పెద్దఅంబర్పేట, ఏప్రిల్ 14 : ఆస్తి పన్ను వసూళ్లలో పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ పురోగతి సాధించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం కంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో అధికంగా పన్ను వసూలు చేసింది. లక్ష్యంలో దాదాపు 63 శాతం వసూళ్లతో ముందడుగు వేసింది. ప్రస్తుతం మళ్లీ 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న 5 శాతం రాయితీపై దృష్టి పెట్టింది.
ప్రత్యేక బృందాలతో వసూళ్లు
మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండగా.. మొత్తం 8 మంది బిల్ కలెక్టర్లు ఉన్నారు. వార్డుల్లోని ఆయా కార్యాలయాల దగ్గర వీరు ఆస్తి పన్ను వసూలు చేస్తున్నారు. కొన్నిసార్లు నేరుగా ఇండ్లకు వెళ్తున్నారు. మొండి బకాయిదారులు ఎంతమంది ఉన్నారు? వారి చిరునామాలు ఏమిటి? ఎంత కాలంగా పన్ను చెల్లించలేదు? చెల్లించాల్సిన పన్ను మొత్తం ఎంత ఉన్నది? ఇలా అన్ని వివరాలు సేకరించారు. మొండి బకాయిల వసూళ్లపై అధికారులు మరింత శ్రద్ధ పెట్టారు. మొండి బకాయిదారుల జాబితాను సిద్ధం చేశారు. ఒక్కో వార్డులో వంద మందితో కూడిన జాబితాలు తయారు చేశారు. వారి నుంచి పన్ను వసూళ్లకు ప్రత్యేకంగా ముగ్గురితో కూడిన కొన్ని టీంలను ఏర్పాటు చేశారు. మొండి బకాయిలు వసూలు చేయడమే ఆ టీంల పని. వీలు దొరికినప్పుడల్లా జాబితాలోని ఫోన్ నంబర్కు ఫోన్ చేశారు. పన్ను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఫలితంగా పన్ను వసూళ్లలో ముందడుగు వేశారు.
గతంతో పోలిస్తే ఎక్కువే
మున్సిపాలిటీలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సాధారణంగా రూ.6 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేయాల్సి ఉంటుంది. గతంలో ఉన్న బకాయిలు (ఏరియర్స్) కలిపి మొత్తం రూ.14.04 కోట్ల ఆస్తి పన్నులు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మార్చి 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగియగా.. ఆస్తి పన్ను దాదాపు రూ.8.92 కోట్లు వసూలు చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏరియర్స్ కలిపి రూ.11.56 కోట్లు వసూలు చేయాల్సి ఉండగా.. రూ.5.47 కోట్లు అంటే 47.34 శాతం వసూలు చేశారు. అంతకుముందు 2020-21లో ఏరియర్స్తో కలిపి రూ.8.6 కోట్లు వసూలు చేయాలని లక్ష్యం పెట్టుకోగా.. 7.59 కోట్లు అంటే 88 శాతం పన్నులను వసూలు చేశారు.
చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్లు
2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఈ నెల 30వ తేదీ వరకు చెల్లించే వారికి రాష్ట్ర ప్రభుత్వం సువర్ణావకాశం కల్పించింది. ఏడాదికి సంబంధించిన పన్ను చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ స్కీంపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. పన్ను చెల్లింపుదారులకు ఎస్ఎంఎస్లు పంపాలని నిర్ణయించారు. బిల్ కలెక్టర్లతో ఈ మేరకు సమావేశం నిర్వహించారు. బ్యానర్లు ఏర్పాటు చేసి స్కీంపై అవగాహన కల్పిస్తామని మున్సిపల్ అధికారులు తెలిపారు. ఇంటింటికీ వెళ్లి పన్ను చెల్లించేలా చైతన్యపరుస్తున్నట్టు చెప్పారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ ఈ స్కీంను పెట్టారు. అప్పుడు దాదాపు 3,500 మంది ఆస్తి పన్నులు చెల్లించారు. దీనిద్వారా రూ.85 లక్షలు వసూలయ్యాయని తెలిపారు. ఈ నెలలో 4 వేల మంది నుంచి దాదాపు రూ.2 కోట్లు వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్తున్నారు. ఇందుకు అనుగుణంగా పన్ను వసూళ్లపై దృష్టి సారించామని అంటున్నారు.
5 శాతం రాయితీపై అవగాహన
ఆస్తి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టిపెట్టాం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.8.92 కోట్ల ఆస్తి పన్ను వసూలు చేశాం. ప్రస్తుతం ఈ నెల 30వ తేదీ వరకు పన్ను చెల్లింపుదారులకు రాష్ట్ర ప్రభుత్వం మంచి అవకాశం కల్పించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్ను ఈ నెలలోనే చెల్లిస్తే 5 శాతం రాయితీ ఇవ్వనున్నది. దీనిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. 4 వేల మంది నుంచి పన్ను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. పన్ను చెల్లిస్తేనే ప్రగతి పనులు ముందుకు సాగుతాయనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. పన్ను కట్టి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలి.
– బైరెడ్డి సత్యనారాయణరెడ్డి, కమిషనర్, పెద్దఅంబర్పేట మున్సిపాలిటీ