షాద్నగర్, మార్చి 27 : ఉమ్మడి మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నిక చివరి దశకు చేరుకున్నది. గురువారం పోలింగ్ ఉండడంతో షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అధికారులు పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ పక్రియ ముగిసిన అనంతరం బ్యాలెట్ బాక్స్లను మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బాలుర జూనియర్ కళాశాలకు తరలించనుండగా.. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.
షాద్నగర్ పోలింగ్ కేంద్రంలో రంగారెడ్డి జిల్లా పరిధిలోని ఫరూఖ్నగర్, కొందుర్గు, కొత్తూరు, చౌదరిగూడ, నందిగామ, కేశంపేట, మాడ్గుల, కడ్తాల, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాల ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో పాటు షాద్నగర్, కొత్తూరు, ఆమనగల్లు మున్సిపాలిటీల కౌన్సిలర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
వీరితో పాటు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీలు సురభి వాణీదేవి, బస్వరాజ్ సారయ్య, సత్యవతి రాథోడ్ తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ కేంద్రం పరిధిలో మొత్తం 171 మంది ఓటర్లుండగా.. ఇందులో 94 మంది మహిళలు, 77 మంది పురుషులు ఉన్నారు.
షాద్నగర్ ఆర్డీవో వెంకటమాధవరావు, షాద్నగర్ పట్టణ సీఐ ప్రతాపలింగం బుధవారం పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. ఎన్నికల నిబంధనలు అతిక్రమించినవారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేవిధంగా ఓటర్లు, అభ్యర్థులు, నాయకులు సహకరించాలని కోరారు. పోలింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 1,439 మంది ఓటర్లున్నారు. ఇందులో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కౌన్సిలర్లు మొత్తం కలిపి 850 మంది ఉన్నారు. మెజార్టీ ఓటర్లు ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థి ఎన్.నవీన్కుమార్రెడ్డి గెలుపు ఖాయమనే చర్చ జరుగుతున్నది. మరోవైపు అధికార పార్టీ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డి సైతం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు చెందినవారు ఉండడంతో ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకుంటామని ఆ పార్టీ నాయకులు లెక్కలు వేసుకుంటున్నారు. కొందరు నాయకులు ఓటర్లను గత కొన్ని రోజులుగా క్యాంపులో ఉంచి నేరుగా పోలింగ్ కేంద్రాలకు తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు.
కొడంగల్ : ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్ ఎంపీడీవో కార్యాలయంలోనూ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొడంగల్, బొంరాస్పేట, దౌల్తాబాద్ మండలాలవారు 56 మంది ప్రజాప్రతినిధులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సీఎం రేవంత్రెడ్డి ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకోనున్న దృష్ట్యా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ భరత్రెడ్డి తెలిపారు.