ఇబ్రహీంపట్నం, డిసెంబర్ 30 : కరోనా మన మధ్యనే ఉంది. వైరస్ రూపాంతరం చెందుతూ మానవాళికి సవాల్ విసురుతున్నది. పాత సంవత్సరానికి వీడ్కోలు తెలుపుతూ.. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికే వేడుకల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. న్యూ ఇయర్ వేడుకల పేరుతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కరోనాకు స్వాగతం పలికినట్టే. న్యూ ఇయర్ వేడుకలు జరుపుకునేవారు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించే విషయంలో సరైన జాగ్రత్తలు పాటించాలి. భౌతిక దూరం పాటించి కరోనాను కట్టడి చేయాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
రంగారెడ్డిజిల్లా నగర శివారుల్లో విస్తరించి ఉండటం వలన స్నేహితులు, గ్రేటర్ కమ్యూనిటీలో నివసించేవారు, యువకులు పాత సంవత్సరానికి వీడ్కోలు పేరుతో విందులు, వినోదాలు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అలాగే, నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు కేక్ కటింగ్లు, ఆలయాలకు వెళ్లడం వంటి కార్యక్రమాలకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే మన మధ్యనే పొంచి ఉన్న కరోనాను మాత్రం పట్టించుకోవడం లేదు. ఇలాంటి కార్యక్రమాలు చేసేముందు ప్రజలంతా తగు జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా జిల్లాలోని శంషాబాద్, ఇబ్రహీంపట్నం, ఆదిబట్ల, తుర్కయంజాల్, తుక్కుగూడ, మహేశ్వరం, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, తదితర ప్రాంతాల్లో ఈ వేడుకలకు వేదికలు అవుతున్నాయి. వేడుకలు జరుపుకునేవారు ముందు జాగ్రత్త చర్యలు పాటించి వ్యాధి వ్యాప్తికి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు.
వ్యక్తిగత బాధ్యతగా గుర్తించాలి
న్యూ ఇయర్ వేడుకల్లో స్వీయ నియంత్రణతోనే ఒమిక్రాన్కు అడ్డుకట్ట వేయవచ్చునని ప్రభుత్వం, నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే కరోనా మొదటి, రెండో విడుతలతో భారీ నష్టాన్ని చవిచూసిన జనం ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్పై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రజలు దీనిని వ్యక్తిగత బాధ్యతగా గుర్తించి ఎవరికి వారు స్వీయ నియంత్రణ పాటిస్తే ఒమిక్రాన్ నుంచి బయటపడుతాం. నిర్లక్ష్యంగా ఉంటే వైరస్ ముప్పును కొని తెచ్చుకున్నట్లే. పాత సంవత్సరానికి వీడ్కోలు పేరుతో యువకులు, విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వేడుకలకు సిద్ధమవుతున్నారు. కనీసం మాస్కులు కూడా ధరించడంలేదు. దీంతో మరింత వ్యాపించే అవకాశాలు తీసుకురావద్దని వైద్యులు సూచిస్తున్నారు.
ఇండ్లలోనే చేసుకుంటే మంచిది..
కొత్త సంవత్సరం వేడుకలను కుటుంబసభ్యుల మధ్య ఇండ్లలోనే చేసుకుంటే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. వేడుకల్లో పాల్గొనే యువత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇప్పటికే కరోనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీచేసిన తరుణంలో యువకులు నిర్లక్ష్యం మత్తును వదలాలి. కరోనా సృష్టించిన బీభత్సంతో రోడ్డునపడిన కుటుంబాలను గుర్తుచేసుకోవాలి.
వైరస్ వ్యాప్తికి అవకాశం ఇవ్వద్దు..
రంగారెడ్డిజిల్లాలో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే శంషాబాద్, హయత్నగర్ తదితర ప్రాంతాల్లో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. అలాగే, జిల్లాలో కరోనా కేసులు కూడా మళ్లీ పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాత సంవత్సరం వీడ్కోలు, కొత్త సంవత్సరం స్వాగతం వంటి వేడుకలతో కరోనా, ఒమిక్రాన్ కేసులు పెరుగటానికి అవకాశమివ్వద్దని వైద్యులు సూచిస్తున్నారు..
ఈ జాగ్రత్తలు తీసుకోవాలి : అబ్బయ్య, డాక్టర్
కొత్త సంవత్సరం కోసం జరుపుకునే వేడుకల్లో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలి. భౌతికదూరం పాటించాలి. గుంపులు గుంపులుగా ఒకేచోట చేరకుండా ఉండటం మంచిది. బయటి పదార్థాలను వీలైనంత వరకు తీసుకోవద్దు. చల్లటి ఆహార పదార్థాలు, ద్రవపదార్థాలకు దూరంగా ఉండాలి. వాతావరణం కూడా చల్లగా ఉండటం వలన రాత్రిపూట ఎక్కువగా బయట తిరుగడం మంచిది కాదు.
ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దు : ఏసీపీ బాలకృష్ణారెడ్డి, ఇబ్రహీంపట్నం
కొత్త సంవత్సరానికి స్వాగతం.. పాత సంవత్సరానికి వీడ్కోలు వంటి వేడుకలతో ఇతరులకు ఇబ్బందులు కలిగించొద్దు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం నిషేధం. తాగి వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణామవుతున్నందున.. రెండు రోజుల పాటు డ్రంక్ అండ్ డ్రైవ్ను ముమ్మరం చేస్తున్నాం. డీజేలు, సౌండ్బాక్సులకు ఎలాంటి అనుమతిలేదు.