రంగారెడ్డి, మే 6(నమస్తే తెలంగాణ): జిల్లాలో మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య పెరుగుతున్నది. గత 15 రోజులతో పోలిస్తే ప్రస్తుతం కూలీల హాజరు సంఖ్య భారీగా పెరుగడం గమనార్హం. వ్యవసాయ పనులు పూర్తి కావడంతో జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలు పెరుగుతున్నారు. అయితే జిల్లావ్యాప్తంగా గత 15 రోజుల వరకు కేవలం 8వేల మంది కూలీలు ఉపాధి పనులకు రాగా, ప్రస్తుతం రోజుకు 38 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. అయితే రానున్న కొన్ని రోజుల్లో ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య 45 వేల వరకు చేరనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి వ్యవసాయ పనులు పూర్తి అయిన దృష్ట్యా భూములను చదును చేసే పనులతోపాటు మట్టి రోడ్ల నిర్మాణం, చెరువుల పూడికతీత పనులు, నీట ఊట గుంతల నిర్మాణం, వచ్చే ఆర్థిక సంవత్సరానికిగానూ హరితహారంలో భాగంగా నర్సరీల్లో మొక్కలు పెంచడం తదితర పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఈ ఆర్థిక సంవత్సరం 63 లక్షల పని దినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఇప్పటి వరకు 4లక్షల పని దినాలను జిల్లా యంత్రాంగం కల్పించింది. అంతేకాకుండా ప్రతీ ఒక్క కూలీకి వందరోజులపాటు పని కల్పించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జాతీయ ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీలకు రోజుకు రూ.257లను అందజేస్తున్నారు. గతంలో రూ.245 ఉన్న రోజువారీ కూలీని మార్చిలో రూ.257లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయించింది. అదేవిధంగా జిల్లావ్యాప్తంగా 1,57,952 జాబ్కార్డులుండగా 2,88,580 మంది కూలీలున్నారు.
38 వేలకు పెరిగిన కూలీలు…
జిల్లాలో ఉపాధి హామీ పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య గత 15 రోజులతో పోలిస్తే ప్రస్తుతం 30వేల వరకు పెరిగారు. ప్రస్తుతం రోజుకు 38 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు హాజరవుతున్నారు. జిల్లాలో 558 గ్రామ పంచాయతీలుండగా.. 520 గ్రామ పంచాయతీల్లో పనులు కొనసాగుతున్నాయి. అయితే జిల్లాలో ఉపాధి హామీ పథకం ద్వారా హరితహారంతోపాటు ఇంకుడు గుంతల నిర్మాణం, నీటి ఊట గుంతల నిర్మాణం, మట్టి రోడ్ల నిర్మాణం పనులను ప్రధానంగా చేస్తున్నారు. అంతేకాకుండా అసైన్డ్ భూముల్లోని రాళ్లను తీసివేయడం, భూమిని చదును చేయడం, బౌండ్రీలు ఏర్పాటు చేయడం, ఎరువు గుంతల నిర్మాణం, బోరుబావి తవ్వించడం తదితర పనులు అసైన్డ్ భూముల్లో చేపట్టనున్నారు.
ఇంకుడు గుంతల నిర్మాణం, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, మట్టి కట్టలు, నీటి ఊట గుంతలు, పశువులకు షెడ్ల ఏర్పాటు, భూఉపరితల నీటి గుంతల నిర్మాణం, పంట కాలువల మరమ్మతులు, పంట మార్పిడి కల్లాలు, కొత్త సేద్యపు బావులు తవ్వడం, నిరవధిక సమతల కందకాలు, ఖండిత సమతల కందకాలు, కొండ దిగువ ప్రాంతాల్లో నీటి నిల్వ కందకాలు, పశువుల నిరోధక కందకాలు, భూసార సంరక్ష కందకాలు, కొత్త పంట కాలువల నిర్మాణం, మైనర్ ఇరిగేషన్ కాలువలో పూడికతీత, చేపల ఉత్పత్తి కుంటల నిర్మాణం, వరద కట్టల నిర్మాణం పనులను చేస్తున్నారు. అయితే గత ఆర్థిక సంవత్సరం 80.17 లక్షల పని దినాలను కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా, ఈ ఆర్థిక సంవత్సరానికి మాత్రం 17 లక్షల పని దినాలను తగ్గిస్తూ 63.09 లక్షల పని దినాలను కల్పించాలని టార్గెట్గా నిర్ణయించారు.
మరింత పెరుగనున్న కూలీలు
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద పనులకు హాజరయ్యే కూలీలు పెరుగనున్నారు. యాసంగి వరి సాగు పనులు కూడా పూర్తయిన దృష్ట్యా కూలీల సంఖ్య పెరుగనున్నది. అంతేకాకుండా అర్హులైన ప్రతి కూలీకి వంద రోజులపాటు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. ప్రతిరోజూ పనులకు సంబంధించి ఫొటోలను యాప్లో పొందుపరుస్తున్నాం.
– నీరజ, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఏపీడీ