సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ) : ఆస్తిపన్ను చెల్లింపులు, స్వీయ మదింపు (సెల్ఫ్ అసెస్మెంట్) మరింత పారదర్శకంగా ఉండేందుకు జీహెచ్ఎంసీ తెరపైకి సరికొత్త సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తీసుకువస్తున్నది. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా వచ్చే దరఖాస్తులను పరిశీలించి, నకిలీ వివరాలు గుర్తించే కొత్త సాఫ్ట్వేర్ను పరిచయం చేస్తున్నది. విస్తీర్ణాన్ని తక్కువగా పేర్కొనడం, వాణిజ్య భవనాలను నివాసాలుగా చెప్పి తక్కువ పన్ను చెల్లిస్తున్న కేటుగాళ్ల భరతం పట్టేందుకు ‘ప్రాపర్టీ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ మెనేజ్మెంట్ సిస్టం (పీటీఐఎంఎస్) అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు 36 నెలల పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు టెండర్లను ఆహ్వానించారు. సెల్ఫ్ అసెస్మెంట్ ద్వారా ఇప్పటి వరకు జారీ అయిన ఇంటి నంబర్లు, ఎప్పటి నుంచో ఆస్తిపన్ను చెల్లిస్తున్న భవనాలను సైతం పీటీఐఎంఎస్ ద్వారా పరిశీలించనున్నారు.
నకిలీ పత్రాలతో ఇంటి నంబర్ తీసుకున్న వారిపై జీహెచ్ఎంసీ ఉక్కుపాదం మోపుతున్నది. నోటరీ పత్రాలతో జారీ అయిన ఇంటి నంబర్లను గుర్తించి సంబంధిత వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్లలో క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నది. రిజిస్టర్ పత్రాలున్నా…ఆన్లైన్ దరఖాస్తు ద్వారా నిమిషాల్లో ఇంటి నంబర్ ఇవ్వాలనే లక్ష్యంతో ‘స్వీయ మదింపు’ విధానాన్ని తీసుకువచ్చారు. కొందరు ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ తరహా మోసాలను గుర్తించిన అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనలో దాదాపు 400 మంది పీటీఐఎన్లను బ్లాక్ చేశారు. వీరిపై స్థానిక పోలీస్స్టేషన్లలో కేసు నమోదు చేస్తున్నారు. మోసపూరిత దరఖాస్తు చేసి పీటీఐఎన్(ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబరు)లు పొందిన వారిపై తనిఖీలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.