పరిగి, మే 5 : రానున్న ఎన్నికల్లోనూ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధించి.. మరోసారి అధికారంలోకి రానున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి అన్నారు. శుక్రవారం బీజేపీ పరిగి పట్టణ ఉపాధ్యక్షుడు ప్రేమ్కుమార్ ఆయన సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి విశేషంగా కృషి చేస్తున్నదని కొనియాడారు. తెలంగాణలో కొనసాగుతున్న పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేవన్నారు. సంక్షేమ పథకాల అమల్లో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో గ్రామాలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి చెందుతున్నాయన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు. అంతకుముందు ఆయన పట్టణంలోని ఏఎస్ క్రికెట్ అకాడమీని ప్రారంభించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సంతోష్కుమార్, ప్రవీణ్కుమార్రెడ్డి, రాఘవాపూర్ సర్పంచ్ జగన్, కౌన్సిలర్ నాగేశ్వర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, రవికుమార్, ప్రవీణ్, ఆసిఫ్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.