ఇబ్రహీంపట్నం/ ఇబ్రహీంపట్నంరూరల్, జనవరి 14 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఆదివారం బోగిపండుగను ప్రజలు ఘనంగా జరుపుకొన్నారు. ఉదయం నుంచే ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేసి బొడ్డెమ్మలను పెట్టారు. బోగిపండుగ సందర్భంగా యువకులు, పెద్ద ఎత్తున బోగిమంటలు కాల్చారు. మూడురోజుల పాటు జరుగనున్న పండుగ సందర్భంగా సుదూర ప్రాంతాల్లో ఉన్నవారు కూడా గ్రామాలకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.
పండుగ సందర్బంగా ఇబ్రహీంపట్నంలోని కిరాణాషాపులు సామాను కొనుగోలు దారులతో కిటకిటలాడాయి. గ్రామాల్లో గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసులు కూడా సందడి చేశారు. ఇబ్రహీంపట్నం, మంచాల, యాచారం, అబ్దుల్లాపూర్మెట్ మండలాలతో పాటు ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్, పెద్దఅంబర్పేట్, ఆదిబట్ల మున్సిపాలిటీల్ల్లో సంక్రాంతి పండుగ ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు. పండుగ సందర్భంగా యువకులు గ్రామాల్లో క్రీడాపోటీలు నిర్వహించారు.
షాబాద్ : చేవెళ్ల నియోజకవర్గంలో భోగి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం నియోజకవర్గంలోని షాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి మండలాల్లోని ఆయా గ్రామాల్లో ప్రజలు భోగి మంటలు వేశారు. అనంతరం మహిళలు వాకిళ్లలో కలాపిలు చల్లుకుని రంగురంగుల ముగ్గులు వేశారు. ఆయా గ్రామాల్లో యువకులు పతంగులు ఎగురవేశారు. గ్రామాల్లో ఎక్కడ చూసిన సంక్రాంతి పండుగ వేడుకల్లో ప్రజలు నిమిగ్నమయ్యారు.
పెద్దఅంబర్పేట : మున్సిపాలిటీలో భోగి పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున భోగి మంటలు వేశారు. కాలనీ అసోసియేషన్ల ఆధ్వర్యంలో పిల్లా పెద్దలతో కలిసి సందడి చేశారు. 13వ వార్డు పరిధి సూర్యమెడోస్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో శ్రీనివాస్, సంపత్కుమార్రెడ్డి, జగన్నాథ్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. మౌసింగ్బోర్డు కాలనీలో ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. విజేతలకు కాలనీ ప్రెసిడెంట్ పాశం జైహింద్ ఆధ్వర్యంలో బహుమతులు అందజేశారు.
కడ్తాల్ : సంక్రాంతి పండుగకి ఆడపడుచులు, బంధువుల రాకతో గ్రామాల్లోని ఇండ్లన్ని కళకళలాడుతున్నాయి. ప్రజలు భోగి మంటలను ఏర్పాటు చేశారు. ప్రజలు తమ ఇండ్లలోని పాత వస్తువులను, సామాగ్రిని భోగి మంటల్లో వేశారు. చిన్న పిల్లలకు మహిళలు బోగి పండ్లను పోశారు.