రంగారెడ్డి, మార్చి 26 (నమస్తే తెలంగాణ) : పార్లమెంటు ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా మంగళవారం పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శశాంక నేతృత్వంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ఎన్ఐసీ హాల్ లో ఎన్నికల సంఘం నిబంధనలను అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించారు. రంగారెడ్డి జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో గల పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల విధులు నిర్వర్తించే ప్రిసైడింగ్ అధికారులు (పీఓ), సహాయ ప్రిసైడింగ్ అధికారులు (ఏపీఓ), ఇతర పోలింగ్ అధికారులు (ఓపీఓ)లను ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు.
రిజర్వ్ సిబ్బందిని కలుపుకుని జిల్లా పరిధిలోని ఎనిమిది సెగ్మెంట్లకు 16,536 మంది పోలింగ్ సిబ్బందిని నియమిస్తూ ర్యాండమైజేషన్ జరిపారు. వీరిలో పీవోలు 4,076 మంది ఉండగా.. ఏపీవోలు 3,968., ఓపీవోలు 7,952., మైక్రో అబ్జర్వర్లు 540 మంది ఉన్నారు. పోలింగ్ సిబ్బందికి ఎంపిక చేసిన వివిధ కేంద్రాలలో మాస్టర్ ట్రైనర్స్తో పోలింగ్ నిర్వహణపై శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు.
దీనిని దృష్టిలో పెట్టుకొని పోలింగ్ విధుల కోసం నియమించబడిన సిబ్బందికి తక్షణమే ఉత్తర్వులతో పాటు ఫామ్-12ను కూడా అందజేయాలని అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 1, 2తేదీల్లో పీవోలు, ఏపీవోలకు పోలింగ్ నిర్వహణపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ర్యాండమైజేషన్ ప్రక్రియలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఆర్వో సంగీత, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, ఎన్ఐసీ అధికారి స్వర్ణలత, మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ నోడల్ అధికారి శ్రీలక్ష్మి, ఎన్నికల విభాగం అధికారి సైదులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
వికారాబాద్ : జిల్లాలో జరిగే సాధారణ లోకసభ ఎన్నికలకు సంబంధించి పీవో, ఏపీవో, ఓపీవోల విధుల కేటాయింపునకు మొదటి దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ నిర్వహించినట్లు వికారాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. మంగళవారం ఐడీఓసీ ఎన్ఐసీ వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నియోజకవర్గాలకు సిబ్బంది కేటాయింపునకు ఆన్లైన్ ద్వారా మొదటి విడుత ర్యాండమైజేషన్ పూర్తి చేశారు.
ఈ సందంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో కొడంగల్, పరిగి, తాండూరు, వికారాబాద్ నియోజకవర్గాలకు పీవో, ఏపీవో, ఓపీవో పోలింగ్ సిబ్బందికి మొదటి దశ ర్యాండమైజేషన్ ద్వారా విధులు కేటాయించినట్లు తెలిపారు. ప్రక్రియ పూర్తి చేసి స్క్రీన్ ద్వారా చూపించారు. ర్యాండమైజేషన్ ప్రక్రియ తదుపరి మాస్టర్ ట్రైనర్స్చే పీవో, ఏపీవోలకు శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రాహుల్శర్మ, లింగ్యానాయక్, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఈడీఎం మహమ్మద్, అధికారులున్నారు.