ఇబ్రహీంపట్నం/వికారాబాద్, నవంబర్ 11: పోడు భూముల సర్వే పనులను వేగవంతం చేస్తామని రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు అమయ్కుమార్, నిఖిత పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా ఈ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. శుక్రవారం గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, సీఎస్ సోమేశ్కుమార్ కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు అమయ్కుమార్, నిఖిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెలాఖరు లోపు పోడు భూముల సర్వేను పూర్తి చేసి, ప్రతి గ్రామసభ, డివిజన్ సభ, జిల్లా సభలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
పోడు భూముల సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని, ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ కట్టుదిట్టంగా నిర్వహించాలన్నారు. సీఎం కేసీఆర్ పోడు భూముల లబ్ధిదారులకు యాజమాన్య హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని డిసెంబర్ మొదటి వారంలో మహబూబాబాద్ జిల్లాలో ప్రారంభిస్తారని వెల్లడించారు. అనంతరం సీఎస్ సోమేశ్కుమార్ మాట్లాడుతూ సర్వేలో ఏమైనా సమస్యలు ఎదురైతే రాష్ట్ర అధికారులను సంప్రదించాలని సూచించారు. దరఖాస్తుదారుల భూములను పరిశీలించి సర్వే చేప ట్టాలని.. అవసరమైతే అదనపు సిబ్బందిని సమకూర్చుకోవాలన్నారు.
ఈ సందర్భంగా అమయ్కుమార్, నిఖిత మాట్లాడుతూ సర్వేచేసిన వివరాలను ఎప్పటికప్పుడు యాప్లో పొందుపరుస్తున్నట్లు తెలిపారు. ఈ కాన్ఫరెన్స్లో రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్జైన్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి రామేశ్వరిదేవి, ఆర్డీవోలు వెంకటాచారి, రాజేశ్వరి, చంద్రకళ, వేణుగోపాల్, వికారాబాద్ జిల్లా తదితరులు పాల్గొన్నారు.