వికారాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వికారాబాద్, పరిగి, తాండూరు ఎమ్మెల్యేలుగా గెలిచిన ప్రసాద్కుమార్, రామ్మోహన్రెడ్డి, మనోహర్రెడ్డిలకు చేవెళ్ల పార్లమెంట్ ఎన్నిక సవాల్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో వచ్చిన మెజార్టీ రాకపోతే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కోసం పనిచేయలేదనే ప్రచారం జరుగుతుందని ముందే గుర్తించిన జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయా నియోజకవర్గాల నాయకులు, క్యాడర్ను బతిమిలాడుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పరిస్థితి వేరు, పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితి వేరు కావడంతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎంత శ్రమించినా.. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజార్టీలో సగం ఓట్లు కూడా వచ్చే అవకాశం లేదనే అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నది.
అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు పనిచేసిన ఎంపీ రంజిత్రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తుండడమే ఇందుకు ఓ కారణంగా చెప్పవచ్చు. రంజిత్రెడ్డి గెలిపించిన పార్టీకి ద్రోహం చేసి పార్టీ మారడంతోపాటు ఎంపీగా ఉండి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోవడంతో ఆగ్రహంతో ఉన్న ప్రజలు మెజార్టీనివ్వడం కాదు.. ఓడించేందుకు సిద్ధమైనట్లు జిల్లా అంతటా ప్రచారం జరుగుతున్నది. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి చేవెళ్ల పార్లమెంట్ ఇన్చార్జిగా వ్యవహరించిన సీఎం రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ ఓటమి ఖాయమని అన్ని సర్వేల్లోనూ తేలడంతోనే ఇన్చార్జి బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో రంజిత్రెడ్డి ఓటమి ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చర్చించుకుంటున్నట్లు సమాచారం.
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తేనే గెలుస్తానని ముందే ఊహించుకొని పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న రంజిత్రెడ్డికి ఈ ఎన్నికల్లో భంగపాటు తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి నియోజకవర్గాల బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించే బాధ్యతను రంజిత్రెడ్డి తీసుకొని పనిచేశారు. ముఖ్యంగా వికారాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా వ్యవహరించి అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను ఇబ్బందులుపెట్టారు. అయినప్పటికీ వికారాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిపై ఉన్న వ్యతిరేకతతో ప్రజలు 12 వేల ఓట్లకు పైగా మెజార్టీతో కాంగ్రెస్ను గెలిపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇందులో సగం ఓట్లు కూడా రావడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఆయా నియోజకవర్గాల సమావేశాల్లోనూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్రెడ్డిని ఆ పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు నిలదీసినట్లు తెలిసింది. నాలుగు రోజుల క్రితం వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులతో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రంజిత్రెడ్డి సమావేశమయ్యారు. సమావేశం ప్రారంభంలోనే రంజిత్రెడ్డిని కాంగ్రెస్ నాయకులు గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ప్రసాద్కుమార్ను ఓడించేందుకు పనిచేసిన ఆయనతో పనిచేయబోమని, తమపై కేసులు పెట్టి ఇబ్బంది పెట్టిన సంగతి ఇంకా మరువలేదని.. రంజిత్రెడ్డి గెలుపు కోసం పనిచేయడం తమవల్ల కాదంటూ కాంగ్రెస్ నాయకులు స్పీకర్ ప్రసాద్కుమార్ ముందే తెగేసి చెప్పినట్లు తెలిసింది.
ఒకరిద్దరు నాయకులయితే అసభ్యపదజాలంతో మాట్లాడినట్లు సమాచారం. దీంతో స్పందించిన కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డి.. సీఎం రేవంత్రెడ్డి మా ఇంటికి వచ్చి పార్టీలో చేరి, పోటీ చేయాలని అడిగితేనే పార్టీలోకి వచ్చినట్లు చెప్పడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలిసింది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయాలంటూ రంజిత్రెడ్డి బతిమిలాడి ప్యాకేజీలిచ్చినా కాంగ్రెస్ నాయకులు మాత్రం పైకి మీ గెలుపు కోసం పని చేస్తామని చెబుతున్నా.. లోలోపల వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తున్నది. రంజిత్రెడ్డిని ఓడించడం ఖాయమనే గుసగుసలు వినిపిస్తుండడం గమనార్హం.
తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్లోనూ పాత, కొత్త క్యాడర్ల వర్గపోరుతో తాండూరు ఎమ్మెల్యే మనోహర్రెడ్డికి తలనొప్పిగా మారింది. ఇటీవల క్యాంప్ కార్యాలయంలో తమకు సమాచారం ఇవ్వడంలేదు, పట్టించుకోవడం లేదంటూ రెండు వర్గాలుగా చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కొట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో హల్చల్ అయ్యింది. పార్లమెంట్ ఎన్నికలేమో కానీ ఈ గొడవలను సద్దుమణిగించడమే ఎమ్మెల్యేకు పెద్ద కష్టంగా మారింది.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో చేరి మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పట్నం కుటుంబం కూడా రంజిత్రెడ్డికి మద్దతుగా ప్రచారానికి దూరంగా ఉండడం ఖాయమని వినిపిస్తున్నది. మల్కాజిగిరిని సాకుగా చూపెడుతూ తాండూరు నియోజకవర్గంతోపాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పట్టున్న పట్నం మహేందర్రెడ్డి రంజిత్రెడ్డి గెలుపునకై సహకరించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ కారణాలతో రంజిత్రెడ్డికి భంగపాటు తప్పదనే ప్రచారం జోరందుకున్నది.