వికారాబాద్, అక్టోబర్ 26(నమస్తే తెలంగాణ): సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. రాజకీయ పార్టీలు డబ్బు, మద్యం తరలించకుండా ఎక్కడిక్కడ కట్టడి చేసేందుకు జిల్లావ్యాప్తంగా చెక్పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. రూ.50 వేలకు మించి తరలించితే సంబంధిత నగదుకు ఆధారాలు, రసీదులు లేకుంటే ఎన్నికల నియామవళి ప్రకారం అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. పోలీసులు, ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు సీజ్ చేసిన నగదుకు సరైన ఆధారాలు సమర్పించితే సంబంధిత డబ్బును తిరిగి బాధితులకు అప్పగించేందుకు ప్రత్యేకంగా జిల్లా గ్రీవెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేశా రు.
మరోవైపు ఇప్పటికే ఓటరు తుది జాబితాను విడుదల చేసిన జిల్లా ఎన్నికల అధికారులు కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారికోసం ఈనెలాఖరు వరకు గడువిచ్చారు. ఈవీఎంల పనితీరుపై ఇప్పటికే రాజకీయ పార్టీల ప్రతినిధుల ఎదుట పరిశీలన ప్రక్రియను నిర్వహించడంతోపాటు ఈవీఎంల పనితీరుపై జిల్లా అంతటా ప్రజలకు అవగాహన కల్పించారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లోని పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తీసుకెళ్లడం, పోలింగ్ పూర్తైన అనంతరం తిరిగి స్ట్రాంగ్రూంలకు తీసుకెళ్లే వరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికలకు సంబంధించి అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్ నియోజకవర్గ కేంద్రాలకు ఈవీఎంలను తరలించారు. వాటిని భద్రపర్చేందుకు ప్రత్యేకంగా స్ట్రాంగ్రూంలను ఏర్పాటు చేసి ప్రత్యేక బలగాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. జిల్లాలో 1,133 పోలింగ్ కేంద్రాలుండగా 125 శాతం మేర బ్యాలెట్, కంట్రోల్ యూనిట్లు, 140 శాతం మేర వీవీ ప్యాట్లు జిల్లాలో అందుబాటులో ఉన్నాయి. పోలింగ్ రోజన ఈవీఎంలు ఏమైనా మొరాయిస్తే వెంటనే సమకూర్చేలా ఆయా పోలింగ్ కేంద్రాలకు అదనంగా ఈవీఎంలను పంపించనున్నారు. అదేవిధంగా జిల్లాలోని 600 పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించడంతోపాటు 200 పోలింగ్ కేంద్రా ల్లో మైక్రోఅబ్జర్వర్లతో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఏర్పాట్లను వేగవంతం చేసింది.
272 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన జిల్లా ఎన్నికల అధికారులు, నవంబర్ మొదటి వారంలో మరోసారి జిల్లా ఎన్నికల పరిశీలకులు, జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పోలీసు అధికారి సమావేశ మై సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. నవంబర్ 3వ తేదీ నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న దృష్ట్యా జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే నామినేషన్లను ఆన్లైన్లోనూ చేసుకునేందుకు ఎన్నికల సంఘం వీలు కల్పించింది. అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న అనంతరం తప్పనిసరిగా సంబంధిత నామినేషన్ కాపీలను ప్రతిపాదించే వ్యక్తిగాని, ఎన్నికల ఏజెంట్గాని సంబంధిత రిటర్నింగ్ అధికారికి అందజేయాల్సి ఉంటుంది.
పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్తు, తాగునీరు, మరుగుదొడ్లు తదితర మౌలిక వసతులను 15 రోజుల్లో పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు. పోలింగ్ పూర్తైన అనంతరం ఆయా నియోజకవర్గాల పోలింగ్ కేంద్రాల నుంచి ఈవీఎంలను పరిగి ఏఎంసీకి తరలించి నాలుగు నియోజకవర్గాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలలో భద్రపర్చనున్నారు. మరోవైపు జిల్లాలో ఎన్నికల నిర్వహణకు 5,600 మంది సిబ్బంది అవసరమని గుర్తించిన జిల్లా ఎన్నికల అధికారులు వారికి వచ్చే వారంలో శిక్షణనిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక పీవో, ఇద్దరు ఏపీవోలు, మరో ఇద్దరు ఓపీవోలను నియమించారు.
జిల్లాలో అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 15 చెక్పోస్టులను ఏర్పాటు చేయడంతోపాటు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు, ఆయా నియోజకవర్గాల్లోని ప్రధాన కూడళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు తనిఖీల్లో భాగం గా రూ.1.02 కోట్ల నగదును సీజ్ చేశారు. ఇప్పటివరకు జిల్లాలో సీజ్ చేసిన నగదులో సరైన ఆధారాలు చూపించిన రూ.60 లక్షలను సంబంధించి జిల్లా ఎన్నికల అధికారులు తిరిగి బాధితులకు అందజేశారు. మరోవైపు ఫ్లయింగ్ స్కాడ్ బృందాల వాహనాలకు త్వరలో జీపీఎస్లను కూడా అమర్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు లేకుం డా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా 50 శాతానికిపైగా పోలింగ్ కేంద్రా ల్లో వెబ్ కాస్టింగ్, మరో 200 పోలింగ్ కేం ద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించడం జరిగింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందికి వచ్చే వారంలో శిక్షణ ఇప్పిస్తాం. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక వసతులను 15 రోజుల్లో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. 18 ఏండ్లు నిండిన వారుంటే ఈనెలాఖరులోగా కొత్త ఓటరుగా దరఖాస్తు చేసుకోవాలి.
-నారాయణరెడ్డి, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్