యాచారం, డిసెంబర్ 30 : యాచారంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్య రెట్టింపవుతున్నది. సాగర్ రహదారిపై ప్రైవే ట్ వాహనదారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి అంబేద్కర్ చౌరస్తాలో ఇరవై నుంచి ముప్పై నిమిషాలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో ప్రయాణికులు నిత్యం నానా అవస్థలు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలైన క్రూ జర్లు, జీపులు, ఆటోలు, లారీలు, డీసీఎంలను ఎక్కడపడితే అక్కడ నిలుపుతుండడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతున్నదని ప్రయాణికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోలీసుల నిబంధనలను తుంగలో తొక్కుతూ రోడ్లపైనే వాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. పండుగల సమయంలో సాగర్-హైదరాబాద్ రహదారిపై వాహనాల తాకిడి ఒక్కసారిగా పెరుగుతుంది. అంతేకాకుండా మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద సాగర్ రహదారిపై నిత్యం ట్రాఫిక్జామ్ అవుతున్నది. అక్కడే కందుకూరు లింకురోడ్డు ఉండటంతో రాకపోకలు స్తంభించిపోతున్నాయి. ఫలితంగా ప్రయాణికులు, ప్రజలు ఇబ్బందిపడుతున్నారు. మాల్ మార్కెట్లోనూ ఇదే సమస్య తలెత్తుతున్నది. ముఖ్యంగా మర్రిగూడ రోడ్డులో ఎక్కడ పడితే అక్కడ ప్రైవేట్ వాహనాలను నిలుపుతుండడంతో ట్రాఫిక్ సమస్య పెరుగుతున్నది.
కనీసం బైక్పై వెళ్లాలన్నా అవస్థలు పడాల్సిందే. మంగళవారం వారాంతపు సంత ఉండడంతో కాలినడకన కూడా వెళ్లడం సాధ్యం కాని పరిస్థితి నెలకొన్నది. రోడ్డుపైనే సంతను నిర్వహిస్తుండడంతో ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నది. కిక్కిరిసిన జనం, వాహనాల రాకపోకలతో ట్రాఫిక్ స్తంభించిపోతున్నది. షాపులు, హోటళ్లు, ప్రైవేట్ కార్యాలయాల వద్ద రోడ్డు పక్కనే వాహనా లు, ఆటోలు, ద్విచక్రవాహనాలను ఇష్టారాజ్యంగా నిలుపుతున్నారు. పోలీసులు అక్రమ పార్కింగ్లపై ఉక్కుపాదం మోపాలని, వాహనాల రాకపోకల వేగాన్ని నియంత్రించి, ప్రమాదాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.