తాండూరు, ఆగస్టు 3 : ఘరానా చోరీని పది రోజుల్లో పోలీసులు ఛేదించడమే కాకుండా సొత్తును రికవరీ చేశారు. ఇంటి పక్కవారే నిందితులుగా తేల్చారు పోలీసులు. బుధవారం డీఎస్పీ శేఖర్గౌడ్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. తాండూరు మున్సిపల్ పరిధి పాత తాండూరు మోమిన్గల్లీలో సిరాజ్ సందాని, మిరాజ్ సందానిలు ఒకే దగ్గర ఉంటున్నారు. గత నెల 22న సిరాజ్ సందాని కూతురు వివాహం జరిగింది. 23న పట్టణంలోని నేషనల్ గార్డెన్లో జరిగిన వేడుకలో ఇరు కుటుంబాల సభ్యులు పాల్గొన్నారు. వారి ఇంటి పక్కనే ఫ్లోరింగ్ పనులు చేసే మహమ్మద్ ముస్తఫా, పెయింటింగ్ పనులు చేసే మహమ్మద్ ఉస్మాన్ అలియాస్ ముస్కాన్ ఇదే అదనుగా భావించి అదే రోజు అర్ధరాత్రి వారింటి వెనుకభాగంలో నుంచి మిరాజ్ సందాని ఇంట్లోకి ప్రవేశించారు. ముందుగా ఫస్ట్ ఫ్లోర్లోకి ఎక్కి ముస్తఫా లోపలికి ప్రవేశించారు.
బీరువా తెరిచి అందులోని పన్నెండున్నర తులాల గాజులు, చెయిన్లు, మంగళసూత్రం బంగారు ఆభరణాలతోపాటు రూ. 30వేల నగదును దొంగతనం చేశారు. అనంతరం ఇంటి పక్కన ఉన్న గ్రౌండ్లో గుంత తవ్వి బంగారు ఆభరణాలు, రూ.25వేల నగదును పూడ్చి రూ.5వేలను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు. నిందితులు గుల్బర్గా, ముంబయి ప్రాంతాలకు పారిపోయారు. చోరీ జరిగిన నాటి నుంచి పోలీసులు అనుమానితులపై దృష్టి సారించారు. ఆ రోజు నుంచి అదృశ్యమైన వారిపై నిఘా ఉంచారు. ఇందులో భాగంగా మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన ముస్తఫా, ముస్కాన్లు బుధవారం ఉదయం పాతిపెట్టిన బంగారం, నగదును తీసుకునేందుకు యత్నిస్తుండగా విషయం తెలుసుకున్న పోలీసులు వారిని పట్టుకొన్నారు. నిందితులు దొంగిలించిన ఆభరణాలు, రూ.25 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ శేఖర్ గౌడ్ వెల్లడించారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన పట్టణ సీఐ రాజేందర్రెడ్డి, సిబ్బంది అంజద్, శివలను అభినంధించి రివార్డులను అందించారు. సమావేశంలో పట్టణ ఎస్ఐ వేణుగోపాల్ గౌడ్ పాల్గొన్నారు.