షాద్నగర్, జూలై13 : కల్లు కంపౌండే అతడి అడ్డా.. కల్లు తాగేందుకు వచ్చే మహిళలే అతడి టార్గెట్.. మాటకు మాట కలుపుతూ కల్లు తాగిస్తాడు. మత్తులోకి జారుకోగానే హత్యచేసి మహిళల మెడల్లో నుంచి బంగారం, వెండి ఆభరణాలను దోచుకెళ్తాడు. రోజువారీ కూలీగా జీవనం సాగిస్తూ కిరాతకుడిగా మారి మహిళలను హత్యచేసిన వ్యక్తిని షాద్నగర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసు వివరాలను శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి గురువారం షాద్నగర్ పోలీస్స్టేషన్ ఆవరణలో విలేకరులకు వివరించారు. మహబూబ్నగర్ జిల్లా నవాబ్పేట మండలం చౌగూరు గ్రామ పంచాయతీ పరిధిలోని మెట్టుగడ్డతండాకు చెందిన జర్పుల హీర్యా కొన్ని రోజులుగా షాద్నగర్ ప్రాంతంలో రోజువారి కూలీగా ఉపాధి పొందుతున్నాడు. హీర్యా చోరీలకు పాల్పడడాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. ఇందులో భాగంగానే వికారాబాద్ జిల్లా చౌడపూర్ మండలం భంగరంపల్లి గ్రామానికి చెందిన గంగమ్మ (40) భర్త వెంకటయ్యతో కలిసి షాద్నగర్ పట్టణంలో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు. ఈ నెల 8న గంగమ్మ ఎప్పటిలాగే ఇంటి నుంచి పనికోసం బయటకు వెళ్లిన గంగమ్మ షాద్నగర్ పట్టణంలోని కల్లు కంపౌండ్లో కల్లు తాగేందుకు వెళ్లింది. అక్కడే ఉన్న హీర్యా గంగమ్మ ఒంటిపై ఉన్న బంగారం, కాళ్ల కడియాలపై కన్నేశాడు.
ఎలాగైనా వాటిని కాజేయాలనే ఉద్దేశంతో గంగమ్మతో మాటలు కలిపి కల్లు తాగించాడు. అనంతరం తన బైక్పై పట్టణంలోని హైటెక్ కాలనీ సమీపంలో ఉన్న చెట్ల పొదల వద్దకు తీసుకెళ్లాడు. అప్పటికే మత్తులోకి జారుకున్న గంగమ్మపై రాయితో మోదాడు. దీంతో గంగమ్మ తీవ్ర గాయాలపాలై మృతిచెందింది. ఈ విషయాన్ని గమనించిన హీర్యా ఆమె ఒంటిపై ఉన్న బంగారు వస్తువులు, వెండి కడియాలను తీసుకున్నాడు. ఒక కాలు కడియం రాకపోవడంతో అతడి వద్ద ఉన్న హాక్సార్ బ్లేడ్తో కాలును కోసి కడియాన్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటి నుంచి వెళ్లిన భార్య రాకపోవడంతో గంగమ్మ భర్త వెంకటయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలం మోతీఘనపూర్ గ్రామానికి చెందిన రుక్కమ్మ కూడా ఎలికట్ట గ్రామ శివారులో గాయాలతో కనిపించింది. విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో రుక్కమ్మను షాద్నగర్ దవాఖానకు తరలించి వివరాలను సేకరించారు. ఓ వ్యక్తి కల్లు తాగించి తన వద్ద ఉన్న బంగారు వస్తువులను దోచుకెళ్లాడని పోలీసులకు తెలుపడంతో ఆ దిశగా పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. విచారణలో రెండు నేరాలకు పాల్పడిన వ్యక్తి హీర్యా అనే విషయాన్ని గుర్తించిన పోలీసులు కల్లు కంపౌండ్ వద్ద తీసుకున్న సెల్పీ ఫొటోల ఆధారంగా గుర్తించి నిఘా వేశారు. గురువారం హీర్యాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కేసు ఛేదనలో ఉత్తమ ప్రతిభ చూపిన షాద్నగర్ పోలీసులను డీసీపీ అభినందించారు. విలేకరుల సమావేశంలో అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, సీసీఎస్ ఏసీపీ శశాంక్రెడ్డి, షాద్నగర్ పట్టణ సీఐ ప్రతాప్లింగం, ఎస్వోటీ పోలీసులు పాల్గొన్నారు.