వికారాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ) : కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని విక్రయించిన రైతులకు రెండు, మూడు రోజుల్లో చెల్లింపులు పూర్తి చేస్తామంటూ ప్రభుత్వం చెబుతున్నా.. పది, పదిహేను రోజులైనా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ కావడంలేదు. ధాన్యాన్ని సేకరించిన వెంటనే బిల్లులు చేయాల్సిన కేంద్రాల సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతోపాటు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకపోవడంతో చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్టు సమాచారం. కాగా, జిల్లాలో ఇప్పటివరకు 2,494 మంది రైతుల నుంచి 13,864 (రూ.33.50 కోట్లు) మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా.. ఇప్పటివరకు 5,287 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన రూ. 12.72 కోట్ల చెల్లింపులు పూర్తి చేయగా, రూ. 20.78 కోట్ల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్ డబ్బులను వెంటనే చెల్లించాలని రైతులు అధికారులను కోరుతున్నారు. మరోవైపు కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు విధిస్తుండటంతోపాటు తరుగు పేరిట అన్నదాతను నిలువు దోపిడీ చేస్తున్నారు. 40 కిలోల బస్తాలో 5 కిలోల వరకు తరుగు తీస్తున్నట్టు , క్వింటాకు 10 కిలోల వరకు తీస్తే తమకు నష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే కొర్రీలు పెడుతూ.. నిలువు దోపిడీ చేస్తుండడంతో ప్రైవేట్ వ్యాపారులు, దళారులను ఆశ్రయించి తక్కువ ధర వచ్చినా అన్నదాతలు విక్రయిస్తున్నారు. కాగా, జిల్లాలో ఈ యాసంగిలో లక్ష ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 1,10,000 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు.
కొన్నది 10 శాతమే..
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. యాసంగిలో 1,10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటివరకు కేవలం 10శాతం ధాన్యాన్ని మా త్రమే సేకరించారు. అంటే 13,864 మెట్రిక్ టన్నుల ధాన్యాన్నే రైతుల నుంచి కొన్నారు. గన్నీ బ్యాగుల కొరతతో అన్నదాతలు వడ్లను కల్లాలు, రోడ్లు, ఇండ్ల వద్ద ఆరబోసి.. ఎప్పుడూ ప్రభుత్వం కొంటుందా..? అని ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా కాంటా చేసిన ధాన్యాన్ని సకాలంలో రైస్ మిల్లర్లకు తరలించడంలోనూ జాప్యం జరుగుతున్నది. లారీలు కూడా సక్రమంగా రావడంలేదు. దీంతో కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం బస్తాల వాహనాలు కిలోమీటర్ల మేర క్యూలో ఉంటున్నాయి. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తేనే కేంద్రాల వద్ద సేకరణ త్వరగా పూర్తవుతుంది. మరోవైపు బీఆర్ఎస్ హయాంలో ప్రతి గ్రామంలోనూ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గింజనూ రైతుల నుంచి కొని మద్దతు ధర చెల్లించింది. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రైతుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ అన్యాయం చేస్తున్నది. జిల్లాలోని రైతులు కోతలు పూర్తి చేసుకుని కల్లాలు, రోడ్లపై ఆరబెట్టి ఎప్పుడు ప్రభుత్వం కొంటుందా అని ఎదురుచూస్తున్నారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా, జిల్లాలో ధాన్యాన్ని 129 కేంద్రాల్లో సేకరించాలని అధికారులు భావించగా.. 90 కేంద్రాల్లోనే ధాన్యం సేకరణ సాగుతున్నది.