తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ఆదివారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా పోలీసు శాఖ ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అల్కాపురి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, కమిషనర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి సబితారెడ్డి పాల్గొని మాట్లాడారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ దేశానికే తలమానికమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషి, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అభినందించారు. పలుచోట్ల నిర్వహించిన సమావేశాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, పోలీస్ అధికారులు పాల్గొని మాట్లాడారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు చేస్తున్న కృషి, ఫ్రెండ్లీ పోలీసింగ్, షీటీమ్స్, బ్లూకోల్ట్స్ సేవలు తదితర వాటిని ప్రజలకు వివరించారు. రోడ్డు భద్రత విషయంలో వాహనదారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని సూచించారు. ఎక్కడైనా గొడవలు జరిగితే 100కు సమాచారం అందించాలని సూచించారు. పలుచోట్ల క్రీడాపోటీలు నిర్వహించి బహుమతులను ప్రదానం చేశారు. ఎస్పీ కార్యాలయాల్లో స్టాళ్లను ఏర్పాటు చేసి చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
– నమస్తే తెలంగాణ, నెట్వర్క్
మన్సూరాబాద్, జూన్ 4 : పోలీస్ కమాండ్ కంట్రోల్ భవనం దేశానికే తలమానికమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా అల్కాపురి ట్రాఫిక్ పోలీస్స్టేషన్, కమీషనర్ క్యాంప్ కార్యాలయంలో సురక్షా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్గుప్తా, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషి, ఫ్రెండ్లీ పోలీస్ వింగ్ విధానాన్ని అభినందించారు. శాంతి భద్రతలు ఎక్కడైతే పటిష్టంగా అమలు అవుతాయో ఆ ప్రాంతాలన్నీ సురక్షితంగా ఉంటాయన్నారు. రాష్ట్రం సుభీక్షంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని తెలిపారు. పోలీసులు ఎదుర్కొంటున్న సమస్యలపై సమగ్ర అధ్యాయనం చేసి, ముఖ్యమంత్రి వాటి పరిష్కారానికి మార్గం చూపారని అన్నారు. ప్రతి ఠాణాకు కావాల్సినంత సిబ్బందిని నియమించి ఆధునిక వాహనాలను సమకూర్చడమే కాకుండా, మహిళల భద్రతకు షీ టీమ్లను ఏర్పాటు చేశారని తెలిపారు. అన్ని జిల్లాల్లో మహిళా ఠాణాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి భరోసా కల్పించారన్నారు. అనంతరం ఎమ్మెల్యే సుధీర్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. అంతకుముందు పోలీస్లు నిర్వహించిన కవాతుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పలువురు డీసీపీలు, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అధునాతన పద్ధతులతో పోలీస్ శాఖ పనితీరు
వికారాబాద్ : దేశంలో పోలీస్ శాఖను మొదటి స్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అన్నారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మూడో రోజు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో సురక్షా దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా పోలీస్ శాఖలో ఉన్న షీటీమ్స్, భరోసా, కళాబృందం, బ్లూకోల్ట్స్, ట్రాఫిక్, సైబర్ తదితర విభాగాల అధికారులు, సిబ్బందితో పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ఎమ్మార్పీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్పర్సన్ సునీతామహేందర్రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం పోలీసుల పట్ల శ్రద్ధ తీసుకోలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానంతో పోలీసులను ప్రోత్సహిస్తుందన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే రైతుల సమస్యలు త్వరగా పరిష్కరించి వారికి న్యాయం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పద్ధతులను అమలు పరిచి నేరాల సంఖ్యను భారీగా తగ్గించారని తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్ మాట్లాడుతూ సురక్షా దివాస్ అంటే రక్షణ అని పోలీస్ శాఖను అభినందించారు. పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం లాండ్ ఆర్డర్ కాపాడటంలో మొదటి స్థానంలో నిలువడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 10 లక్షల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నేరాలను అరికట్టడం జరుగుతుందని వివరించారు. ఈ సందర్భంగా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖకు ప్రభుత్వం అన్ని విధాలుగా తోడ్పాటునందిసుతందన్నారు. ఫైరింగ్ కోసం అనువైన స్థలాన్ని ఏర్పాటు చేయాలని కలెక్టర్ను కోరారు. అనంతరం 2022 జూన్ 2 నుండి 2023 జూన్ 2 వరకు ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్ అధికారులకు, సిబ్బందిని ముఖ్యఅతిథిలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల, అదనపు ఎస్పీ మురళిధర్, డీఎస్పీలు సత్యనారాయణ, శేఖర్గౌడ్, సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.