వికారాబాద్, మార్చి 11 : జిల్లాలోని పలు గ్రామాల్లోని పంచాయతీ బిల్డింగ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి ఆదేశించారు. సోమ వారం టెలికాన్ఫరెన్స్ ద్వారా జిల్లా లో జరిగే అభివృద్ధి నిర్మాణ పనుల్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేకుండా గ్రామ పంచాయతీలు ఉండకూడదన్నారు. నిర్మాణ పనుల్లో జాప్యం జరుగకుండా ప్రతి రోజూ జరగాల్సిన పనులకు ఎన్ని మిల్లర్లు, ఎంత మంది లేబర్ అవసరమో అంచనాలు వేసుకుని పనులను పూర్తి చేయాలన్నారు.
మండలంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఎక్కడ కూడా ఆగకుండా చేయాలని, ప్రతి గ్రామపంచాయతీ బిల్డింగ్స్, స్కూల్స్ ప్రహరీలు, కిచెన్ షెడ్ల నిర్మాణాలను ముందే ప్రారంభించి పూర్తి చేసి, వివరాలను ఎఫ్టీవో జనరేట్ చేయాలన్నారు. ఈ నెల 15 వరకు కచ్చితంగా పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాలో సీసీ రోడ్లకు మంజూరైన నిధులతో అంచనాలను రూపొందించుకుంటూ పనుల్లో వేగం పెంచాలన్నారు. ఈ సందర్భంగా మండలాల వారీగా నిర్మాణ పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. టెలికాన్ఫరెన్స్లో పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు, డీఈలు, ఈఈలు, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.