తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానాలను తల్చుకుంటే ఇప్పటికీ ప్రజల రక్తం ఉడుకుతది. అలాంటిది తాజాగా కేంద్ర మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘అమరుల చావుకు మా(కాంగ్రెస్) బాధ్యత లేదు.. సారీ..’ అంటూ చెప్పడంపై ప్రజలు మండిపడుతున్నారు. డిసెంబర్ 9న చేసిన ప్రకటనను కాంగ్రెస్ వెనక్కి తీసుకోవడంతోనే ఉమ్మడి జిల్లాకు చెందిన ఎందరో యువకులు, విద్యార్థులు ఆత్మబలిదానాలు చేసుకున్నారు. ఆ మరణాలతో తమకెలాంటి సంబంధం లేదని చిదంబరం వ్యాఖ్యానించడంపై అమరుల కుటుంబాలు, తెలంగాణ వాదులు భగ్గుమంటున్నారు.
సాఫీగా సాగాల్సిన రాష్ట్ర విభజనను వివాదాస్పదం చేసిన వ్యక్తే మళ్లీ వచ్చి పశ్చాత్తాపం ప్రకటించడం.. ‘చంపినోడే..అయ్యో’ అని ఏడ్చినట్లు ఉందని ఉమ్మడి జిల్లా ప్రజానీకం ఎద్దేవా చేస్తున్నది. అమరుల ఆత్మలకు అవమానం కలిగేలా మొక్కుబడి ‘సారీ’తో సరిపెట్టి తెలంగాణ ఉద్యమ గాయాన్ని మళ్లీ రగిల్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యమ సమయంలో శవ రాజకీయం చేసిన కాంగ్రెస్ దుర్నీతిని ఎండగడుతున్నారు. నాడు ఆత్మబలిదానాలను చూసి చలించిన కేసీఆర్ ఇక ఒక్క ప్రాణం కూడా పోకూడదని సంకల్పించారని గుర్తు చేస్తున్నారు. ‘ఏదైనా నాతోనే తేలిపోవాలె.. నేను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ఏదో ఒకటి జరగాలని’ అని కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగి చావు అంచులవరకు వెళ్లి రాష్ర్టాన్ని సాధించిన సంగతి కాంగ్రెస్ నేతలకు తెలువదా అని ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్ ఒక్క ‘సారీ’తో ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నదని.. అయినా తమ మద్దతు బీఆర్ఎస్కే అని చెబుతున్నారు.
ప్రజలు రోడ్లపైకి వచ్చి పోరాడుతున్నా.. తెలంగాణ విషయంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెతక వైఖరి అవలంబించింది. అలాంటి పరిస్థితిలో తెలంగాణ రాదేమోనని నా కుమారుడు తిరుమలేశ్ ఆత్మబలిదానం చేసుకున్నాడు. ప్రత్యేక తెలంగాణపై కాంగ్రెస్ చేసిన నిర్లక్ష్యమే నా కొడుకును బలితీసుకున్నది. చేతికొచ్చిన కొడుకు చనిపోవడం.. అనారోగ్యంతో నా భర్త మంచాన పడటంతో ఎలా జీవించాలో తెలియని తరుణంలో సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. రూ.10లక్షల ఆర్థికసాయం అందించడంతోపాటు, నా చిన్న కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు.నా బిడ్డలాంటి ఎంతోమంది అమరవీరులు కలలుగన్న తెలంగాణను సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారు.
రంగారెడ్డి, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని, ఆత్మ బలిదానాలను అవమానించిన కాంగ్రెస్పై రంగారెడ్డి జిల్లా ప్రజానీకం భగ్గుమంటున్నది. డిసెంబర్ 9న చేసిన ప్రకటనను కాంగ్రెస్ వెనక్కి తీసుకోవడంతో జిల్లాకు చెందిన ఎందరో ఆత్మబలిదానాలు చేసుకోగా.. అప్పటి మరణాలతో తమకెలాంటి బాధ్యత లేదని కేంద్ర మాజీ మంత్రి చిదంబరం వ్యాఖ్యానించడంపై అమర వీరుల కుటుంబాలు, తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమరుల ఆత్మలకు అవమానం కలిగేలా మొక్కుబడి ‘సారీ’తో సరిపెట్టి తెలంగాణ ఉద్యమ గాయాన్ని మళ్లీ రగిల్చారని యావత్ ప్రజానీకం మండిపడుతున్నది. ప్రజల కొట్లాట, ఎందరో అమరవీరుల త్యాగం, కేసీఆర్ తెగింపుతోనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధ్యమైందని, పోరాటాల ఫలితంగా గతిలేని పరిస్థితిలో తెలంగాణ రాష్ర్టాన్ని ఇవ్వాల్సి వచ్చిందే తప్ప ఇక్కడి ప్రజలపై ప్రేమతో కాదని ప్రజానీకం గుర్తు చేస్తున్నది. ఉద్యమ సమయంలో శవ రాజకీయం చేసిన కాంగ్రెస్ దుర్నీతిని ఈ సందర్భంగా ఎండగడుతున్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలే.. ఆంధ్రోళ్ల పెత్తనం పోయి మా ఉద్యోగాలు మాకు రావాలే.. మా ప్రాంతాల అభివృద్ధికి నిధులు రావాలె.. అన్నింటికన్నా ముఖ్యంగా బీడుబడ్డ మా పొలాలకు నీళ్లు రావాలె.. అని నాటి తెలంగాణ ఉద్యమ సారథి, నేటి సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు యావత్ తెలంగాణ కదిలింది. ఇందులో రంగారెడ్డి జిల్లా సైతం భాగస్వామ్యమై ఉద్యమంలో తనవంతు పాత్రను పోషించింది. ఊరూ వాడా ఏకమై తెలంగాణ నినాదం ఎత్తుకుని ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లింది. కానీ.. కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అసలే పట్టించుకోలేదు. ఆంధ్రా నేతలు సైతం బెదిరింపులతో తెలంగాణ ఏర్పాటుకు మోకాలడ్డారు.
ఇవన్నీ కండ్లరా జూసి తెలంగాణ రాష్ట్రం కల నెరవేరదేమోనన్న ఆందోళనతో జిల్లాకు చెందిన అనేక మంది ప్రాణత్యాగం చేశారు. ఎంత కొట్లాడినా తెలంగాణ రాదు.. మా బతుకులు బాగు పడవు.. మాకు ఉద్యోగాలు రావు.. అని లెటర్లు రాసి ఆత్మహత్యలు చేసుకున్నారు. సొంత రాష్ట్రం కల సాకారం కోసం కొందరు ఉరి వేసుకున్నారు. మరికొందరు ఒంటికి నిప్పంటించుకున్నారు. ఇంకొందరు క్రిమిసంహారక మందును తాగి ఆత్మార్పణం చేశారు. ఆ మరణాలను చూసి చలించిన కేసీఆర్ తెలంగాణ కోసం ఇగ ఒక్క ప్రాణం కూడా పోకూడదని సంకల్పించారు. ఏదైనా నాతో తేలిపోవాలె.. నేను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. ఏదో ఒకటి జరగాలని ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అదే చివరి ఘట్టం కాగా.. ఆ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూల ప్రకటన వచ్చింది.
తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ అనుసరించిన విధానాలను తల్చుకుంటే ఇప్పటికీ ప్రజల రక్తం ఉడుకుతున్నది. ఇక తాజాగా.. కాంగ్రెస్ మాజీ మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలతో కడుపు తరుక్కుపోతున్నది. ఆత్మ బలిదానాలతో ఇప్పటికీ ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపిస్తుంటే.. చిదంబరం మానిన గాయాన్ని మళ్లీ రగిల్చారు. అమరుల చావుకు మా బాధ్యత లేదని.. చనిపోయినందుకు సారీ.. అంటూ సింపుల్గా చెప్పేసి వెళ్లిపోయాడు. సాఫీగా సాగాల్సిన తెలంగాణ విభజనను కాంప్లికేట్ చేసిస వ్యక్తే మళ్లీ వచ్చి పశ్చాత్తాపం ప్రకటించడంపై.. చంపినోడే.. అయ్యో అని ఏడ్చినట్లు ఉందని ప్రజానీకం ఎద్దేవ చేస్తున్నది. వేల మంది ప్రాణాలు కోల్పోవడానికి కారకులు మీరు కాదా ? అంటూ ప్రశ్నిస్తున్నది. తెలంగాణను వల్లకాడు చేసి.. ఎందరో తల్లులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది కాంగ్రెస్ పార్టీయేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిక్కటి నెత్తురును చేతులకు అత్తరులా పూసుకుని అమరుల కుటుంబీకులపై కపట ప్రేమను ప్రదర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీని నమ్మే పరిస్థితిలో ఎవరూ లేరని అమరవీరుల కుటుంబీకులు, ఉద్యమ కారులు పేర్కొంటున్నారు.
ఉద్యమంలో ప్రాణాలు త్యజించిన అమరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా నిలిచారు. రూ.10 లక్షల ఆర్థికసాయంతోపాటు ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి భరోసానిచ్చారు. ఇంటిపెద్దను కోల్పోయిన వారికి పెద్దదిక్కయ్యారు. తండ్రిలా.. అన్నలా.. కొడుకులా మారి అమరవీరుల కుటుంబాలకు ఏలోటూ రాకుండా చూస్తున్నారు. గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో అమరువీరుల త్యాగాల స్ఫూర్తితో అటు తెలంగాణ రాష్ర్టాన్ని, ఇటు జిల్లాను అన్ని రంగాల్లోనూ నంబర్ వన్గా తీర్చిదిద్దారు.
తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలకు ప్రధాన కారంణం ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టే. ఎందుకంటే తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తున్నామని 2009 డిసెంబర్ 9న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక వ్యక్తి గా ఉన్న చిదంబరం ప్రకటన చేశారు. అదే ప్రకటనను కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకకు తీసుకోవడంతో తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేలా లేదని ఆత్మైస్థెర్యాన్ని కోల్పోయిన తెలంగాణ బిడ్డలు 12 వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. దీనికి కారణం నాటి కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యమే కాదా.. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచ్చి ఉంటే వందలాది మంది చనిపోయేవారు కాదు. ఆత్మబలిదానాలను అవమానించే విధంగా చిదంబరం మాట్లాడటం బాధాకరంగా ఉన్నది.
ఆత్మబలిదానాలకు.. కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదని చిదంబరం అనడం సిగ్గు చేటు.. తెలంగాణ రాష్ర్టాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. చంకలు గుద్దుకుంటున్న కాంగ్రెస్ నేతలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పడానికి చిదంబరం వ్యాఖ్యలతో సిద్ధమయ్యారు. ఇవ్వాల్సిన సమయంలో తెలంగాణ ఇచ్చి ఉంటే ఎందుకు ఇంత మంది చనిపోయేవారు. తెలంగాణలో ఎన్నికలు రావడంతో తెలంగాణ ఆత్మబలిదానాలకు.. కాంగ్రెస్కు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ముఖ్యనేత అనడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉన్నది.. కాంగ్రెస్ కుట్రను తెలంగాణ ప్రజలు గమనించి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ చరిత్రను వక్రీకరించే పనిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ నాటకాన్ని ప్రజలు గమనించాలి.
తన అన్న నరాల తిరుమలేశ్ తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దదిక్కును కోల్పోయి బాధలో ఉన్న మా కుటుంబానికి ఎలాంటి లోటు రాకుండా సీఎం కేసీఆర్ చూసుకున్నాడు. తమ అన్న ఉద్యోగం చేసి తమ కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న తరుణంలో ఆయన మృతి చెందడంతో తమ కుటుంబానికి దిక్కుమొక్కు లేకుండా పోయింది. ఈ తరుణంలో సీఎం కేసీఆర్ మా కుటుంబానికి రూ.10లక్షలు ఇచ్చి ఆదుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారం తనకు కార్మిక శాఖలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాడు. ముఖ్యమంత్రి అందించిన తోడ్పాటుతో తమ కుటుంబం ఎలాంటి చీకుచింత లేకుండా ఉన్నది. సీఎం కేసీఆర్ మా కుటుంబానికి అండగా నిలిచారు. సీఎం కేసీఆర్కు తాము రుణపడి ఉంటాం.
ఇబ్రహీంపట్నంరూరల్, నవంబర్ 18 : తన చావుతోనైనా తెలంగాణ రావాలని… తెలంగాణ వస్తే తనలాంటివారందరికీ ఉద్యోగాలొస్తాయన్నది నరాల తిరుమలేశ్ ఆలోచన… తాను ఇంజినీరింగ్ చదివి ఇంటి వద్ద ఉంటూ తల్లిదండ్రులకు భారం కాలేకపోతున్నానని తలవంపుతో గడిపేవాడు. తెలంగాణ ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడు రాదని అందరితో చెబుతుండేవాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యమానికి తానుసైతం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్నానని పలుమార్లు వేదికలపై ఉపన్యాసాలిచ్చాడు. అయినా..కేంద్ర ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో ఇంట్లో ఎవరులేని సమయంలో తెలంగాణ కోసం తాను ప్రాణత్యాగం చేస్తున్నానని, తనలాంటివారి చావుతోనైనా తెలంగాణ వస్తే మిగతావారు బాగుపడతారని లేఖరాసి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామానికి చెందిన నరాల తిరుమలేశ్ ఆత్మబలిదానం చేసుకుని చరిత్రలో చిరస్థాయిగా నిలిచాడు. నగరశివారుల్లోని టీకేఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు.
ఇంజినీరింగ్ పూర్తి చేసిన తిరుమలేశ్ ఉద్యోగం రాక ఇంటివద్దనే ఉంటున్నాడు. తనకు ఉద్యోగం రాకపోవటంతో తన తమ్ముడు, తల్లిదండ్రులను ఎలా ఆదుకునేదని పలుమార్లు ఆవేదన వ్యక్తం చేసేవాడు. అందులో భాగంగానే 24-3-2010న ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న పరిస్థితిలో తెలంగాణ కోసం అనేకమంది బలిదానాలు చేసుకున్నారు. అదేవరుసలో తానుకూడా నిలువాలని భావించి ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఆత్మహత్యతోనైనా తెలంగాణ ఏర్పడుతుందని గట్టిగా నమ్మేవాడు. తనలాంటి చదువుకున్నవారికి తెలంగాణ వస్తేనే ఉద్యోగాలొస్తాయని నమ్మి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్లో రాసి తనువు చాలించాడు. అతడి మరణంతో ఇబ్రహీంపట్నంలో ఉద్యమం మరింత ఉధృతమైంది. తిరుమలేశ్ మృతదేహంతో ఇబ్రహీంపట్నంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. ఉద్యమనేతలంతా ఇబ్రహీంపట్నం సివిల్ ఆస్పత్రికి చేరుకుని నివాళులర్పించారు.