షాబాద్, మే 1: రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా 80 బృందాల ద్వారా ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాల్లో 11,657 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 457 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. 380 మందికి ప్రిస్కిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ చేశారు. అవసరమున్న వారికి కంటి అద్దాలతోపాటు, మందులు పంపిణీ చేస్తున్నారు. వందరోజుల పాటు నిర్వహించే ఈ రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. జిల్లాలోని ఆయా మండలాల్లో కొనసాగుతున్న కంటి వెలుగు క్యాంపులను ఆరోగ్యశాఖ అధికారులు సందర్శించి సిబ్బందికి సలహాలు, సూచనలు అందిస్తున్నారు.
బొంరాస్పేట : గ్రామాలు, మున్సిపల్ పరిధిలోని వార్డుల్లో నిర్వహించే వైద్య శిబిరాలకు ప్రజలు ఉత్సాహంగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకుంటున్నారు. 42 కంటి వెలుగు కేంద్రాలలో వైద్య బృందాలు అప్పటికప్పుడే పరీక్షలు నిర్వహించి కంటి సమస్యలున్న వారికి చుక్కల మందుతో పాటు విటమిన్ మాత్రలు పంపిణీ చేస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేసి కళ్లద్దాలు పంపిణీ చేస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, మండలాల నోడల్ అధికారులు కంటి వెలుగు శిబిరాలను సందర్శించి పర్యవేక్షిస్తున్నారు. సోమవారం జిల్లాలో 5190 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వీరిలో 566 మందికి రీడింగ్ గ్లాసులు పంపిణీ చేయగా, 711 మందికి అద్దాలను ఆర్డరిచ్చారు. జిల్లాలో ఇప్పటివరకు 383 గ్రామాలు, 75 వార్డుల్లో కంటి వెలుగు వైద్య శిబిరాలను నిర్వహించినట్లు డీఎంహెచ్వో పాల్వన్కుమార్ తెలిపారు.