కడ్తాల్ : మండలంలో చేపట్టిన బృహత్ పల్లెప్రకృతి వనం పనులను త్వరగా పూర్తి చేయాలని డీఆర్డీవో పీడీ ప్రభాకర్ అన్నారు. మండల పరిధిలోని మైసిగండి గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనం పనులను ఎంపీడీవో రామకృష్ణ, ఏంపీవో తేజ్సింగ్తో కలిసి శనివారం ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా పీడీ ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లెప్రకృతి వనాన్ని సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కూలీల సంఖ్యను పెంచి పనులను త్వరగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. 6 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న పల్లెప్రకృతి వనంలో 10వేల మొక్కలు నాటాలన్నారు. అదే విధంగా కడ్తాల్-తలకొండపల్లి రహదారికిరువైపులా మొక్కలను నాటాలని అధికారులకు సూచించారు. అనంతరం కడ్తాల్ మండల కేంద్రంలోని పల్లెప్రకృతి వనాన్ని ఆయన పరిశీలించారు. కార్యక్రమంలో ప్లాంటేషన్ మేనేజర్ సక్కుబాయి, సర్పంచ్లు లక్ష్మీనర్సింహారెడ్డి, తులసీరాంనాయక్, ఏపీవో అంజయ్య, టీఏ రవి, పంచాయతీ కార్యదర్శులు రాంచంద్రారెడ్డి, సత్యం పాల్గొన్నారు.