యాచారం, మే 6 : ఫార్మా భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించుకుంటే భూముల చుట్టూ కంచె ఏర్పాటు పనులను అడ్డుకుంటామని రైతులు స్పష్టం చేశారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా యాచారం తహసీల్దార్ కార్యాలయంలో పట్నం ఆర్డీవో అనంతరెడ్డి మండలంలోని మేడిపల్లి, నానక్నగర్ గ్రామాలకు చెందిన ఫార్మా రైతులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. తమ సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆర్డీవోను నిలదీశారు. అసైన్డ్ భూములకు డబ్బులు చెల్లించకుండా పీవోటీ పేరుతో అక్రమంగా ఫెన్సింగ్ వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులకు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించేవరకు.. ఆ భూముల చుట్టూ కంచె ఏర్పాటు చేయొద్దని తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. అసైన్డ్ భూముల చుట్టూ ఫెన్నింగ్ వేస్తున్నామని.. ఆ పనులను అడ్డుకోవద్దన్నారు. బాధిత రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, రైతులు ఇంటి స్థలంతోపాటు నష్టపరిహారాన్ని పెంచి ఇవ్వాలని పట్టుబట్టారు.
ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. దీంతో రైతులు తమ సమస్యలు పరిష్కరించిన తర్వాతే సర్వే చేసిన భూములకు కంచెను ఏర్పాటు చేసుకోవాలని.. అప్పటివరకు వాటి జోలికి రావద్దని కోరారు. కార్యక్రమంలో ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులు గణేశ్, సందీప్రెడ్డి, మహిపాల్రెడ్డి, మంగమ్మ, మేడిపల్లి, నానక్నగర్ గ్రామాలకు చెందిన రైతులున్నారు.