పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండగా.. మహోజ్వల ఘట్టం ఆవిష్కృతమైంది. శనివారం నార్లాపూర్ వద్ద సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేయగానే కృష్ణమ్మ జల సవ్వడి ప్రజల్లో కొండంత సంబురాన్ని నింపింది. దశాబ్దాల కల నిజం కాగా.. జనం పండుగ చేసుకున్నారు. రైతుల కండ్లల్లో ఆనందం వెల్లివెరిసింది. ఈ వేడుకను కండ్లారా వీక్షించేందుకు మంత్రులు సబితారెడ్డి, పట్నం మహేందర్రెడ్డిలతోపాటు ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నేతృత్వంలో ఉమ్మడి జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున తరలివెళ్లారు. వారి సౌకర్యార్థం ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతోపాటు భోజన, నీటి వసతిని సమకూర్చింది. రంగారెడ్డి జిల్లా నుంచి 266, వికారాబాద్ జిల్లా నుంచి 134 బస్సుల్లో బయలుదేరారు. సీఎం కేసీఆర్ పిలుపు మేరకు కృష్ణా జలాలతో గ్రామాల్లోని దేవుళ్లకు అభిషేకం చేసేందుకు ప్రజలు కలశాల్లో జలాలు తెచ్చుకున్నారు. నేడు గ్రామ పంచాయతీల్లో జలాభిషేకం సంబురం అంబరాన్నంటనున్నది. ఊరూరా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో భారీ ఊరేగింపులు నిర్వహించనున్నారు.
-రంగారెడ్డి, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ)
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రారంభోత్సవంతో మహోజ్వల ఘట్టం ఆవిష్కృతం కాగా.. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రజానీకం దశాబ్దాల కలను సైతం నెరవేరింది. శనివారం నార్లాపూర్ వద్ద సీఎం కేసీఆర్ నీరు విడుదల చేయగానే జల సవ్వడి చేసిన కృష్ణమ్మ కొండంత సంబురాన్ని నింపింది. పండుగ వాతావరణంలో జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన సబ్బండ వర్ణాలు పెద్దఎత్తున తరలివెళ్లాయి. ప్రారంభోత్సవ సంబురాన్ని ప్రజానీకం కండ్లారా చూసేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 400 ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేయడంతోపాటు భోజన, నీటి వసతిని సమకూర్చింది. గ్రామాల్లోని దేవుళ్లకు అభిషేకం చేసేందుకు కలశాల్లో గంగా జలాలు శనివారం సాయంత్రానికి జిల్లాలకు చేరాయి. ఆదివారం గ్రామపంచాయతీల్లో సంబురంగా ఈ తంతును నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
– రంగారెడ్డి, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ)
సీఎం కేసీఆర్కు అడుగడుగునా నీరాజనం
గులాబీ జెండాలు.. ఫ్లెక్సీలు.. బ్యానర్లు.. ఎటు చూసినా గులాబీమయం.. పటాకుల మోత. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ రాక సందర్భంగా రంగారెడ్డి జిల్లాలో శనివారం దారి పొడవునా నెలకొన్న సందడి ఇది. లక్షల ఎకరాలకు సాగు నీరు, వందల గ్రామాలకు తాగునీటి గోస తీర్చే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి బయల్దేరి వెళ్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్కు ప్రజానీకం ఆత్మీయంగా స్వాగతం పలికింది. ప్రారంభోత్సవం కోసం ప్రగతి భవన్ నుంచి మధ్యాహ్నం సీఎం కేసీఆర్ రోడ్డు మార్గాన బస్సులో వెళ్లారు. కేసీఆర్ వెంట మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులతో కూడిన భారీ కాన్వాయ్ బయలుదేరింది.
