తాండూరువాసితోపాటు అతడి ఇద్దరు కూతుర్లను కాపాడిన పోలీసులు
విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ కోటిరెడ్డి
వికారాబాద్, జూన్ 28 : తాండూరు ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి ఇద్దరు తన ఇద్దరు కూతుర్లతో ఆత్మహత్య చేసుకుంటానని సోషల్ మీడియాలో రావడంతో, సీసీ కెమెరాల ఆధారంగా వారిని పట్టుకున్నట్లు ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. దౌరిశెట్టి సత్యమూర్తిని.. అతడి ఇద్దరు కూతుర్లను వారణాసిలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. తాండూరు ప్రాంతానికి చెందిన దౌరిశెట్టి సత్యమూర్తి, తన ఇద్దరు కూతుర్లతో ఒక ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఇందులో మిస్సింగ్ అయిన తన భార్య అన్నపూర్ణ జాడను 48 గంటల్లో పోలీసులు కనిపెట్టకపోతే ఇద్దరు కూతుర్లతో సహా ఆత్మహత్య చేసుకునే లోకేషన్ను షేర్ చేస్తానని చెప్పారన్నారు. ఈ విషయంపై తాండూరు పోలీసుల కేసు నమోదు అనంతరం లోకల్ పోలీసులు, జిల్లా పోలీసులతో కలిసి స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేశామన్నారు. వారు ఏఏ ప్రాంతాలకు వెళ్లి ఉంటారో స్పెషల్ టీమ్లను పంపించామని తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా వారు పరిగి వైపు నుంచి శంషాబాద్కు వెళ్లినట్లు గుర్తించామన్నారు.
26న శంషాబాద్లో అతడి కారును ట్రేస్ చేసి, శంషాబాద్ అధికారులను సంప్రదించామన్నారు. వారు ముంబైకి వెళ్లారని తెలుసుకొని, ముంబై టీమ్లోని అధికారులను కాంటాక్ట్ చేసి సత్యమూర్తి వివరాలు తెలిపామన్నారు. స్పెషల్ టీమ్ వారణాసిలో దిగి సీసీ కెమెరాలను చెక్ చేయడం.. ఆ తర్వాత అక్కడి క్యాబ్ డ్రైవర్ల సాయంతో సత్యమూర్తి ఆచూకీ లభించిందన్నారు. 27న రాత్రి వారిని వికారాబాద్కు తీసుకొచ్చినట్లు తెలిపారు. ముగ్గురు మనోవేదనతో ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటారోనని వారి ప్రాణాలను ఎలాగైనా కాపాడాలనే ఉద్దేశంతో లోకల్ పోలీసులు, జిల్లా పోలీసు టీమ్లు చాకచక్యంగా వ్యవహరించారని పేర్కొన్నారు.
అన్నపూర్ణ మిస్సింగ్ కేసు
2022 మార్చి 6న అన్నపూర్ణ మిస్సింగ్ అయిన తరువాత 7న ఫిర్యాదు రావడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారన్నారు. దర్యాప్తులో భాగంగా తాండూరు, వికారాబాద్, హైదరాబాద్, ఎంజీబీఎస్, రైల్వే స్టేషన్, ఆశ్రమాలు చెక్ చేసినట్లు తెలిపారు. ఊటీ, బెంగళూర్, షిరిడీ, సేడం, కుంచారం, మంత్రాలయంతోపాటు ఇతర రాష్ర్టాల ప్రాంతాలు కూడా పరిశీలించామన్నారు. ఎస్సీఆర్బీలో వివరాలు ఇచ్చామన్నారు. పొరపాటున ఆమె ఏమైనా చేసుకుందోననే కోణంలో గుర్తు తెలియని మహిళా మృతదేహాలను పరిశీలించినట్లు తెలిపారు. సత్యమూర్తి వద్ద ఇంకా ఎవిడెన్స్ ఉంటే వాటిని పరిశీలిస్తామన్నారు. ఇందులో ఎవరి హస్తం ఉన్నా వదిలేది లేదని, మల్లికార్జున్, అనీల్ వాళ్ల సంభాషణలో దుబాయి వెళ్లి పోయిందని.. అక్కడి నుంచి 4 ఫేక్ పాస్పోర్ట్ వివరాలు వస్తున్నాయని అనటంలో కొన్ని అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. కేసు పరిశోధనలో తారసపడే వ్యక్తుల్ని, సత్యమూర్తి అందించే అంశాలన్నింటిపై విచారణ చేస్తామని పేర్కొన్నారు. సత్యమూర్తి, అతడి కూతుర్లను కనిపెట్టడంలో తాండూరు లోకల్ పోలీసులు, సీసీఎస్ వికారాబాద్ పోలీసులను అభినందించారు. ఇదే స్ఫూర్తితో అన్నపూర్ణ కేసును ఛేదించాలని ఆదేశించారు. సమావేశంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతం చేయాలి
ఆపరేషన్ ముస్కాన్ను విజయవంతం చేయాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కాన్ఫరెన్స్హాల్లో ఆపరేషన్ ముస్కాన్-8 గురించి కో ఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. తప్పిపోయిన పిల్లలను గుర్తించి.. వారి తల్లిదండ్రుల వద్దకు చేరేలా చూడాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని, పిల్లలతో బిక్షాటన చేయకుండా చూడాలని సూచించారు. కర్మాగారాల్లో పిల్లలతో వెట్టిచాకిరి చేయించడం చట్టరీత్యా నేరమన్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. బడీడు పిల్లలను చదువుకోనివ్వాలని, చదువుకోని వీధి బాలలను గుర్తించి బాలల సంక్షేమ సమితి ఎదుట హాజరుపరిచి కౌన్సిలింగ్ ఇవ్వాలని తెలిపారు. మానవ అక్రమ రవాణాను నిరోధించాలని, ఏహెచ్టీయూ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ దాసు ఆధ్వర్యంలో ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వీరు జిల్లా మొత్తం నిరంతరం తిరుగుతూ పిల్లలతో పని చేయించుకునేవారిని గుర్తిస్తారని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ ఎం.ఏ.రశీద్, డీఎంహెచ్వో అధికారి తుకారాం, డీడబ్ల్యూవో లలితకుమారి, డీఈవో రేణుకాదేవి, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ శ్రీనివాస్రావు, సీడబ్ల్యూసీ కమిటీ చైర్మన్ వెంకటేశం, తాండూరు ఆర్డీవో అశోక్కుమార్, ఏఎల్వో శశివర్ణ, సీడబ్ల్యూసీ మెంబర్లు సవితాదేవి, సంగమేశ్వర్, రమేశ్వర్, ఎస్ఐలు విశ్వజన్, సత్యనారాయణ, విమల, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.