పరిగి : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం పరిగిలోని బృందావన్గార్డెన్లో పీఆర్టీయూ టీఎస్ జిల్లా సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే మహేశ్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం బడులను బలోపేతం చేయడంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. బడుల్లో వసతులు, ఇతర పనుల కోసం రెండేళ్లలో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేయనుందన్నారు. ఉపాధ్యాయుల సమస్యలను సాధ్యమైనంత మేరకు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించే బాధ్యత సంఘం తీసుకుంటుందన్నారు. త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు, పీఆర్సీ ఏరియర్స్ ఇప్పించడం, ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుల పోస్టుల మంజూరు, పండిట్, పీఈటీల అప్గ్రేడేషన్ తదితర అంశాలు సంఘం పరిష్కరించడం జరుగుతుందన్నారు. వీటితో పాటు పాఠశాలల్లో పారిశుధ్య కార్మికుల నియామకం, కేజీబీవీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల సమస్యలు, సీఆర్పీ, ఎంఐఎస్ కో-ఆర్డినేటర్, ఐఈఆర్పి తదితర సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు.
కార్యక్రమంలో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్రావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కడియాల చంద్రశేఖర్, అమర్నాథ్, ఆయా మండలాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.