బొంరాస్పేట, జనవరి 29 : తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లను అందజేస్తూ లబ్ధిదారులకు బతుకుపై భరోసా నింపుతున్నది. భర్త మృతి చెందితే జీవిత భాగస్వామికి 57 ఏండ్లు పైబడితే వృద్ధాప్య పింఛన్, ఆలోపు వారికి వితంతు పింఛన్ మంజూరు చేయాలని ఆసరా పింఛన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం సడలించింది. ప్రతినెలా ఇలాంటివారిని గుర్తించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగా, ఉన్నతాధికారులు మండల అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతో అర్హులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. భార్య ఆధార్ కార్డుతో పాటు భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని జత చేసి దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే పింఛన్ అందేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. గత ఏడాది ఆగస్టులోప్రభుత్వం అన్ని విభాగాల్లో అర్హులను గుర్తించి కొత్త పింఛన్లను మంజూరు చేసింది. దీంతో పింఛన్ పొందుతున్న వికారాబాద్ జిల్లా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం అందజేసే ఆసరా పింఛన్తోనే జీవనం సాగిస్తున్న నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. ప్రభుత్వం వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత, గీత, బీడీ కార్మికులు, హెచ్ఐవీ బాధితులు, డయాలసిస్ రోగులు, బోదకాలు వ్యాధిగ్రస్తులు ఇలా అనేక మందికి ప్రతినెలా ఆసరా పింఛన్ల రూపంలో రూ.2016, 3016లను అందజేస్తున్నది. ఇంట్లో ఒకరికి మాత్రమే పింఛన్ అందిస్తున్నారు. పింఛన్ పొందుతున్న లబ్ధిదారు మరణిస్తే జీవిత భాగస్వామికి వితంతు, వృద్ధాప్య పింఛన్ కోసం ఇక నుంచి ఎన్నో రోజులు వేచి ఉండాల్సిన పనిలేదు.
పింఛన్ పొందుతున్న భర్త మరణిస్తే ఆయన స్థానంలో భార్యకు ఆసరా పింఛన్ను వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు ఆసరా పింఛన్ల నిబంధనలను సడలించింది. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే పింఛన్ మంజూరు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. గత ఏడాది ఆగస్టులో ప్రభుత్వం అన్ని విభాగాల్లో అర్హులను గుర్తించి కొత్త పింఛన్లను మంజూరు చేసింది. భర్త మృతిచెందితే భార్యకు పింఛన్ మంజూరు చేయలేదు. దీనివల్ల భర్త చనిపోయిన వారు పింఛన్ కోసం ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ప్రభుత్వం వీరి ఇబ్బందులు గమనించి చనిపోయిన భర్తల స్థానంలో భార్యకు పింఛన్ వెంటనే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దీంతో వీరి ఇబ్బందులు తొలగిపోనున్నాయి.
దరఖాస్తు విధానం
వృద్ధాప్య పింఛన్దారు మరణిస్తే ఆయన జీవిత భాగస్వామి అయిన భార్యకు పింఛన్ మంజూరు చేస్తారు. భార్య తన ఆధార్ కార్డుతో పాటు చనిపోయిన భర్త మరణ ధ్రువీకరణ పత్రాన్ని దరఖాస్తు ఫారానికి జతచేసి గ్రామాల్లో అయితే పంచాయతీ కార్యదర్శికి, పట్టణాల్లో అయితే పురపాలక సంఘం కార్యాలయంలో అందజేయాలి. దరఖాస్తులను పరిశీలించిన అధికారులు వాటిని ఆన్లైన్లో ఉన్నతాధికారులకు పంపిస్తారు. ఈ ప్రక్రియ అంతా 15 రోజుల్లో పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఆ తరువాత ఉన్నతాధికారులు వాటిని పరిశీలించి పింఛన్ మంజూరు చేస్తారు. 57 ఏండ్లు పైబడిన వారికి వృద్ధాప్య పింఛన్, ఆలోపు ఉన్నవారికి వితంతు పింఛన్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దరఖాస్తు చేసుకున్న అర్హులను గుర్తించి వచ్చే నెల నుంచి పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ప్రతినెలా ఇలాంటి బాధితులను గుర్తించి తక్షణం లబ్ధి చేకూర్చేలా ఆసరా వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఉన్నతాధికారులు మండల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
జిల్లాలో 1.13 వేల మందికి ఆసరా పింఛన్లు
వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వం ప్రతినెలా1,13,992 మందికి ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తున్నది. వీరిలో 42,711 మందికి వృద్ధాప్య, 50,853 వితంతు, 12,907 దివ్యాంగులు, 438 గీత కార్మికులు, 150 చేనేత, 1199 హెఐవీ బాధితులు, 208 పైలేరియా బాధితులు, 93 డయాలసిస్ రోగులు, 4697 మంది ఒంటరి మహిళలు, 39 మంది బీడీ కార్మికులకు ఆసరా పింఛన్లను అందిస్తున్నది. దివ్యాంగులకు రూ.3016, మిగతావారికి రూ.2016 చొప్పున ప్రతినెలా రూ.26.87 కోట్లు అందజేస్తున్నది.
మంచి నిర్ణయం : కృష్ణన్, డీఆర్డీవో
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల భర్తలు కోల్పోయిన వారికి వెంటనే పింఛన్ అందే అవకాశం కలిగింది. దీనిని సద్వినియోగం చేసుకోవాలి. మండలాల్లో పంచాయతీ కార్యదర్శులకు దరఖాస్తులు అందజేయాలి. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. జిల్లాలో ఇప్పటివరకు 150 దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి పింఛన్ మంజూరు చేస్తాం.