ఓఆర్ఆర్ మీదుగా వెళ్లిన కాన్వాయ్ తుక్కుగూడ వద్ద శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారి మీదుగా సాగడంతో కొత్త శోభ సంతరించుకుంది. కందుకూరు వద్ద పెద్దఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు చేరి సీఎంకు ఘన స్వాగతం పలికారు. రహదారి పొడవునా పూలు చల్లుతూ, గులాబీ కాగితాలు వెదజల్లుతూ నీరాజనం పలికారు. పటాకుల మోతతో దారులన్నీ ప్రతిధ్వనించాయి. జై తెలంగాణ, జై కేసీఆర్, జై భారత్ నినాదాలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సందడి చేశారు. ఆమనగల్లు మీదుగా సాగిన కాన్వాయ్ కల్వకుర్తి మీదుగా నాగర్ కర్నూల్ వైపుగా ముందుకు సాగగా.. అడుగడుగునా ఘన స్వాగతం లభించింది. సీఎం కేసీఆర్ బస్సులో నుంచే అభివాదం చేస్తూ ఉత్సాహంతో ముందుకు సాగారు.
పల్లెపల్లె నుంచి జన జాతరగా..
రంగారెడ్డి జిల్లా వరప్రదాయని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జిల్లా ప్రజానీకం జన జాతరలా తరలివెళ్లింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మంచిరెడ్డి కిషన్రెడ్డి, కాలె యాదయ్య, అంజయ్యయాదవ్, జైపాల్యాదవ్ల నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు దండులా బయల్దేరి వెళ్లాయి. బీడు భూములను సస్యశ్యామలం చేసే కృష్ణమ్మ పరుగులను కనులారా వీక్షించేందుకు సబ్బండ వర్ణాలు కదం తొక్కాయి. పెద్దఎత్తున తరలివెళ్తున్న ప్రజానీకం కోసం తెలంగాణ ప్రభుత్వం సైతం ఏర్పాట్లు చేసింది. పల్లెపల్లె నుంచి వెళ్తున్న వారి కోసం 266 ఆర్టీసీ బస్సులను సమకూర్చింది. ఉదయం గ్రామాల్లోనే బ్రేక్ ఫాస్ట్ను అధికార యంత్రాంగం ఏర్పాటు చేసింది. మధ్యాహ్నం, రాత్రి భోజనాల కోసం ఆమనగల్లు, షాద్నగర్లలో పాయింట్లను ఏర్పాటు చేసి వెజ్ బిర్యానీ ప్యాకెట్లను అందజేశారు. వాటర్ బాటిళ్లను సైతం సమకూర్చారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి బయల్దేరడం మొదలుకుని గమ్యస్థానాలకు సురక్షితంగా చేరేవరకు ప్రత్యేకంగా అధికారులను నియమించారు.
నేడు ఊరూరా.. దేవుళ్లకు అభిషేకం
గంగా జలాలతో ఊరూరా దేవుళ్లను అభిషేకించాలన్న సీఎం కేసీఆర్ పిలుపు మేరకు జిల్లావ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆదివారం పంచాయతీల్లో ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా పంచాయతీ అధికారి పర్యవేక్షిస్తున్నారు. 330 కలశాల్లో నీటిని తెచ్చి ప్రతి గ్రామపంచాయతీకి ఒకటి చొప్పున అందజేయనున్నారు. పంచాయతీ కార్యదర్శులను ప్రత్యేకంగా నియమించి ప్రత్యేక వాహనంలో కలశాలలను తెప్పించారు. శనివారం సాయంత్రానికి గంగా జలంతో కూడిన కలశాలు జిల్లాకు చేరాయి.
నార్లాపూర్ రిజర్వాయర్ లిఫ్ట్-1 వద్ద వెట్న్న్రు ప్రారంభించిన సీఎం
వికారాబాద్, సెప్టెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అద్భుతం ఆవిష్కృతమైనది.. 70 ఏండ్ల కల సాకారమైంది.. కరువు నేలపై కృష్ణమ్మ పరుగు మొదలైనది. కాళేశ్వరానికి మించిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నార్లాపూర్ రిజర్వాయర్ వద్ద ప్రారంభించి నీటిని విడుదల చేశారు. పండుగలా జరిగిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మంత్రులు పి.సబితాఇంద్రారెడ్డి, పట్నం మహేందర్రెడ్డిలతోపాటు ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి, ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్రెడ్డి, కాలె యాదయ్య, కొప్పుల మహేశ్రెడ్డి, పైలట్ రోహిత్రెడ్డి, కలెక్టర్ నారాయణరెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.
