పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేసింది. ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించి ఎప్పటికప్పుడు సమ్యలను పరిష్కరిస్తున్నది. ప్రతి గ్రామపంచాయతీకి కార్యాలయ భవనం ఉండాలని నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్ జిల్లాకు 276 నూతన గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేసింది. ఒక్కో భవన నిర్మాణానికి రూ.20లక్షల చొప్పున కేటాయిస్తూ త్వరలో పనులు ప్రారంభించేలా రాష్ట్ర సర్కారు చర్యలు చేపట్టింది. సర్కారు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పరిపాలన వ్యవస్థ మరింత పటిష్టవంతంగా మారనున్నది.
పరిగి, డిసెంబర్ 18 : పరిపాలనను ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్ణయించి కొత్తగా గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసింది. ప్రతి గ్రామపంచాయతీకి ఒక కార్యదర్శి నియామకంతో ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారంతోపాటు పాలన మరింత సజావుగా సాగేలా సర్కారు తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మరోవైపు ప్రతి గ్రామపంచాయతీకి కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో చరిత్రలోనే మొదటిసారి పెద్దఎత్తున గ్రామపంచాయతీ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసింది. వికారాబాద్ జిల్లాని 18 మండలాల పరిధిలో 566 గ్రామపంచాయతీలున్నాయి. వాటిలో 327 గ్రామపంచాయతీ కార్యాలయాలకు సొంత భవనాలు, 139 అద్దె భవనాలు, మరో 100 గ్రామపంచాయతీలకు కార్యాలయాలు లేక ఏదో ఒక భవనంలో కొనసాగుతున్నాయి. ప్రతి గ్రామపంచాయతీకి ఒక భవనం చొప్పున ఉండేందుకు సర్కారు ప్రతి జిల్లాకు అవసరమైన మేరకు గ్రామపంచాయతీ కార్యాలయాలను మంజూరు చేసింది. ఈ మేరకు నూతనంగా, రాష్ట్రంలోనే అత్యధికంగా వికారాబాద్ జిల్లాకు 276 నూతన గ్రామపంచాయతీ భవనాలు మంజూరయ్యాయి. ఒక్కో గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి రూ.20లక్షలు సర్కారు కేటాయించింది.
తీరనున్న ఇబ్బందులు
గతంలో ఉన్నవాటితోపాటు ప్రభుత్వం నూతన గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసింది. వీటిలో గిరిజన గ్రామపంచాయతీలు కూడా ఉన్నాయి. కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుతో పాలనను మరింత వికేంద్రీకరణ చేసింది. ప్రధానంగా సర్పంచ్, గ్రామపంచాయతీ కార్యదర్శి కూర్చోవడానికి ప్రత్యేక గదులు, సమావేశ నిర్వహణకు హాలు నిర్మాణం చేపట్టనున్నారు. భవనాల నిర్మాణంతో శాశ్వత కార్యాలయాల్లోనే గ్రామపంచాయతీ సమావేశాలు జరపడానికి అవకాశం కలుగుతుంది. గ్రామపంచాయతీకి సంబంధించిన రికార్డులు భద్రపరచడానికి ఈ భవనాల నిర్మాణం ఎంతో దోహదం చేస్తుంది. గ్రామపంచాయతీకి ట్రాక్టర్, ట్యాంకర్, డోజర్లు ఉండడంతో ఎక్కడపడితే అక్కడ కాకుండా శాశ్వత భవనం నిర్మాణం తర్వాత కార్యాలయ ఆవరణలో ఉంచనున్నారు. గ్రామపంచాయతీ కార్మికులు ఉపయోగించే సామాగ్రి సైతం కార్యాలయంలో భద్రపరచవచ్చు.