ప్రగతి పథంలో పల్లెలు పరుగులు తీస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’, ప్రత్యేక నిధులతో పట్టణాలకు దీటుగా పల్లెల రూపురేఖలు మారాయి. ఏ ఊరికెళ్లినా అద్భుతమైన రోడ్లు, వాటి వెంట పచ్చని హరితహారం మొక్కలు దర్శనమిస్తున్నాయి. ప్రతి వీధిలో సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలను నిర్మించారు. చివరి మజిలీకి ఎలాంటి సమస్య లేకుండా ఏ పల్లెకెళ్లినా వైకుంఠధామాలను ఏర్పాటు చేశారు. ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్ యార్డుల్లో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ‘మన ఊరు-మన బడి’తో సకల సౌకర్యాలతో పాఠశాలలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు తాగునీటికి నానా తంటాలు పడిన పల్లెవాసులు… ‘మిషన్ భగీరథ’తో పుష్కలంగా తాగునీటి సరఫరా అవుతున్నది. అద్భుతంగా, ఆదర్శంగా మారిన కొత్తూరు మండలం పెంజర్ల, నందిగామ మండలం చేగూర్ల గ్రామాలు ప్రభుత్వ పని తీరుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.
రంగారెడ్డి, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : పల్లెలు ప్రపంచానికి పట్టు కొమ్మలు. పచ్చని వాతావరణంలో అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా పల్లెలు పట్టణాలకు దీటుగా రూపుదిద్దుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలోని ప్రతి గ్రామం అభివృద్ధి దిశలో కొనసాగుతున్నది. గ్రామీణ ప్రజలు, సర్పంచ్, పాలకులు, కార్యదర్శి, కారోబార్లు సైతం గ్రామాల్లో జరుగాల్సిన పలు అభివృద్ధి పనులపై దృష్టి సారిస్తున్నారు. గ్రామాల్లో ఏర్పడుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పాలకులకు చేరవేస్తూ పరిష్కరించుకుంటున్నారు.
పురోగమనం దిశగా గ్రామాల అడుగులు..
రంగారెడ్డి జిల్లాలో 558 గ్రామాలుండగా, దాదాపు అన్ని గ్రామాలు అభివృద్ధి పథంలో అడుగులు వేస్తున్నాయి. గ్రామాల్లో ఎక్కడ చూసినా పట్టణీకరణకు అడుగులు పడుతున్నాయి. సీసీ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా పచ్చని చెట్లు, పరిశుభ్రమైన వాతావరణం, చెత్తాచెదారం లేని వీధులు, తడి, పొడి చెత్త వేసుకునేలా డంపింగ్ బిన్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికీ నగరం, పట్టణాల్లో లేని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పల్లెల్లో కనిపిస్తున్నది. మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామాల్లో తాగునీటి ఎద్దడిని దూరం చేసింది. గ్రామ గ్రామాన నీటి ట్యాంకులను ఏర్పాటు చేసింది. మిషన్ కాకతీయ లాంటి పథకంతో చెరువులను పునరుద్ధరించుకొని సాగునీటికి చోటు చేసుకుంటున్న ఇబ్బందులను సైతం దూరం చేసింది. గ్రామాలకు అనుకూలంగా వైకుంఠ ధామాలను ఏర్పాటు చేసింది. షాద్నగర్ పరిధిలోని పెంజర్ల, చేగూర్ గ్రామాలు అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయి. పొరుగు గ్రామాలకు అభివృద్ధిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి.
పట్టణ వాతావరణం పెంజర్ల సొంతం
పెంజర్ల గ్రామంలో ఎటు చూసినా పారిశుధ్యం, పరిశుభ్రత, పచ్చదనం చోటు చేసుకున్న వీధులే ప్రధానంగా కనిపిస్తాయి. విశాలమైన వీధుల్లో సీసీ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా పచ్చని మొక్కలు, చెట్లు దర్శనమిస్తున్నాయి. కొత్తూరు మండల పరిధిలో ఉన్న ఈ పెంజర్ల గ్రామం అభివృద్ధిలో ముందంజగా కొనసాగుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో గ్రామానికి సమకూర్చుకోవాల్సిన తాగునీరు కోసం వాటర్ ట్యాంకులు, సాగునీటి కోసం చెరువులను పునరుద్ధరించుకున్నారు. పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, పశు వైద్య కేంద్రాలను పాలకులు ఏర్పాటు చేసుకున్నారు. గ్రామానికి కార్పొరేట్స్థాయిలో గ్రామ పంచాయతీ కార్యాలయం, చిన్నారుల కోసం రెండు అంగన్వాడీ కేంద్రాలు, ప్రాథమిక, జిల్లా పరిషత్ పాఠశాలలను ఏర్పాటు చేసుకున్నారు.