నేడు ఊరూరా దేవుళ్లకు కృష్టా నీటితో అభిషేకం
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి నీటిని విడుదల చేసిన సందర్భంగా జిల్లా రైతాంగం ఊరూరా ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధమైనది. జిల్లావ్యాప్తంగా 560 గ్రామపంచాయతీలుండగా ఈ ప్రాజెక్టు ద్వారా కృష్ణా నీళ్లు 417 గ్రామాల దాహార్తిని తీర్చడంతోపాటు సాగు నీరందనుండడంతో ఆయా గ్రామాల రైతులు స్వచ్ఛందంగా పాలమూరు ఎత్తిపోతల ప్రారంభోత్సవ పండుగకు కలశాలతో తరలివెళ్లి కృష్ణా నీటిని తీసుకువచ్చారు. ఊరూరా ఎడ్లబండ్లు, ట్రాక్టర్లతో ఊరేగింపులు నిర్వహించి ఆయా గ్రామాల్లోని ఆలయాలకు వెళ్లి దేవుళ్లకు కృష్ణా నీటితో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు అభిషేకం చేయనున్నారు.
ప్రారంభోత్సవానికి భారీగా తరలివెళ్లిన రైతులు
ప్రారంభోత్సవానికి జిల్లా నుంచి రైతులు భారీగా తరలివెళ్లారు. జిల్లావ్యాప్తంగా 134 బస్సుల్లో రైతులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి తరలివెళ్లారు. కొడంగల్ నియోజకవర్గం నుంచి 100 బస్సులు, వికారాబాద్ నుంచి 14 బస్సులు, పరిగి, తాండూరు నియోజకవర్గాల నుంచి 10 చొప్పున ఆర్టీసీ బస్సుల్లో సుమారు 8 వేల మంది రైతులు వెళ్లారు.
ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా తాగు, సాగునీరు
వికారాబాద్ జిల్లాకు ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా తాగు, సాగు నీరందనున్నది. మరోవైపు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైతే జిల్లాలోని 3,41,951 ఎకరాలకు సాగునీరు, 417 గ్రామాలకు తాగునీరందించనున్నారు. తాండూరు నియోజకవర్గంలో 1,02,797 ఎకరాలు, వికారాబాద్ నియోజకవర్గంలో 94,871., పరిగి నియోజకవర్గంలో 90,028., కొడంగల్ నియోజకవర్గంలోని కొడంగల్, బొంరాస్పేట్, దౌల్తాబాద్, దుద్యాల మండలాల్లోని 54,255 ఎకరాలకు సాగు నీరందించనున్నారు.
పనులు వేగవంతం
ఉద్దండాపూర్ రిజర్వాయర్ వద్ద తాగునీటిని అందించే పనులతోపాటు సాగునీటినందించే పనులు కూడా వేగవంతమయ్యాయి. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు ద్వారా సాగు, తాగునీరందించేందుకు కాలువల నిర్మాణానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే చర్యలు చేపట్టగా, త్వరలోనే కాలువల నిర్మాణ పనులు ప్రారంభంకానున్నాయి. ఉద్దండాపూర్ రిజర్వాయర్ ద్వారా జిల్లాకు తాగు, సాగునీటి కాలువల నిర్మాణానికి ప్రభుత్వం రూ.5180 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేసిన ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసింది. ఉద్దండాపూర్ రిజర్వాయర్ నుంచి జిల్లాకు తాగునీటిని అందించేందుకు 100 కిలోమీటర్ల మేర కాలువలను నిర్మించనున్నారు. మరో రెండేండ్లలో ప్రాజెక్టు ద్వారా జిల్లాకు సాగునీరందనున్నది.