురువడంతో వ్యవసాయ బోర్లలో పుష్కలంగా నీళ్లున్నాయి. కొన్ని రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో రైతులు విత్తనాలు వేసే పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెట్ట భూముల్లో రైతులు వేరుశనగ, తెల్ల కుసుమ, కంది, మొక్కజొన్న, శనగ పంటలను సాగు చేస్తున్నారు. వరి చేతికి వచ్చిన తరువాత డిసెంబర్, జనవరిలో సాగు పనులు ప్రారంభమవుతాయి. పంటల సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులను ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉంచడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు విత్తనాలు వేసే పనులు కొనసాగిస్తున్నారు.
యాసంగి సీజన్లో జిల్లాలో 1.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేసే అవకాశం ఉంది. యాసంగి సాగు విస్తీర్ణం 2021లో 1,04,528 ఎకరాలు., 2022లో 1,25,811 ఎకరాల్లో రైతులు పంటలు సాగు చేశారు. ఈ ఏడాది 1.30 లక్షల ఎకరాల్లో యాసంగి పంటలు సాగు చేసే అవకాశం ఉంది. 2022లో యాసంగిలో వివిధ రకాల పంటల సాధారణ విస్తీర్ణాన్ని పరిశీలిస్తే వరి 32,179 ఎకరాలు, వేరుశనగ 11,623, శనగ 12,358, జొన్న 6147, మొక్కజొన్న 3774, నల్లకుసుమ 1364, చెరుకు 2500 ఎకరాలు, కంది 300, గోధుమలు 240, ఇతర పంటలు 11,515 ఎకరాల్లో సాగు చేశారు. ప్రతి ఏటా సాధారణ విస్తీర్ణానికి మించి రైతులు పంటలను సాగు చేస్తుంటారు.
వరి, వేరుశనగ సాగు అధికం
యాసంగిలో రైతులు ఎక్కువగా వరి, వేరుశనగ పంటలను సాగు చేస్తారు. ఈ ఏడాది సమృద్ధిగా వానలు కురువడంతో జిల్లాలోని చెరువులు, కుంటలు పూర్తిస్థాయిలో నిండాయి. వీటి కింద ఎక్కువగా వరి పంటను సాగు చేస్తారు. జిల్లాలోనే అత్యధికంగా బొంరాస్పేట మండలంలో దాదాపు 16 వేల ఎకరాల్లో వరి పంట, 6500 ఎకరాల్లో వేరుశనగ పంటను సాగు చేయనున్నారు.
అందుబాటులో ఎరువులు, విత్తనాలు
యాసంగి సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలను ప్రభుత్వం రైతులకు అందుబాటులో ఉంచింది. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లాలోని ఆగ్రో రైతు సేవా కేంద్రాలు, ఎంపిక చేసిన ఎరువుల డీలర్ల వద్ద విత్తనాలు, ఎరువులు లభించనున్నాయి. ఎరువులు, విత్తనాల కొనుగోలుతో దుకాణాలు రైతులతో కిటకిటలాడుతున్నాయి.