సిటీబ్యూరో/ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 23(నమస్తే తెలంగాణ) : ఓ మోసగాడు దారుణానికి ఒడిగట్టాడు. స్నేహితుడిని నెల రోజుల కిందటే హత్య చేసి పాతి పెట్టిన వైనం గురువారం వెలుగులోకి వచ్చింది. ఓ మిస్సింగ్ కేసు దర్యాప్తులో భాగంగా రాచకొండ పోలీసులకు లభించిన క్లూతో ఈ హత్య ఉదంతం బయటపడింది. హత్యకు పథకం రచించిన ప్రధాన సూత్రధారిని కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యలో పాత్రధారులైన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. పాతి పెట్టిన మృతదేహాన్ని బయటకు తీయగా మృతుడి తల లేకుండా ఉంది. మిగతా శరీరాన్ని స్వాధీనం చేసుకున్న ఆదిబట్ల పోలీసులు దానికి పోస్టుమార్టానికి తరలించారు. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి.. నల్గొండ జిల్లాకు చెందిన బ్రహ్మచారి, నామా శ్రీనివాస్, రాజు, నరేశ్ స్నేహితులు. బ్రహ్మచారి ఇనుప కడ్డీలకు బంగారు పూతను పూసి వాటిని పలు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల్లో కుదువ పెట్టి రుణం తీసుకుంటాడు. ఈ మోసాలపై గతంలో బ్రహ్మచారిపై పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ బంగారు పూత తయారీని నామా శ్రీనివాస్ దగ్గర చేయిస్తుండే వాడు. స్నేహితులు కావడంతో శ్రీనివాస్ రూ.70వేలు బ్రహ్మచారికి అప్పుగా ఇచ్చాడు. అందులో రూ.50వేలు బ్రహ్మచారి తిరిగి శ్రీనివాస్కు ఇచ్చేశాడు. ఇలా కొంత మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఆదిబట్ల పోలీస్స్టేషన్ పరిధిలో నివాసముంటున్న శ్రీనివాస్ ఆకస్మాత్తుగా నవంబర్12 నుంచి కనపడకుండా పోయాడు.
దీంతో కుటుంబ సభ్యులు డిసెంబర్ 14న ఆదిబట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు ఓ చిన్న సమాచారం లభించింది. సరూర్నగర్ పీఎస్లో నమోదైన చీటింగ్ కేసులో అరస్టైన బ్రహ్మచారిని కోర్టు అనుమతితో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో శ్రీనివాస్ను తానే మరో ఇద్దరు స్నేహితులు రాజు, నరేశ్లతో కలిసి నవంబర్ 12 మద్యం తాగిస్తానని చెప్పి తీసుకువచ్చి బొంగూళూరు వద్ద చంపేశామని, ఆ తర్వాత మృతదేహాన్ని ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న నిర్మానుష్య ప్రాంతంలో పూడ్చిపెట్టామని చెప్పాడు. దీంతో గురువారం అక్కడికి వెళ్లిన పోలీసులు ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణారెడ్డి, తాసిల్దార్ అనిత సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీశారు. ఆ సమయంలో తల దొరకలేదు. దీంతో ఈ ఘటన కలకలం రేపింది. మిగతా శరీరానికి పోస్టుమార్టం పూర్తి చేశారు. తల గురించి బ్రహ్మచారిని విచారించినప్పుడు ఆ విషయం రాజుకు తెలుసని చెప్పాడు. రాజు, నరేశ్ గురించి పోలీసులు గాలిస్తున్నారు.
ఓ మహిళకు వేధింపులు..
ఈ దారుణానికి ఓ మహిళతో అసభ్య ప్రవర్తనే ప్రధాన కారణమని విశ్వసనీయంగా తెలిసింది. నామా శ్రీనివాస్ నిందితుల్లో ఒకరైన స్నేహితురాలిని అసభ్యంగా దూషించడంతో పాటు, అమర్యాదగా ప్రవర్తించాడనే అనుమానంతోనే హత్యకు పథకం రచన జరిగిందని పోలీసుల ప్రాథమిక సమాచారం. మిగతా నిందితులు దొరికితే హత్యకు ప్రధాన కారణం తెలుస్తుందని అధికారులు అంటున్నారు. తన స్నేహితురాలిని వేధించాడనే కసితోనే క్రూరంగా వీరు శ్రీనివాస్ను చంపేసి ఈ విధంగా వ్యవహరించారని పోలీసులు భావిస్తున్నారు.