గ్రామంలో తాగునీటి రెండు ట్యాంకులు
వెయ్యి గడపలున్న గ్రామంలో ఆరువేల జనాభా వుంది. కాగా, గ్రామంలో 2600 ఓటర్లున్నారు. ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందుతున్నది. లక్ష లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్, 40 వేల లీటర్లతో మరో వాటర్ ట్యాంక్ను నిర్మించారు. రూ.29 లక్షలతో ‘మన ఊరు – మన బడి’లో భాగంగా పాఠశాల భవనాన్ని నిర్మించుకుంటున్నారు. సర్పంచ్ మామిడి వసుంధర గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. వీరే కాకుండా పీ అండ్ జీ (ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్) వారి ఆర్థిక సాయంతో జిల్లా పరిషత్ హైస్కూల్లో పిల్లల కోసం తాగునీటి ఫ్యూరిఫైయర్, సీసీ కెమెరాలు, ఇంకా మౌలిక వసతులు, భవన నిర్మాణాలకు చేయూతనిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం అందిస్తున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పెంజర్ల గ్రామ పాలకులు అందుకుని గ్రామాభివృద్ధికి తోడ్పడుతున్నారు. హరిత హారంలో భాగంగా ఇప్పటికే 22 వేల మొక్కలను పంపిణీ చేసి నాటించారు.
అండర్ గ్రౌండ్ డ్రైనేజీ.. చేగూరు సొంతం..
చేగూరు పల్లె.. ప్రకృతి వనాలు, పచ్చదనం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీతో పట్టణీకరణను అందుకున్నది. కనీవినీ ఎరుగని రీతిలో చేగూరు గ్రామం అభివృద్ధికి బాటలు వేసుకున్నది. ఊరంతా సీసీ రోడ్లు, పారిశుద్ధ్య వాతావరణంలో అలరారుతున్నది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ‘మన ఊరు – మన బడి’లో భాగంగా లక్షలాది రూపాయలు వెచ్చించి ప్రాథమిక, జిల్లా పరిషత్ హైస్కూల్ను విద్యార్థులకు అనుకూలంగా విశాల వాతావరణంలో తీర్చిదిద్దారు. పిల్లల ఆట పాటల కోసం పాఠశాలలో క్రికెట్, బాస్కెట్ బాల్, వాలీబాల్ కోర్టులను సైతం ఏర్పాటు చేశారు.
పచ్చదనానికి ప్రాధాన్యం..
గ్రామంలో పచ్చదనానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసి స్థానికంగా పచ్చదనాన్ని పెంపొందించారు. ఇప్పటికే 27 వేల మొక్కలను హరితహారంలో భాగంగా పంపిణీ చేశారు. ఊరు చుట్టూరా మొక్కలను నాటి పచ్చదనానికి ప్రాముఖ్యతను ఇచ్చారు. గ్రామ సర్పంచ్ సంతోష మూడు సీసీ రోడ్లును ఏర్పాటు చేశారు. వీధుల్లో విద్యుత్ స్తంభాలు, వైకుంఠధామంలో లైట్లు, వీధి లైట్లను తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు.
ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు..
మా గ్రామంలో తెలంగాణ రాకతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకున్నాం. సొంత నిధులతో ఊరిలో పాఠశాల భవనం, వైకుంఠ ధామానికి రెండున్నర కిలో మీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించాం. లక్షలాది రూపాయలు వెచ్చించి గ్రామంలో చెత్త బుట్టలు ఏర్పాటు చేసినం. సీసీ రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటించి పచ్చదనానికి, పరిశుభ్రతకు చేయూతను ఇచ్చినం. గ్రామంలో 100 విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేసినం. పాఠశాలకు డిజిటల్ టీవీని, బతుకమ్మ ఘాట్ను ఏర్పాటు చేసినం. పలు ఆలయాల అభివృద్ధికి చేయూతను ఇచ్చినం.
– మామిడి వసుంధర, సర్పంచ్, పెంజర్ల గ్రామం
గ్రామాభివృద్ధికి తోడ్పాటు..
గ్రామంలో సీసీ రోడ్లు, పల్లె ప్రకృతి వనాలు, డ్రైనేజీ, పారిశుధ్యానికి ప్రాముఖ్యత ఇచ్చాం. సీఎం కేసీఆర్ పాలనలో మా ప్రాంతంలో పురోగతికి ఎలాంటి ఇబ్బంది లేదు. మా పని తీరుకు నాటి కలెక్టర్ అమయ్కుమార్ మెచ్చుకొని రూ.38 లక్షల 50 వేలు విలేజ్ డెవలప్మెంట్కు అందించారు. సీసీ రోడ్లకు రూ.28 లక్షల 50 వేలు మంజూరు చేశారు. డ్రైనేజీ పనులను చేపట్టాం. ఇప్పటివరకూ రూ. 2.5 కోట్లు గ్రామాభివృద్ధికి వెచ్చించాం. ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అభివృద్ధికి చేయూతను ఇచ్చారు.
– మామిళ్ల సంతోష, సర్పంచ్, చేగూరు